బోథ్, నవంబర్ 30: రాష్ట్ర శాసనసభకు గురువారం జరిగిన పోలింగ్ బోథ్ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం చలి తీవ్రతకు తోడు పొగమంచు పడడంతో మందకొడిగా ప్రారంభమైంది. తొమ్మిది గంటల తర్వాత పోలింగ్ పుంజుకుంది. యువకులు, వృద్ధులు, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
33 గ్రామ పంచాయతీల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. బోథ్ మండల పరిధిలో సీఐ భీమేశ్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ వాహనాలతో కేంద్రాలను సందర్శించారు. వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్రాల వద్ద వీల్చైర్లు ఏర్పాటు చేయించారు. 5 గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 82.93 శాతం పోలింగ్ నమోదైంది.
బోథ్, నవంబర్ 30: బోథ్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం నాయకులతో కలిసి సిరా చుక్క వేలును చూపించారు. ఓటింగ్ సరళిని పరిశీలించారు.
గుడిహత్నూర్, నవంబర్ 30 :గుడిహత్నూర్ మండలంలో 76 శాతం పోలింగ్ నమోదైంది. మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ పరిశీలించారు.
బజార్హత్నూర్, నవంబర్ 30 : బజార్హత్నూర్ మండలంలో మొత్తం ఓటర్లు 23178 ఉండగా 18126 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడ సాంకేతిక లోపం వల్ల కొద్దిపాటి ఈవీఎంలు మోరయించడంతో అధికారులు ప్రత్యేక చొరవతీసుకొని వాటిని బాగుచేసి మళ్లీ ఓటింగ్ను కొనసాగించారు. మాజీ ఎంపీ గోడం నగేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం జాతర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
భీంపూర్, నవంబర్ 30 : భీంపూర్ మండలంలోని 28 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలంలో నాలుగు రూట్ల అధికారులు, సెక్టోరల్ అధికారులు విధులు నిర్వహించారు. భీంపూర్ పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు అశోక్ గోయల్ సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్, సీఐ నరేశ్ పర్యవేక్షించారు.
ఇచ్చోడ, నవంబర్ 30 : ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సిరికొండ మండలం సుంకిడి గ్రామంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కుస్రం నీలాదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాంసి, నవంబర్ 30: మండలంలోని 17 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 78 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాంసి, తలమడుగు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ పరిశీలించారు. పొన్నారి గ్రామంలో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ ఉత్సాహంగా కొనసాగింది. పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు.