Abhaya Hastham | అభయహస్తం ఐదు గ్యారెంటీల దరఖాస్తు ఫారం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నది. పూర్తి లోపబూయిష్టంగా ఉండగా, దరఖాస్తు దారులను తికమకపెడుతున్నది. అప్లికేషన్ నింపేటప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతుండగా, ఆయాచోట్ల ఉన్న అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం అయోమయానికి గురిచేస్తున్నది. ఇక చేసేదేమీ లేక కొందరు నిరాశతో వెనుతిరుగుతుండగా, మరికొందరు తమకు తోచినంత వరకు ఫారం నింపి ఇచ్చేసి రావడం కనిపిస్తున్నది. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ప్రతి సందేహంపై పూర్తి క్లారిటీ ఇవ్వాలని ప్రజానీకం కోరుతున్నది.
మంచిర్యాల, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభయహస్తం ఐదు గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు నింపమనడమో.. లేక టెక్నికల్ సమస్యలపై అధ్యయనం చేసి విధివిధాలను సిద్ధం చేయకపోవడమో తెలియదు కానీ.. పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకానికి సంబంధించి అన్నింటికీ ఒకే అర్జీ పత్రం తీసుకురాగా, అనేక సందేహాలు వస్తున్నాయి.
ఆయా అంశాల్లో స్పష్టత లేకపోవడంతో.. అక్కడున్న అధికారులను అడిగితే.. మీరైతే ఫారం నింపి ఇవ్వండి.. తర్వాత చూద్దాం అనే సమాధానం చెబుతున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ట్రాన్స్ఫర్ అవుతాం.. ఈ అప్లికేషన్లను అడిగేవారెవరూ.. చూసేవారెవరూ అంటూ అధికారులే నిట్టూరుస్తుండడం గమనార్హం. ఈ విషయం బయటికి చెబితే ఇచ్చే పథకం ఎక్కడ ఆపుతారోనని జనం భయపడిపోతున్నారు. అనేక మంది చేసేదేమీలేక తమకు తోచినంత వరకు ఫారం నింపి ఇచ్చి పోతున్నారు.
మహాలక్ష్మి పథకం : 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.2500 ఇస్తామనేది ఈ పథక ముఖ్య ఉద్దేశం. కానీ.. రేషన్కార్డు తప్పనిసరి చేయడంతో చాలా మంది కంగారు పడుతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిన్నవయసులోనే ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేస్తారు. పైండ్లె పోయిన ఆడపిల్లలు ఆధార్కార్డులో భర్త ఇంటి పేరు.. అడ్రస్లు మార్చుకున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామనడంతో తల్లి ఊరిలో దరఖాస్తు చేసేందుకు ఆధార్కార్డులో వివరాలు మార్చుకోవాలా.. లేదా.. అనే విషయంపై స్పష్టత లేదు. దీంతో కొందరు ఆధార్లో వివరాలు మార్చుకునేందుకు ఆధార్ అప్డేషన్ సెంటర్ల దగ్గర క్యూ కడుతున్నారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్ : ఈ పథకం అమలు తీరుపైనా అనేక సమస్యలు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగం రీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. రేషన్కార్డు మాత్రం సొంత ఊరిలో ఉంది. గ్యాస్ కనెక్షన్ మరో ఊరిలో ఉంది. సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతారనే కాలమ్ ఇచ్చారు. అందులో వివరాలు నమోదు చేస్తే ఏమైనా కటాఫ్ పెడతారా అన్న సందేహం వస్తున్నది.
రైతు భరోసా పథకం : ఈ పథకం అప్లికేషన్ కూడా తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. ఇంటి యజమాని(భర్త) పేరుతో దరఖాస్తు చేస్తే, ఇంట్లో మిగిలిన వారి (భార్య, పిల్లలు) పేరు మీద ఉన్న భూమి సర్వే నంబర్లు ఎలా ఇవ్వాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉంటున్న వ్యక్తికి ఆధార్కార్డు, రేషన్ కార్డు ఇక్కడే ఉన్నాయి. కానీ వ్యవసాయ భూమి మాత్రం సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉన్న భూమి సర్వే నంబర్లు వేస్తే.. మంచిర్యాల అధికారులకు అది ఎలా తెలుస్తది.
