లక్కీ డీప్ ద్వారా 38 మంది ఎంపిక
పదేళ్లపాటు ఉచిత వసతి, కార్పొరేట్ విద్య
అనుమతి పత్రాలు అందజేసిన అధికారులు
విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం
నిర్మల్ టౌన్, జూన్ 23 : తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీ కావడంతో దరఖాస్తు చేసుకున్న 250లో లక్కీడీప్ ద్వారా 38 మందిని ఎంపిక చేశారు. ఒకటో తరగతిలో 19 మంది, 5వ తరగతిలో మరో 19 మందిని ఎంపిక చేసిన అధికారులు.. వీరు పాఠశాలలో చదివేందుకు అనుమతి పత్రాలను గురువారం శాఖ కార్యాలయంలో అందించారు. ముఖ్యంగా ఎస్సీల్లో నిరుపేద కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ వసతి కలి్ంపంచాలన్న ఉద్దేశంతో ‘బెస్ట్ అవైలెబుల్ స్కూల్’ అవకాశం కల్పిస్తున్నది. ఈ స్కీం కింద ఎంపికైన వారికి ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు రూ.20వేలు, పదో తరగతి వరకు రూ.30 వేల ఫీజును ప్రభుత్వమే భరిస్తున్నది. నిర్మల్ జిల్లాలో ఎంపికైన ఐదు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆంగ్ల మాధ్యమం ఉచితంగా ప్రభుత్వమే అందించనుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
మాది దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామం. నేను ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివా. మా నాన్న భోజన్న 5వ తరగతిలో ప్రవేశం కోసం బెస్ట్ అవైలెబుల్ స్కూల్ కోసం దరఖాస్తు చేశారు. మొదటి ప్రయత్నంలోనే ఎంపికైన. నాకు నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత చదువు, వసతి కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– మనస్వి
ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
మాది లక్ష్మణచాంద మండలం మునిపెల్లి గ్రామం. నేను ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నా. నాకు ముగ్గురు సంతానం.ఇందులో ఇద్దరు ఆడపిల్లలు.. ఒకరు బాబు ఉన్నారు. మూడో పాపకు బెస్ట్ అవైలెబుల్ స్కూల్కు లక్కీడీప్ ద్వారా ఎంపికైన్నందుకు సంతోషంగా ఉంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వమే ఫీజు భరించి మా పాపను చదివిస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.
– నంగ్యాల గంగాధర్, మునిపెల్లి, లక్ష్మణచాంద మండలం
ఫీజుల భారం మోయలేకనే..
మాది మామడ మండలం కమల్కోట్ గ్రామం. నేను ఐకేపీ కార్యాలయంలో చిన్న ఉద్యోగం చేస్తున్నా. మా ఆయన రోజు కూలీగా పని చేస్తాడు. మాకు ముగ్గురు పాపలు. మొదటి పాపను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ బెస్ట్ అవైలెబుల్ స్కూల్ కోసం దరఖాస్తు చేసుకున్నా. 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రైవేట్లో చదివిస్తే ఏడాదికి రూ.30వేల వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆ ఖర్చును ప్రభుత్వమే చదివించి మంచి చదువు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పథకాలతో మాలాంటి పేద వారికి భరోసానిస్తాయి.
– కొత్తూరి మౌనిక, కమల్కోట్, మామడ మండలం
పదో తరగతి వరకు పైసా ఖర్చు లేదు..
నా కుమారుడి పేరు నంగ్య శివకుమార్. నేను వ్యవసాయం చేస్తా. నాకు ఇద్దరు బాబులు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివించా. ఇద్దరి చదువుకు ఏటా రూ.20 వేలు ఖర్చు అయ్యేది. ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలెబుల్ స్కూల్ ఉందని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నా. రెండో బాబుకు సీటు వచ్చింది. 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే చదివిస్తదట. చదువుకు పైసా పెట్టనవసరం లేదట.
– నంగ్య జీవన్కుమార్, మామడ
మంచి అవకాశంగా భావిస్తున్నా..
నేను వ్యవసాయం చేస్తుంటా. నా భార్య సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నది. మా ఊరు నిర్మల్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో పిల్లలను చదివించేందుకు ఇబ్బందులు ఉండే. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చినప్పటికీ తోటి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకోవడంతో మా పిల్లలనూ ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలని ఉన్నా సాధ్యం కాలేదు. అందుకే బెస్ట్ అవైలెబుల్ స్కూల్కు దరఖాస్తు చేశా. మొదటి ప్రయత్నంలోనే మా బాబు తేజకు సీటు వచ్చింది.
– రాములు, ఎల్లారెడ్డిపేట్, నిర్మల్ మండలం
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య..
బెస్ట్ అవైలెబుల్ స్కూల్ కింద ఎంపికైన విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నాం. నిర్మల్ జిల్లాలో 5వ తరగతిలో 19, ఒకటో తరగతిలో 19 మందిని ఎంపిక చేశాం. ఎంపికైన వారికి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వారు కోరుకున్న ప్రైవేట్ పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం చదివేందుకు ప్రభుత్వం తరఫున ఖర్చును భరిస్తాం. ఈ పథకం పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. – రాజేశ్వర్గౌడ్, జిల్లా అధికారి