గోదావరిఖని, అక్టోబర్ 20 : ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాలిడేషన్, చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్లు 56 మందికి బుధవారం కారుణ్య నియామక ఉత్తర్వులను ఆర్జీ-1 జీఎం కే నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సీఎండీ శ్రీధర్ చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందిస్తున్నామన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవటం, ఆ వెంటనే వారి కుటుంబ సభ్యుల్లో డిపెండెంట్ కింద పోస్టింగ్ ఇవ్వడం త్వరితగతిన చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆర్జీ-1లో ఒకే రోజు 56 మంది డిపెండెంట్లకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. అతి తక్కువ సమయంలో వీరికి ఆర్జీ-1 ఏరియాలోనే పోస్టింగ్ ఇచ్చామన్నారు. ఇప్పటివరకు ఆర్జీ-1లో 916 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలను అందించామన్నారు. ఇందులో 25 మంది మహిళలున్నారని తెలిపారు. సీఎంవోఏఐ అధ్యక్షుడు పోనగోటి శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ, ప్రవీణ్, సీనియర్ పీవో బంగారు సారంగపాణి, శ్రావణ్, ఇతర అధికారులున్నారు.