చిన్న వయస్సులోనే మైనర్లు ఆకర్షణలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మైనర్ అమ్మాయిలు కనిపించకుండా పోతే కిడ్నాప్ అయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఒకవేళ వివాహం చేసుకొని.. లొంగదీసుకుంటే అవి రేప్ కేసులుగా మారుతున్నాయి. వివాహం చేసుకున్న వెంటనే కలిస్తే(శోభనం చేసుకుంటే) ఎవరూ తమను విడదీయలేరని భావిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీస్స్టేషన్, కోర్టుల్లో చెబుతున్నారు. అదే ఎవిడెంట్గా తీసుకొని మైనర్ అమ్మాయిని రేప్ చేసిన కారణంగా పోక్సో చట్టం కింద సదరు వ్యక్తులకు 10 నుంచి 12 ఏండ్లు జైలు శిక్ష విధిస్తున్నారు. ఈ కేసుల్లో బెయిల్ రావాలంటే రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ చదువుకునే విద్యార్థులైతే వారి చదువులు అర్ధాంతరంగా అగిపోవడంతోపాటు, జైలుకు వెళ్లిన వాళ్లు బయటికి వచ్చేలోపే ఆ అమ్మాయికి వేరే వారితో పళ్లైపోయి పిల్లలు కూడా ఉంటున్నారు. ఇదేదీ ఆలోచించకుండా తీసుకునే తొందరపాటు నిర్ణయాలతో జీవితాలు ఆగమవుతున్నాయి.
ఆ అమ్మాయి వయస్సు పదహారేండ్లు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇంటి పక్కన ఉండే వ్యక్తితో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటికే సదరు వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కొంతకాలానికి ఆ అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా రోజూ రాత్రి ఈ పదహారేండ్ల అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. “నేను నా భార్యకు దూరంగా ఉంటున్నా.. నువ్వంటే నాకిష్టం’ అని చెప్పేవాడు. ఇలా కాల్స్ చేయడం, వాట్సాప్లో మెసేజ్ పెట్టడంతోపాటు ఫొటోలు, వీడియోలు తీసి పంపించేవాడు’. దీంతో ఆ అమ్మాయికి మరింత దగ్గరయ్యాడు. హైదరాబాద్లో చదువుకునే రోజుల్లో ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆ వ్యక్తి ట్రెయిన్లో అమ్మాయితోపాటు వెళ్లి రావడం చేసేవాడు. తల్లిదండ్రులు మేం తోడుగా వస్తాం. అంటే నాకూ అన్ని తెలియాలి కదా. ఒక్కదాన్నే వెళ్లి రాగలను అని చెప్పేది. తర్వాత ఇంట్లో విషయం తెలిసి గొడవలు కావడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పెద్దల జోక్యంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. పోలీసుల ఎదుట అమ్మాయి చెప్పిన మాటలు విని తండ్రి అవాక్కయ్యాడు.
ఆ అమ్మాయి చదివేది పదో తరగతి. తల్లి చిన్నప్పుడే మరణించింది. తండ్రి దుబాయ్లో ఉంటాడు. దీంతో అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నది. రోజూ స్కూల్కు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ను ఇష్టపడింది. ఇలా ఓ రోజు రాత్రి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి బయటికి వచ్చి ఆ ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లింది. మరునాడు తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చింది. అమ్మమ్మ నిలదీసి అడగ్గా విషయం చెప్పింది. బంధువుల సాయంతో వెంటనే తీసుకెళ్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. అమ్మాయికి కౌన్సెలింగ్ ఇస్తుంటే ఎంత చెప్పినా వినలేదు. నన్ను ఎవరూ పట్టించుకోరు. ఆ ఆటోడ్రైవర్కు నేను అంటే చాలా ఇష్టం. నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని మారం చేసింది. దీంతో అమ్మాయిని బాలికల సంరక్షణ నిలయానికి తరలించిన పోలీసులు. సదరు ఆటోడ్రైవర్పై లైంగికదాడి కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు పోక్సో చట్టం ప్రకారం 12 ఏండ్లు జైలు శిక్ష విధించింది.
