నిర్మల్ జిల్లాలో జ్వర సర్వే ముగిసింది. కరోనా కట్టడికి సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగింది. మొత్తం 570 బృందాలు ఇందులో పాల్గొనగా, 2,10,000 ఇండ్లకు యంత్రాంగం వెళ్లింది. 3500 మందికి స్వల్ప లక్షణాలు కనిపించగా, అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లను అందజేసింది. బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. ప్రభుత్వం ముందు చూపుతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో మనోధైర్యం కల్పించిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.
నిర్మల్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టిన జ్వర సర్వే మంగళవారం ముగిసింది. ఈ నెల 21న ప్రారంభమైన ఈ సర్వే 5 రోజుల పాటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగింది. మొత్తం 570 బృందాలు ఈ సర్వేలో పాల్గొని 2.10 లక్షల ఇండ్లను సర్వే చేశాయి. మొత్తంగా 3500మంది జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తదితర లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరందిరికీ అక్కడిక్కడే హోం ఐసొలేషన్ కిట్లు అందించడంతో పాటు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. లక్షణాలు ఉన్నవారు మాస్కు ధరించడంతో పాటు శానిటైజర్ను వినియోగించాలని, అలాగే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ అనవసరంగా సమూహాల్లోకి వెళ్లవద్దని సూచించారు.
ప్రతి పీహెచ్సీలో కొవిడ్ ఓపీ సేవలు
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా లక్షణాలు ఉన్నవారు గోప్యంగా ఉంచకుండా వెంటనే సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించి వైద్య సహాయాన్ని పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం అన్ని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ ఓపీ సేవలను ప్రారంభించారు.