ముంబై, ఏప్రిల్ 6: కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో చాలా ఉద్యోగాలే పోయాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే తెలిపింది. ప్రభుత్వం మరిన్ని గట్టి చర్యలు చేపడితే నిరుద్యోగం ఇంతలా పెరిగిపోయేది కాదని అభిప్రాయపడింది. భారత వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మెకిన్సే సీనియర్ భాగస్వామి అలోక్ క్షీర్సాగర్ మాట్లాడుతూ.. బ్రిటన్లో ప్రభావవంతమైన చర్యలు తీసుకున్నారని, అందుకే అక్కడ ఉద్యోగాలు భద్రంగా ఉన్నాయన్నారు. కానీ భారత్లో సంఘటిత, అసంఘటిత రంగాల్లో కరోనా కారణంగా ఎన్నో ఉద్యోగాలు పోయాయన్నారు. మరోవైపు దేశంలో లాక్డౌన్ విధించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగావకాశాలపై ఆ ప్రభావం ఏమాత్రం లేదని ఓ నివేదిక తెలిపింది. కాగా, భారత వృద్ధికి క్యాపిటల్ మార్కెట్లే చోదక శక్తిలా పనిచేస్తాయని సీఐఐ అధ్యక్షుడు ఉదయ్ కొటక్ అన్నారు.
జీడీపీపై పెను ప్రభావం
దేశవ్యాప్తంగా నెల రోజులు లాక్డౌన్ విధిస్తే.. జీడీపీ 2 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో వివిధ రాష్ర్టాలు పాక్షిక లాక్డౌన్ల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో ఉంటుందో బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ చెప్పింది.