మంచిర్యాల, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :‘సంప్రదాయ పంటలకు స్వస్తి పలకాలి. పంట మార్పిడికి శ్రీకారం చుట్టాలి. అధిక దిగుబడి వచ్చే సాగు కావాలి. అన్నదాతల ఆదాయం పెరగాలి. ఎవుసం దండుగ కాదు.. పండుగలా ఉందనే రోజులు రావాలి. రైతులు రాజులు కావాలి.’ అనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించారు. మనం నూనె దిగుమతి చేసుకునే రోజులు పోయి.. మనమే ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే రోజులు రావాలనే ఆలోచనల నుంచి పుట్టిందే ఆయిల్ పామ్ సాగు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడేండ్ల క్రితం నాటిన మొక్కలు ఫలితాలివ్వడం మొదలుపెట్టాయి. ఉత్తర తెలంగాణలోనే తొలి పంట మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లిలోని పదెకరాల్లో చేతికొచ్చింది. మరో 284 ఎకరాల్లో కోత దశలో ఉంది. ఈ యేడాది మార్చి, ఏప్రిల్ నాటికి 3 వేల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 6,757 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులో ఉండగా.. మరో ఏడాదిన్నరలో లక్షల టన్నులు చేతికి రానున్నది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ప్రత్యామ్నాయ సాగులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ను ప్రోత్సహించింది. క్షేత్రస్థాయిలో ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మంది పామాయిల్ పంట వేసేందుకు ముందుకొచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి విడుతలో 6,757ఎకరాల్లో మొక్కలు నాటగా.. ఈ యేడా ది 16,200ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో 1,322 మంది రైతులు, ఆదిలాబాద్లో 336, మంచిర్యాలలో 442, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 126 మంది పామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 3 వేల మంది రైతులు డీడీలు చెల్లించి మొక్కల కోసం ఎదురు చూస్తున్నారు.
148 ఎకరాల్లో మొక్కల పెంపకం..
మన నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎదగగలిగే ఆయిల్ పామ్ మొక్కల విత్తనాలను అధికారులు ఎంపిక చేశారు. ఈ మేరకు దేశ దేశాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. మూడు దేశాల నుంచి విత్తనాలు దిగుమతి చేసుకున్నారు. సౌత్ అమెరికా నుంచి కొస్టాలికా, థాయ్లాండ్ నుంచి సిరాడ్, మలేషియా నుంచి యూనివానిచ్ అనే రకాల విత్తనాలను నర్సరీల్లో రెండు దశల్లో మొక్కలుగా పెంచుతున్నారు. దాదాపు 12 నెలలపాటు మొక్కలను పర్యవేక్షించి అవి కచ్ఛితంగా బతుకుతాయని నమ్మకం కలిగిన తరువాతే రైతులకు ఇస్తున్నారు. మొత్తం పెంచే మొక్కలలో దాదాపు 10-15 శాతం పనికిరానివి ఉంటున్నా.. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా రైతులకు మేలురకం మొక్కలు అందజేస్తున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు మొక్కలు పంపిణీ చేసేందుకు మంచిర్యాల జిల్లా భీమారంలో నర్సరీలో 48 ఎకరాలు, నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెళ్లి నర్సరీలో 80 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ శివారులో మధ్నార్ గ్రామ నర్సరీలో 20 ఎకరాల్లో మొక్కలు పెంచుతున్నారు. మన జిల్లాలతోపాటు పొరుగున ఉన్న జిల్లాలకు ఇక్కడి నుంచి మొక్కలు వెళ్తున్నాయి.
కష్టం తక్కువ.. లాభాలు ఎక్కువ..
ఇతర సంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్కు కష్టం చాలా తక్కువ. ఇతర పంటలకు చేయాల్సిన పని సమయానికి చేయకపోతే ఆ పంట చేతికిరాదు. కానీ.. ఇందులో వారం, పది రోజులు ఆలస్యమైనా పంటకు ఏం కాదు. వర్షాలు, వరదల టెన్షన్ ఉండదు. ఓ వారం పది రోజులు నీటిలో మునిగి ఉన్నా మొక్క ఏ మాత్రం పాడవదు. నష్ట భయం అసలే ఉండదు. పైగా మందులు పిచికారీ చేసే అవసరం కూడా లేదు. యేటా దున్నడం, విత్తనాలు వేయడం అనే సమస్య ఉండదు. కోయడానికి ఎకరాకు ముగ్గురు రైతులు ఉంటే సరిపోతుంది. ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. కాకపోతే మొక్కలు పెట్టిన మూడో ఏడాది వరకు వచ్చే పంట నూనె ఉత్పత్తికి పనిచేయదు. అప్పటి వరకు చెట్లు వేసే గెలలను ఎప్పటికప్పుడు తొలిగించాలి. కానీ.. ఇతర పంటల్లో మూడేళ్లు వచ్చే ఆదాయం ఒకేసారితో వచ్చేస్తోంది. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఎలాంటి నష్టభయం లేకుండా రైతులకు వస్తుంది.
