‘ప్రజల ఆరోగ్యమే.. తమ శ్రేయస్సు’గా తెలంగాణ సర్కారు భావిస్తున్నది. కేసీఆర్ సీఎం అయ్యాక వైద్యశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానలను అప్గ్రేడ్ చేయడం, కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధునాతన పరికరాలు సమకూర్చడం, వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే నోటిఫికేషన్ల ద్వారా వేలాది పోస్టులు భర్తీ చేశారు. గ్రామీణ ప్రాంతవాసులకు కూడా కార్పొరేట్ వైద్యం అందుతున్నది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 956 మంది యువవైద్యులను నియమించగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 78 మందిని కేటాయించారు. వీరికి శిక్షణ ఇవ్వనుండగా.. ఈనెల 15వ తేదీలోపు విధుల్లో చేరనున్నారు. వైద్యశాఖకు యువరక్తం రాగా.. ఏజెన్సీలోని గూడేలు, తండాలు, పల్లెవాసులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.
ఆదిలాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రం లో పేదలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షగా ఉండేది. గతం లో పాలకుల నిర్లక్ష్యం కారణంగా సర్కారు దవాఖానల్లో అరకొర వసతులు, పాత భవనాలు, వైద్యులు, సిబ్బంది, మం దుల కొరత లాంటి సమస్యలు పట్టిపీడించేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో అన్ని వసతులు కల్పిస్తున్నది. అన్ని హంగులతో భవనాలను నిర్మించడంతోపాటు వ్యాధి నిర్ధారణ యంత్రాలను సమకూర్చడం, వైద్యులు, సిబ్బంది నియామకం, వివిధ వ్యాధులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచడం లాంటి చర్యలు చేపట్టింది. ఫలితంగా ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో మలేరియా, టైఫాయిడ్, డయేరియా, ఇతర వ్యాధులతో గూడేలు, తండావాసులు మంచం పట్టేవారు. వైద్యం సరిగా అందక మరణాలు సంభవించేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వ్యాధులు నియంత్రణలోకి రావడంతోపాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 78 మంది వైద్యుల నియామకం
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వైద్యుల నియామకం చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 78 మంది డాక్టర్లను కేటాయించింది. ఆదిలాబాద్ జిల్లాకు 25, నిర్మల్కు 22, కుమ్రం భీం ఆసిఫాబాద్కు 18, మంచిర్యాలకు 13 మంది డాక్టర్లు కొత్తగా వచ్చారు. వీరు శిక్షణ అనంతరం విధుల్లో చేరనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలను మెరుగు పర్చడానికి కమ్యూనిటీ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీరిని నియమించింది. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఒకరు ఓపీ చూడనుండగా.. మరొకరు గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తారు. వైద్యుల రాకతో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.ప్రభుత్వం తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని యువ వైద్యులు అంటున్నారు.
ఈ ప్రాంతంపై అవగాహన ఉంది..
మాది ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్. ఈ జిల్లాలోనే పుట్టి పెరగడంతో, ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. ప్రభుత్వం ఇటీవల వైద్యుల నియామకం చేపట్టగా, నాకు ఉట్నూర్ మండలం శ్యాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్ ఇచ్చారు. గతంలో రిమ్స్లో తాత్కాలిక వైద్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. జిల్లా ప్రజల ఆరోగ్య సమస్యలపై పూర్తిగా అవగాహన ఉంది. ఏజెన్సీ పీహెచ్సీలో పనిచేసే అవకాశం కలగడం సంతోషంగా ఉంది. గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తా. ముఖ్యంగా సొంత జిల్లాలో పనిచేసే అదృష్టం కలగడం అదృష్టంగా భావిస్తున్నా.
– రాథోడ్ సందీప్ కుమార్, వైద్యుడు,
శ్యాంపూర్ పీహెచ్సీ.
పేదలకు సేవ చేసే భాగ్యం..
మంచిర్యాల ఏసీసీ, జనవరి 3: మాది హైదరాబాద్. పుట్టి, పెరిగింది అంతా అక్కడే. 2008లో ఆదిలాబాద్ రిమ్స్లోనే ఎంబీబీఎస్లో చేరా. 2013 లో పూర్తి చేశా. అనంతరం అక్కడే ఇంటర్న్షిప్ చేశా. ఖమ్మంలో పీజీ పూర్తి చేశా. ప్రభుత్వ వైద్యుల పోస్టుకు ఐప్లె చేసుకున్న. ఇంత త్వరగా మాకు మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలు అందించడం చాలా సంతో షంగా ఉంది. ప్రభుత్వ దవాఖానలో పనిచేయడమంటే పేదలకు సేవ చేసే భాగ్యం కలగ డమే. మెరుగైన వైద్యసేవలందించి నా బాధ్యతను నిర్వర్తిస్తా. నియామక పత్రాలు తీసుకొని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో సోమవారమే(జనవరి 2న) రిపోర్ట్ చేశా. విధుల్లో చేరడం చాలా సంతోషంగా ఉంది. కొత్త ప్రాంతం అయినా, ఇబ్బంది లేకుండా పనిచేస్తాననే నమ్మకం ఉంది. – జానిపల్లి దుర్గా భవాని, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన)
రోగులకు మెరుగైన సేవలు
సొంత జిల్లాలో పనిచేయడమనేది అదృష్టంగా భావిస్తున్నా. వైద్యుడిగా కడెం మండలంలో పోస్టింగ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించడం కంటే సంతృప్తి మరొకటి ఉండదు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు యువ వైద్యులను నియమించింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. నాకు నాలుగేండ్ల అనుభవం ఉంది.
