యాదగిరిగుట్ట, మార్చి19 : పంచనారసింహుడి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలల వద్ద భక్తుల సందడి నెలకొన్నది. తెల్లవారుజాము నుంచే నారసింహుడిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నిత్యతిరుకల్యాణోత్సవం, సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్ల నిత్యతిరు కల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహహోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు.
ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి ధర్మదర్శానికి 2 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. స్వామివారిని సుమారు 33 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ ఖజానాకు రూ.37,44,333 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
పత్రిక ప్రకటన అవాస్తవం..
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిపై ఎలాంటి అసహనం ప్రదర్శించలేదని, మంత్రిపై అసహనం ప్రదర్శించే స్థాయి తనకు లేదని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ‘యాదగిరిగుట్ట ఈఓ అసహనం’ అనే శీర్షికన ఓ పత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామి దర్శనానికి మైసూర్ దత్తపీఠాదీశ్వరులు గణపతి సచ్చినాంద స్వామీజీ వచ్చిన సమయంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వెళ్లే సమయంలో బ్రేక్ దర్శనం కొనసాగుతుందని, దాంతోపాటు శనివారం ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గర్భాలయంలో ఎక్కువ మంది ఒకేసారి దర్శనం చేసుకునే అవకాశం లేదని మంత్రికి చెప్పినట్లు తెలిపారు. బ్రేక్ దర్శన సమయంలో ప్రతి భక్తుడికి దర్శన ఏర్పాట్లను చేస్తామన్న విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. అంతేగానీ మంత్రిపై ఎలాంటి అసహనం ప్రదర్శించలేదని తెలిపారు.