అందుకే ఆయిల్ పామ్ సాగు మేలని, ప్రస్తుతం పంట తీస్తున్న కోటపల్లి మండలం రాపనపల్లి రైతు గుర్రం రాజన్న కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసుత్తం టన్ను ధర రూ.13,901 ఉందని, ఈ లెక్కన ఎకరాకు పది టన్నుల దిగుబడి వచ్చినా రూ.1.30 లక్షల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. తొలిసారి పంటకు ఇంత మంచి ధర వచ్చిందని సంబుర పడిపోతున్నారు. తొలి రోజు రెండు ఎకరాల్లో పంటను కోశామని, ఈ నెల 16వ తేదీ నుంచి మిగిలిన ఎనిమిదెకరాల్లో పంట కోతను ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఆయిల్ పామ్తోపాటు అంతర పంటలుగా పసుపు, మిర్చి, కూరగాయలు, మక్క, పొద్దు తిరుగుడు, సోయాబీన్, పెసళ్లు, మినుములు, పప్పుదినుసులు, పత్తి పంటలు వేశామంటున్నారు. ఇలా రెండు రకాలుగా లాభాలు ఉంటాయని చెబుతున్నా రు. ఈ లెక్కన తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన ఆయిల్ పామ్ సాగు రానున్న రోజుల్లో అద్భుతాలు చేయడం ఖాయమని పలువురు రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరో నెలలో పంట కోస్తాం
కోటపల్లి, ఆగస్టు 12 : ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రోత్సాహంతో మూడేళ్ల కింద కోటపల్లిలో ఎనిమిది ఎకరాల్లో పామాయిల్ పంట వేసినం. మరో నెలలో పంట కోస్తాం. ఇది వరకు ఈ పంట గురించి అంతగా ఎవ్వరికి తెలియదు. విప్ బాల్క సుమన్ అన్నే రైతులకు అవగాహన కల్పించారు. దీంతో చాలా మంది పంట వేసేందుకు ముందుకు వచ్చారు. నా భర్త రామయ్య కృషితో సక్సెస్ సాధించాం.
– మంత్రి సురేఖ, ఎంపీపీ, కోటపల్లి
30 ఏళ్ల దాకా ఆదాయం
కోటపల్లి, ఆగస్టు 12 : మా విప్ సుమన్ ప్రోత్సాహంతో సర్వాయి పేటలో నాలుగున్నర ఎకరాల్లో పామాయిల్ పంట వేసిన. ఇది ఒక్కసారి నాటితో 30 ఏళ్ల దాకా ఆదాయం పొందవచ్చు. పెట్టుబ డి తక్కువే. మంచి లాభాలు పొందవచ్చు. రైతులను రాజును చేసేందుకు మా ప్రాంతానికి కొత్త పంటను పరిచయం చేసిన విప్ సుమన్కు కృతజ్ఙతలు
– బైస ప్రభాకర్, చెన్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, సర్వాయిపేట
ఎకరానికి రూ. లక్ష ఆదాయం
కోటపల్లి, ఆగస్టు 12 : ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇక్కడి రైతులు లాభాల బాట పట్టాలనే సదుద్ధేశంతో పామాయిల్ పంట వేయించారు. లింగన్నపేటలో నాకున్న రెండెకరాల్లో మూడేళ్లకింద పామాయిల్ పంట వేసిన. ఇగ కోతకు వచ్చింది. ఈ పంటతో 30 ఏళ్ల దాకా ఆదాయం పొందవచ్చు. ఎకరానికి రూ.లక్షకు తగ్గకుండా పొందవచ్చు.
– ఎరినాగుల ఓదెలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, లింగన్నపేట
సబ్సిడీ ఇవ్వడంతో ఆసక్తి
కోటపల్లి, ఆగస్టు 12 : విప్ సుమన్ మమ్ముల అశ్వరావుపేటకు తీసుకెళ్లి పామాయిల్ సాగు గురించి అవగాహన కల్పించా రు. ఈ ప్రాంతం పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉండ డం.. సర్కారు సబ్సిడీ ఇవ్వడంతో చాలా మంది రైతులు ఆసక్తి చూపారు. ఇప్పుడు పంట చేతికి వస్తుంది. దిగుబడి చూసి మరింత మంది పంట వేసే అవకాశమున్నది.
– మారిశెట్టి విద్యాసాగర్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు, రాంపూర్
ఆయిల్పామ్ సాగు చేయాలి
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 12 : వంట నూనెల లోటును పూడ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తుంది. జిల్లాలో 2020-21లో 109 మంది రైతులు 284 ఎకరాలు సాగు చేశారు. 2022-23లో 446 మంది రైతులు 1537.60 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. భీమారం ఆయిల్పామ్ నర్సరీలో సరిపడా మొక్కలు అందుబాటులో ఉన్నాయి. నీటి సదుపాయం ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తే లాభాలు గడించవచ్చు. జిల్లాలో మొదటి పంట తీసిన రైతులు అమ్ముకోవడం ప్రారంభించారు. మరోవైపు అంతర పంటలతోనూ లాభం పొందవచ్చు.
– ఉదయ్కుమార్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి, మంచిర్యాల
లాభమే.. నష్టముండదు
సోన్, ఆగస్టు 12 : నా పేరు ఎల్చల్ రమేశ్రెడ్డి, మా ఊరు పాక్పట్ల. ఏడాదికింద పద్నాలుగున్నర ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటిన. సర్కారోళ్లు సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ ఇచ్చారు. మందుల వాడకానికి ఎకరానికి రూ. 4 వేల చొప్పున నా ఖాతాలో జమ చేసిన్రు. అంతర పంటగా సోయాబీన్ కూడా వేసిన. ఆయిల్పామ్ పంటతో లాభమే కానీ.. నష్టముండదని సార్లు చెప్పారు. మూడేళ్ల నుంచి 30 ఏళ్లదాకా దిగుబడి వస్తుందంటే ఈ పంట వేసిన. కోతులు, అడవి పందుల బెడద కూడా తప్పింది.