పిల్లలు ఎదిగే వరకు తల్లిదండ్రులు వారిని నిత్యం కంటిలో పెట్టుకొని చూసుకోవాలి. మంచేదో.. చెడేదో చెబుతూ.. ప్రతి విషయాన్ని పిల్లలు మనతో పంచుకునేలా చేయగలిగితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. పిల్లలకు మనమంటే ఓ నమ్మకం ఉండాలి. ఏం చేసినా నా తల్లిదండ్రులతో చెప్పి చేయాలనే భావనను చిన్న నాటి నుంచే వారిలో నాటాలి. ఫోన్లు ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుకున్నన్ని రోజులు ప్రతి విషయంలోనూ వారితో ట్రావెల్ చేయాలి. ఉద్యోగం వచ్చాక వారి ఆలోచనా విధానం మారుతుంది. జీవితం ఎలా ప్లాన్ చేసుకోవాలనే క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు తల్లిదండ్రుల మానిటరింగ్ ఉండటమే మంచిది.
– తిరుపతి రెడ్డి, ఏసీపీ, మంచిర్యాల
మరో అమ్మాయి వయస్సు 13 ఏండ్లు. పేదరికంతో చదువుకోలేదు. తల్లిదండ్రులిద్దరూ రోజు కూలీలు. ఉదయం ఇంటి నుంచి వెళ్తే తిరిగి సాయంత్రం వస్తారు. ఇంట్లోనే ఉండే ఈ అమ్మాయికి ఊరిలో ఉండే ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మాయమాటలు చెప్పి అమ్మాయిని లొంగదీసుకున్నాడు. ఈ విషయం తన ఇద్దరు ఫ్రెండ్స్కు కూడా చెప్పాడు. దీంతో ఆ ఇద్దరు కూడా ఈ అమ్మాయిని వశపరచుకున్నారు. ఇలా కొన్ని రోజులకు ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో విషయం ఇంట్లో తెలిసింది. ఓ వ్యక్తిపై పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు అతడిని పిలిచి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే మ్యాచ్ కాలేదు. దీంతో ఆ అమ్మాయిని మరోసారి పిలిపించి అడిగితే మిగిలిన ఇద్దరి పేర్లు చెప్పింది. వెంటనే ఇద్దరి శాంపిల్స్ టెస్ట్కు పంపగా అందులో ఓ యువకుడి డీఎన్ఏతో కలిసింది. చివరకు ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదైంది. ఆ ముగ్గురు యువకులతోపాటు ఆ అమ్మాయి జీవితం నాశనమైపోయింది.
ప్రేమ పేరిట మోసం చేస్తున్న వారిలో ఎక్కువ మంది పనీపాట లేకుండా తిరిగే పోకిరీలు.. జల్సాలకు అలవాటు పడిన యువకులే ఉంటున్నారు. రోజూ ఫాలో అవుతూ.. గిఫ్ట్లు కొనివ్వడం, చాక్లెట్లు, ఐక్క్రీమ్లు అంటూ అడిగిందల్లా తినిపించడం.. నాలుగు మాయ మాటలు చెబుతుండడంతో అమ్మాయిలు ఆకర్షణకు లోనవుతున్నారు. సినిమాల్లో చూపించినట్లు ప్రేమవివాహం చేసుకుంటే జీవితం బాగుంటుందనే అపోహలో వెనుకాముందు ఆలోచించకుండా చిన్న వయస్సులోనే ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. మేజర్లు కాకముందే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.
ఇలాంటి కేసుల్లో అధిక శాతం తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకపోవడం, అతిగా స్వేచ్ఛ ఇవ్వడం ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగం చేసి వచ్చాక ఇంటి పని చేసుకోవాలనో, మరేదో పని చేసుకోవడం కోసమో అని పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తున్నారు. దీంతో పిల్లలు తల్లిదండ్రులతో కంటే ఫోన్తోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే స్కూళ్లు, కాలేజీల్లో పరిచయమయ్యే స్నేహితులు, బయట వ్యక్తులకు దగ్గర అవుతున్నారు. ఇంట్లో చెప్పని విషయాలు వారితో పంచుకుంటున్నారు. వాట్సాప్ మెస్సేజ్లు, వీడియో కాల్స్, ఫేస్బుక్ చాటింగ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా ప్రతి దాంట్లో నిరంతరం టచ్లో ఉంటున్నారు. తల్లిదండ్రుల కంటే బయటి వారికి దగ్గరవుతూ, వారు చెప్పినట్లే వింటున్నారు. ఇలాగే సినిమాల్లో చూపించే ప్రేమ కాన్సెప్ట్ను నిజజీవితాలకు అన్వయించుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.