న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో ఇటీవల గంగానదిలో పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకువచ్చాయి. అలాగే గంగానది ఇసుక తిన్నెల్లో శవాలు బయటపడ్డాయి. అవన్నీ కరోనా మృతులవేనన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. గంగా నదిలో కరోనా మహమ్మారి ఆనవాళ్లను తెలుసుకునేందుకు అధ్యయనం నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, బిహార్లో దశలవారీగా అధ్యయనం చేపట్టనుండగా.. మొదటి దశలో యూపీలోని కన్నౌజ్, బిహార్లోని పాట్నా జిల్లాల్లోని 13 ప్రాంతాల నుంచి ఇప్పటికే నమూనాలను సేకరించినట్లు లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ్ బాటిక్ తెలిపారు.
అధ్యయనం సమయంలో నీటిలో వైరస్ల ఆర్ఎన్ఏ ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తద్వారా వైరస్ ఉనికి తెలుస్తుందని బాటిక్ తెలిపారు. అధ్యయనం నది జీవ లక్షణాల పరిశీలనలో సైతం ఓ భాగమని చెప్పారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసీజీ) ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. నదిలో నీరు కలుషితం కాకుండా చూస్తున్నామని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఇటీవల కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ తెలిపారు. గంగానదిలో ఇటీవల కొట్టుకువచ్చిన మృతదేహాలన్నీ కరోనా మృతులవేనన్న ఆరోపణలున్నాయి.
పలు ప్రాంతాలకు గంగానదే ప్రధాన తాగునీటి వనరు కాగా.. నీరంతా కలుషితమైందనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. నదిలో వైరస్ ఉండే అవకాశం లేదని నిపుణులు కొట్టిపారేశారు. అయినప్పటికీ, అధ్యయనం చేపట్టాలనే నిర్ణయానికి వచ్చామని ఎన్ఎంసీజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీపీ మాధురియా తెలిపారు. సీఎస్ఐఆర్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, యూపీ, బిహార్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల సహకారంతో ఈ అధ్యయనం నిర్వహిస్తున్నట్లు మాధురియా వివరించారు.