కౌలు తీసుకున్న రైతులు కూడా దరఖాస్తు చేస్తారు సరే.. కానీ రైతు నుంచి కౌలు అగ్రిమెంట్ లేకపోతే దరఖాస్తులో చెప్పాలా.. వద్దా.. ఒక ఐదెకరాలు ఉన్న రైతు మరో ఐదెకరాలు వేరే వారి దగ్గర తీసుకొని సాగు చేస్తున్నాడు. అప్పుడు రెండూ కలిపితే 10 ఎకరాలు అవుతాయి. ఆ వివరాలు చెప్తే 10 ఎకరాలు ఉన్నాయని మొత్తానికే ఇయ్యకుంటే ఎట్లా… సాగు చేస్తున్న భూమి వివరాలు.. సర్వే నంబర్, విస్తీర్ణంతో పాటు చెప్పమని దరఖాస్తులో అడిగారు. కానీ చిన్న డ్యాష్ ఇచ్చి వదిలేశారు. అందులో రాయడానికే సరిపోవడం లేదని కొందరు చెబుతున్నారు. వీటన్నింటికీ సమాధానాలు కావాలని రైతులు అడుగుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు : ఇల్లులేని వారికి ఆర్థిక సాయం అనే కాలమ్ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు రెండు, మూడు ఫ్యామిలీలు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాయి. తల్లీతండ్రి, వారి కొడుకులు అంతా కలిసే ఉంటున్నారు. వీరందరి అడ్రస్ ఒకటే.. ఇందులో మిగిలిన వారికి సొంత ఇళ్లు కావాలంటే దరఖాస్తు చేశాక… ఆధార్ కార్డు, రేషన్ కార్డు అడ్రస్ చూసి తిరస్కరిస్తారా.. లేక కొత్త ఇండ్లు కట్టుకోడానికి డబ్బులు ఇస్తారా… ఇంటి స్థలం లేకపోతే డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తారా, అసలే ఇవ్వరా.. అట్లాంటప్పుడు నిజమైన పేదలకు ఈ పథకం ఎలా న్యాయం చేస్తది. ఇక తెలంగాణ ఉద్యమం చేసి జైళ్లకు పోయినోళ్లు మాత్రమే ఉద్యమకారులా.. మిగిలిన వారు కాదా.. ఎఫ్ఐఆర్ అయినోళ్లకే ఇండ్లు ఇచ్చినప్పుడు శాంతియుతంగా ఉద్యమం చేసినోళ్లకు అన్యాయం చేసినట్లు కాదా.. అన్న ప్రశ్న తలెత్తుతుంది..?
గృహజ్యోతి పథకం : 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే పథకం ఇది. కానీ దీనికి అప్లయ్ చేయడంలోనూ అనేక సందేహాలు ఉన్నాయి. సొంత ఊరిలో కాకుండా సిటీలో, టౌన్లలో పనులు చేసుకొని బతికేటోళ్లు చాలా వరకు అద్దె ఇండ్లలో ఉంటున్నారు. అలాంటి వారికి అద్దె ఇంటి కరెంట్ బిల్లుకు ఉచిత విద్యుత్ను వర్తింప చేస్తారా.. లేదా.. ఆధార్ కార్డు అడ్రస్లో ఉన్న ఇంటికే ఉచిత కరెంట్ ఇస్తారా.. ఇక సొంత ఊరిలో కాకుండా టౌన్లలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ఉంటున్న దగ్గర ఉచిత కరెంట్ ఇస్తారా.. ఇవ్వరా… అసలు ఇలా రెండు మీటర్లు ఉన్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేయాలా.. వద్దా..
ఇక అన్నింటికంటే ముఖ్యమైన సమస్య రేషన్ కార్డు లేనోళ్లు. వీళ్లు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. దరఖాస్తు ఫారంలో చివరకు జత చేయాల్సిన ప్రతుల కాలమ్లో.. ఆధార్కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ అని చూపిస్తుంది. అంటే రేషన్ కార్డు లేనోళ్లు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నట్లే కదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో ప్రజా పాలన కౌంటర్లకు వెళ్లిన చాలా మంది దరఖాస్తు చేయకుండానే వెనుతిరుగుతున్నారు. రేషన్ కార్డుల విషయంలో ఊరికో ముచ్చట, అధికారికో మాట చెబుతుండడంతో హైరానా పడిపోతున్నారు. కొత్త రేషన్ కార్డులు లేక పాత రేషన్ కార్డుల్లో ఉన్న ప్రకారం ఆధార్ కార్డుల్లో పేర్లు, వివరాలు మార్చుకునేందుకు ఆధార్ సెంటర్లకు పోటెత్తుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించి దరఖాస్తు విషయంలో వచ్చే ప్రతి సందేహానికి క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.