మంచిర్యాల, జూలై 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ యేడాది ఇప్పటివరకు రికార్డుస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా పడుతుండడంతో పంటలు, ఇండ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా.. పశువులు మృత్యువాత పడ్డాయి. మంత్రి అల్లోల, విప్ సుమన్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నారు. జనాలతోనే మమేకమై వెన్నంటే ఉంటున్నారు. ఆపత్కాలంలో అధైర్య పడకండి మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటామనే ధైర్యాన్నిస్తున్నారు. అధికారులు నష్టం అంచనాను రూపొందించాలని ఆదేశిస్తూనే.. ప్రభుత్వానికి నివేదికలు పంపి సాయం అందేట్లు చేస్తామని నాయకులు హామీ ఇస్తున్నారు. కాగా.. రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. వర్షాల నుంచి తేరుకొని యథాస్థితికి వస్తున్నారు. రాష్ట్ర సర్కారు తక్షణమే స్పందించిన తీరు, సహాయక చర్యలు ముమ్మరం చేసిన పద్ధతి, పునరావాస కేంద్రాలకు తరలించడం, హెల్ప్లైన్ సెంటర్లు, రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచడం, పునరావాస కేంద్రాల్లో భోజనం, బస ఏర్పాటు చేయడం వంటి వాటితో సీఎం కేసీఆర్ను మరువమని బాధితులు తెలుపుతున్నారు.
జోరు వానలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తాయి. కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, మంచిర్యాల పట్టణాలు చెరువులను తలపించాయి. అధికారుల అప్రమత్తత, నాయకుల పర్యవేక్షణతో వరద ప్రభావిత ప్రాంతాలన్నీ తేరుకుంటున్నాయి. రెండు రోజులుగా వరదలో చిక్కుకున్న ప్రాంతాలన్నీ శనివారం మధ్యాహ్నానికి సాధారణ స్థితికి చేరుకున్నాయి. మూడు రోజులుగా ముంపు పొంచి ఉన్న ప్రాంతాలు, గ్రామాల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు రిలీఫ్ సెంటర్లకు తరలించారు. మూడు రోజులపాటు వారికి వసతి, భోజన ఏర్పాట్లు చేయించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దాదాపు 300 మంది సెంటర్లలో ఉన్నారు. ఆపద కాలంలో కంటికి రెప్పలా కాపాడుకున్న సర్కార్కు రుణపడి ఉంటామని, చేసిన సాయాన్ని మరువలేమని బాధితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
గోదావరిలో తగ్గిన వరద..
కడెం, ఎస్సారెస్పీ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదలడంతో మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు భారీగా వరద వచ్చింది. దీంతో శుక్రవారం రాత్రి వరకు కూడా దాదాపు 9-10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనకు వదిలారు. దీంతో మంచిర్యాల పట్టణం నుంచి వెళ్లే రాళ్లవాగు నీరు గోదావరిలోకి వెళ్లలేక వెనక్కి వచ్చింది. వాగు పక్కనే ఉన్న రాంనగర్, ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసీ కాలనీలు నీట మునిగాయి. ప్రస్తుతం కడెం, ఎస్సారెస్పీ నుంచి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో ఎల్లంపల్లి నుంచి 1.87 లక్షల క్యూసెక్కులు మాత్రమే కిందకు వస్తుండడంతో రాళ్లవాగులో నిలిచిన నీరంతా తిరిగి గోదావరిలోకి వెళ్తోంది. దీంతో జలయమమైన కాలనీల్లో చుక్కనీరు లేకుండా వెళ్లి పోయింది. దీంతో పేరుకుపోయిన బురదను తొలిగించే పనిలో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. కలెక్టర్ బదావాత్ సంతోష్, జాయింట్ కలెక్టర్ మోతీలాల్, అదనపు కలెక్టర్ రాహుల్, ట్రైయినీ కలెక్టర్ గౌతమి పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, ఎంఆర్వో రాజేశ్వర్ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. వైద్యాధికారులు ప్రజలకు కావాల్సిన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు.
స్వల్ప నష్టం.. నాయకుల భరోసా..
ఎన్టీఆర్ నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీల్లోని వందల ఇండ్లలోకి నీరు చేరింది. గ్రౌండ్ ఫ్లోర్ సగానికి నీరు వచ్చింది. దీంతో సామగ్రి పాడైపోయింది. సోపాలు, తలుపులు, కబోర్డులు ఊడిపోయాయి. ఎలక్ట్రానిక్ వస్తువులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో కొంత ఇబ్బంది తప్పింది. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, చైర్మన్ పెంట రాజయ్య ఆయా ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ వాగుపై కరకట్టలు కట్టాలనే విషయాన్ని గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, మరోసారి జనాల ఇబ్బందులు వివరించి సాధ్యమైనంత త్వరగా కరకట్టలు కట్టేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే దివాకర్రావు తెలిపారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంబంధించి చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ రాహుల్, జేసీ మోతీలాల్తో సమీక్ష నిర్వహించారు. చెన్నూర్ పట్టణ, రూరల్ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, నాయకులు సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం చెన్నూర్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాల్క సుమన్ పర్యటించారు.