– డా.శివకుమార్, కడెం.
శిక్షణ ఇస్తున్నాం..
తెలంగాణ సర్కారు భారీగా వైద్యుల నియామకాలు చేపట్టింది. ఆదిలాబాద్ దవాఖానలకు 25 మంది కొత్త డాక్టర్లు వచ్చారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందనుంది. వీరు ఎల్లుండి(గురువారం) విధుల్లో చేరుతారు. కొత్తగా వచ్చిన డాక్టర్లకు శిక్షణ ఇస్తున్నాం. కొత్త డాక్టర్ల రాకతో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్.
మహిళల ఆరోగ్యానికి పెద్దపీట
ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. కేసీఆర్ కిట్ లాంటి పథకాలు మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. గతంలో రిమ్స్లో తాత్కాలిక వైద్యురాలిగా పనిచేయడం నాకు కొత్త అనుభూతినిచ్చింది. ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలనుకునే వారికి కొత్తగా మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు కూడా బాగా పెరిగాయి. మెడిసిన్ పూర్తి చేసిన యువతకు సర్కారు దవాఖానల్లో వైద్యులుగా శాశ్వత ప్రాతిపాదికన పనిచేసే అవకాశం కూడా కల్పించింది. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రభుత్వ వైద్యసేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దవాఖానకు వచ్చే ప్రతి ఒక్కరికీ సేవాభావంతో వైద్యమందించడమే నా విధి. కచ్చితంగా మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తా
– సుచల. వైద్యురాలు, గిమ్మ, పీహెచ్సీ, జైనథ్ మండలం
రోగులతో ఆప్యాయంగా మాట్లాడాలి..
– ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్
ఎదులాపురం, జనవరి 3: ‘కొత్తగా విధుల్లో చేరే వైద్యులు రోగులతో ఆప్యాయతగా మాట్లాడాలి. ఇదే సమయంలో సమయ పాలన పాటించాలి.’ అని ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ సూచించారు. ఈ మేరకు మంగళవారం డీఎంహెచ్వో సమావేశ మందిరంలో మెడికల్ ఆఫీసర్లకు వివిధ కార్యక్రమాలు, రోజు చేయాల్సిన విధులపై అవగాహన కల్పించారు. అలాగే రోజు పీహెచ్సీ ఓపీ చూసే ముందు స్టోర్, ల్యాబ్, ఇతర పరికరాలను పరిశీలించాలి. మెడికల్ ఆఫీసర్ గదిలో ఈడీడీ తేదీల చాట్ ఉండేలా చూసుకోవాలి. అలాగే రక్తహీనత గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలి. అవసరమైన వైద్య పరీక్షల కోసం సీహెచ్సీ, రిమ్స్కు పంపించాలి. ఇమ్యునైజేషన్తోపాటు ఇతర వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. అనంతరం ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ విజయసారథి, శ్రీనివాస్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
సొంత జిల్లాలో విధులు
మాది నిర్మల్ జిల్లానే. ఇటీవల చేపట్టిన వైద్యుల నియామకాల్లో సొంత జిల్లాకు రావడం సంతోషంగా ఉంది. నర్సాపూర్ (జీ)లో పోస్టింగ్ ఇచ్చారు. ఐదేళ్ల పాటు రోగులకు వైద్య సేవలందించిన అనుభవం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఎంతో సంతృప్తినిస్తుంది. అంకితభావంతో పని చేసి మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తా. ప్రభుత్వ ఆరోగ్య పథకాలు వందశాతం పేదల దరిచేరేలా కృషి చేస్తా. పేదింటి బిడ్డలకు మంచి వైద్యం అందించడమనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకే అనేక వసతులు కల్పిస్తూ, వైద్య పరికరాలను అందుబాటులోకి తెస్తున్నది. ఇప్పుడు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించింది. – డా. రాకేశ్, వైద్యులు, నర్సాపూర్ (జీ)
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం
మాది నిర్మల్ జిల్లానే. నా భర్త కూడా డాక్టర్. పుట్టీ, పెరిగిన జిల్లాలోనే డాక్టర్గా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం లక్ష్మణచాంద మండలానికి నియమించారు. ఇక్కడ సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమిస్తాను. గ్రామీణ ప్రాంతాల నుంచి అనారోగ్య సమస్యలతో పీహెచ్సీలకు వస్తుంటారు. గర్భిణులు, బాలింతలు ఎక్కువగా ఉంటారు. స్త్రీ వైద్యురాలిగా వారికి సేవలందిస్తాను. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించే ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తా. అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా పనిచేసి, ఉత్తమ సేవలందిస్తా. – డా. ప్రత్యూష, లక్ష్మణచాంద