GST Refund | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): బోగస్ కంపెనీలకు రూ.45.81 కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిఫండ్స్కు సహకరించిన ఐదుగురు అధికారులను నగర నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. వేమిరెడ్డి రాజా రమేష్రెడ్డి, నీరజ్ సఖుజ, ఇందర్ కుమార్, ఎం గిరిధర్రెడ్డి, వినీల్ చౌదరి, సుప్రియ పాండె, గౌరవ్లు కలిసి వేర్వేరుగా ఎలక్ట్రికల్ బైక్స్ తయారీ యూనిట్లకు సంబంధించి ఏడు బోగస్ సంస్థలను స్థాపించారు.
అందుకోసం నగరంలోని పలువురు ఇండ్ల యజమానుల వద్ద నుంచి ఎలక్ట్రిసిటీ బిల్లులు సేకరించి వాటితో నకిలీ రెంటల్ అగ్రిమెంట్లు సృష్టించారు. అనంతరం జీఎస్టీ పోర్టల్లో ఈ నకిలీ పత్రాలతో కూడిన ఏడు బోగస్ సంస్థలను నమోదు చేశారు. ఆపై వారి ట్యాక్స్ కన్సల్టెంట్ చిరాగ్ శర్మ సహాయంతో నకిలీ ఇన్వాయిస్, నకిలీ ఈ-వే బిల్స్, పార్ట్-ఏ, పార్ట్-బీ, ఇన్వార్డ్ సైప్లె బిల్స్ను ఆయా బోగస్ కంపెనీల పేరుమీద సృష్టించారు.
ఈ క్రమంలో లేని కంపెనీలను ఉన్నట్టుగా చూపించి, జీఎస్టీ రిఫండ్స్కు దరఖాస్తు చేశారు. అయితే జీఎస్టీ రిఫండ్స్ రావడం కోసం నల్గొండ డివిజన్ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ పీతల స్వర్ణ కుమార్, అబిడ్స్ సర్కిల్ స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కే వేణుగోపాల్, మాదాపూర్-1 సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ పొదిల విశ్వకిరణ్, మాదాపూర్ సర్కిల్-2 డిప్యూటీ స్టేట్ జీఎస్టీ ఆఫీసర్ వేమవరపు వెంకట రమణ, మాదాపూర్ సర్కిల్-3 అసిస్టెంట్ కమిషనర్ మర్రి మహితలను నిందితులు సంప్రదించారు.
అందుకు జీఎస్టీ అధికారులు నిందితులతో లంచం తీసుకుని, వారికి జీఎస్టీ రిఫండ్స్ వచ్చేందుకు సహకరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వినర్ధ్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వేమిరెడ్డి రాజా రమేష్రెడ్డి రూ.23.78 కోట్లు, యోకో ఎలక్ట్రిక్ బైక్స్ సంస్థ పేరుతో నీరజ్ సఖుజ రూ.8.47 కోట్లు, క్రాక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ పేరుతో ఇందర్ కుమార్ రూ.63 లక్షలు, గ్రో మోర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేరుతో ఎం గిరిధర్రెడ్డి, వినీల్ చౌదరిలు రూ.2.87 కోట్లు, అపెక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ పేరుతో మరోసారి ఎం గిరిధర్రెడ్డి, వినీల్ చౌదరి రూ.3.10 కోట్లు,
సుప్రియ ఎలక్ట్రిక్ బైక్స్ పేరుతో సుప్రియ పాండె రూ.2.02 కోట్లు, మ్యాగ్నమ్ ఎలక్ట్రిక్ బైక్స్ పేరుతో గౌరవ్ రూ.4.96 కోట్ల చొప్పున మొత్తం రూ.45 కోట్ల 81 లక్షల 95,771ని జీఎస్టీ రిఫండ్స్ రూపంలో కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఈ మేరకు సమాచారం అందుకున్న నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. బోగస్ కంపెనీలు సృష్టిం చి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన నిందితులను అరెస్టు చేశారు. అలాగే శనివారం ఐదుగురు జీఎస్టి అధికారులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.