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని స్వర్ణపై గల జాఫ్రాపూర్, మాదాపూర్ బ్రిడ్జిలను, సారంగా పూర్ మండలంలో ధ్వంసమైన మలక్ చించోలి రోడ్డును మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. అలాగే కంకెట, వైకుంఠాపూర్ గ్రామాలను కూడా సందర్శించారు.
భైంసా మండలంలోని ఇలేగాం, వాలేగాం, సిరాల గ్రామాలతోపాటు భైంసా పట్టణంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పర్యటించారు.
భైంసా పట్టణంలో వరద ముంపునకు గురైన కాలనీల్లో రాష్ట్ర ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి పర్యటించి బాధితులను ఓదార్చారు.
కడుపునిండా తిండి పెట్టిన్రు
మంచిర్యాలటౌన్, జూలై 29 : మస్తు వర్షం పడింది. వరద ప్రవా హం పెరుగుతుందని ముందునుంచే చెప్పిన్రు. ఖాళీ చేయకుం టే ప్రమాదమన్నరు. ఇగ మేము కూడా సామన్లు సర్ధుకొని రెడీగా ఉన్నం. ఎక్కడికి పోవుడో తెల్వక బాధనిపించింది. ఏం పర్వాలేదు అని సార్లు, నాయకులు భరోసా ఇచ్చిన్రు. పక్కనే ఉన్న కార్మిక సంఘ భవనంలో వసతి ఏర్పాటు చేసిన్రు. ట్రాక్టర్లో అక్కడికే పోయినం. సమయానికి కడుపునిండా తిండి పెట్టిన్రు. రెండు రోజులు పునరావాస కేంద్రంలనే ఉన్నం. ఏం ఇబ్బంది రాకుంట చూసుకున్నరు.– బొత్తుల దుర్గమ్మ, కూలీ, ఎన్టీఆర్నగర్
సర్కారోళ్లు అన్ని ఏర్పాట్లు చేసిన్రు..
మంచిర్యాలటౌన్, జూలై 29 : గోదావరికి మస్తు వరద వచ్చింది. ఇటు రాళ్ల వాగు కూడా ఉప్పొంగింది. ఏ క్షణం ఏమవుతుందోనని మస్తు భయపడ్డం. తెల్లారేసరికి ఇండ్లళ్లకు నీళ్లు వస్తయని అర్థమైంది. అధికారులు, మా కౌన్సిలరు ముందు రోజు రాత్రే పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిండ్రు.. అక్కడికి పొమ్మని చెప్పిన్రు. వెంటనే అన్నీ సర్ధుకొని మా ఇంటోళ్లందరం కార్మిక సంఘ భవనంలోకి పోయినం. అనుకున్నట్లే పొద్దునకల్లా వరదంతా ఇండ్లళ్లకు చేరింది. పునరావాస కేంద్రంలో సర్కారోళ్లు మాకు అన్ని ఏర్పాట్లు చేసిన్రు. తాగునీళ్లిచ్చిన్రు. పొద్దున టిఫిన్ పెట్టిన్రు. కడుపునిండ బువ్వ పెట్టిన్రు. బాధలేకుండా చూసుకున్నరు.
– ఇప్ప శంకర్, పెయింటర్ కార్మికుడు, ఎన్టీఆర్ నగర్
ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది
మంచిర్యాలటౌన్, జూలై 29 : వరదతో ప్రమాదముం దని ముందే ప్రజలను అప్రమత్తం చేశాం. ఎల్లంపల్లి నీరు విడుదల చేస్తున్నారని మున్సిపల్, రెవెన్యూ అధికారులు వార్డులోకి వచ్చి చెప్పారు. వెంటనే వాహనాల్లో అందరినీ కార్మిక సంఘ భవనం లోకి తరలించాం. మా వార్డులో దాదాపు 150 ఇండ్ల లోకి వరద వచ్చి చేరింది. ముందస్తు సమాచారంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ముంపు బాధితులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది.
– బదావత్ ప్రకాశ్, ఏడోవార్డు కౌన్సిలర్, మంచిర్యాల
వరద తగ్గిన తర్వాత నష్టం అంచనా..
మంచిర్యాల అర్బన్, జూలై 29 : జిల్లాలో వారానికిపైగా కురిసిన వర్షాలకు పంట పొలాలు, చేలు నీటితో నిండుకొని ఉన్నాయి. వర్షం తగ్గుముఖం పట్టడంతో పొలాల్లో నిలిచిన వరద బయటకు వెళుతుంది. నీరంతా వెళ్లిన తర్వాత ఎన్ని ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి, ఎన్ని ఎకరాల్లో ఏయే పంట లకు ఎంత శాతం నష్టం వచ్చిందో అంచనా వేస్తాం. ప్రస్తుతం మన జిల్లాలో పత్తి విత్తి సుమారు నెల అవుతోంది. వరి బావుల కింద కొంత మేర వేశారు. వరద వెళ్లాక నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తాం.
– కల్పన, జిల్లా వ్యవసాయాధికారి, మంచిర్యాల