త్వరలో రూ.8.50 కోట్లతో నిర్మాణం
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
లక్షెట్టిపేట పట్టణంలోని సర్కారు హాస్పిటల్ పరిశీలన
లక్షెట్టిపేట, జూన్ 28 : లక్షెట్టిపేట పట్టణంలో అన్ని హంగులతో 30 పడకల దవాఖాన నిర్మాణానికి సర్వం సిద్ధమైందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాత భవనం మొత్తం పరిశీలించి, సిబ్బందిని సమస్యలు అడిగారు. అలాగే రోగులతో మాట్లాడి, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖాన నూతన భవనం ఏర్పాటుకు ప్రభుత్వం రూ.8.50 కోట్లు మంజూరుచేసిందని, త్వరలోనే పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న పాత భవనం కూల్చివేసినా స్థలం సరిపోదని వైద్యశాఖ అధికారులు చెప్పగా, పక్కనే ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని కూడా దవాఖాన కోసం తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
మున్సిపల్, దవాఖాన మొత్తం కలిపి సుమారు ఎకరమున్నర ఉంటుందన్నారు. కాగా, దవాఖాన కోసం మున్సిపల్ కార్యాలయం తీసుకునేందుకు కౌన్సిల్ సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. ఆ కార్యాలయాన్ని ప్రస్తుతం పాత ఎంపీడీవో ఆఫీస్లోకి మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దసర వరకు పనులు మొదలవనున్నట్లు, అన్ని శాఖల అధికారులతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. దవాఖానలో వైద్యుల కొరత ఉందని, ప్రస్తుతం ఇద్దరు మాత్రమే విధుల్లో ఉన్నారని సూపరింటెండెంట్ శేఖర్తో పాటు వైద్యుడు శ్రీనివాస్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు ఫోన్చేసి మాట్లాడి, మరో వైద్యుడిని వెంటనే నియమించాలని ఆదేశించారు. ఇక్కడ దవాఖాన నిర్మాణం పూర్తయితే లక్షెట్టిపేట మండలంతో పాటు చుట్టు పక్కల 4 మండలాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్యాజగన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్, కోఆప్సన్ సభ్యులు షాహెద్ అలీ, నూనె ప్రవీణ్, నాయకలు అంకతి రమేశ్, గంగాధర్, నడిమెట్ల రాజన్న, మెట్టు రాజు, కమలాకర్ గౌడ్, సుమన్, రాజగురువయ్య తదితరులు పాల్గొన్నారు.