Inspiration | ఖోడద్ జడ్పీ పాఠశాల కూరగాయల తోటను తలపిస్తున్నది. విద్యార్థులకు పాఠాలు నేర్పడంతో పాటు తన ఒడిలో సహజసిద్ధంగా పండిన వెజిటేబుల్స్తో పౌష్టికాహారం అందిస్తున్నది. హెచ్ఎం క్రిష్ణకుమారితో పాటు సిబ్బంది, పిల్లలు విజయవంతంగా 19 రకాల పంట తీస్తుండగా, ప్రశంసల జల్లు కురుస్తున్న ది. ఇక్కడ పండిన తాజా కూరగాయలతో నిత్యం మధ్యాహ్న భోజనం పెడుతుండగా, తల్లిదండ్రు ల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవు తున్నది.
– తాంసి(తలమడుగు), డిసెంబర్ 11
తాంసి(తలమడుగు), డిసెంబర్ 11 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రధానోపాధ్యాయురాలు క్రిష్ణకుమారి, ఉపాధ్యాయుల బృందం సాగుబడిగా మార్చారు. ఓ వైపు పాఠాలు బోధిస్తూనే.. మరోవైపు కూరగాయల సాగుపై దృష్టి పెట్టారు. మధ్యాహ్న భోజన కార్మికులు, సిబ్బందితో కలిసి కూరగాయల సాగు కొనసాగిస్తున్నారు. ఇక్కడ పాలకూర, మెంతికూర, కొత్తిమీర, టమాట, పచ్చి మిర్చి, చిక్కుడు, సోర కాయ, వంకాయ, కంది, గుమ్మడికాయలాంటి కూరగాయలను పండిస్తున్నారు. ఎలాంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. విద్యార్థులకు సైతం సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణకు.. ఇక్కడ సాగు చేసిన కూరగాయలనే ఉపయోగిస్తున్నారు. దీంతో కొంత నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది.
ఓ పక్క మార్కెట్లో కూరగాయల ధరలు రోజు రోజుకూ మండిపోతున్నాయి. మరో పక్క ఎరువులు, మందుల పిచికారీ చేసిన కల్తీ కూరగాయలతో అనారోగ్యం కొని తెచ్చుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్నంగా ఆలోచించారు. బడి ఆవరణలో సేంద్రియ పద్ధతిలో ఆకు కూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. విద్యార్థులకు తాజా కూరగాయలతో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు.
కరోనా కారణంగా సుదీర్ఘకాలం పాఠశాల మూతపడింది. పాఠశాలలు పునః ప్రారంభమైన అనంతరం బడి ఆవరణలో కొంత భూమిని మధ్యాహ్న భోజన కార్మికుల సహకారంతో చదును చేయించి కిచెన్ గార్డెన్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ సేంద్రియ పద్ధతిలో 19 రకాల కూరగాయలను పండిస్తున్నారు. దీని నిర్వహణ కోసం విద్యార్థులతో ఓ కమిటీని వేసి వారిని సాగులో భాగస్వాములను చేశారు. గ్రామంలో తడి, పొడి చెత్తను సేకరించి తయారు చేసిన వర్మి కంపోస్టును సాగుకు వినియోగిస్తున్నారు. కిచెన్ గార్డెన్లో పండిన తాజా ఆకు కూరలు, కూరగాయలను ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి వాడుతున్నారు. విద్యార్థులకు రోజుకో రకమైన వంటకాన్ని అందిస్తున్నారు. కొద్దిపాటి పెట్టుబడితో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుండగా, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్న భోజనంలో సహజసిద్ధంగా పండిం చిన కూరగాయలు వాడుతున్నాం. విద్యార్థులకు పౌష్టికా హారం అందిస్తున్నాం. మధ్యాహ్న భోజన సిబ్బంది కృషి, సహచర ఉపాధ్యాయుల సహకారంతో కిచెన్ గార్డెన్ నిర్వహిస్తున్నాం. ఈ విధానం వల్ల మధ్యాహ్న భోజన నిర్వహణ వ్యయాన్ని కొద్దిగా తగ్గించుకుంటున్నాం.
– సుకుమార్ పెట్కులే, హిందీ పండిత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖోడద్
ఈ రోజుల్లో అన్నీ కల్తీగానే ఉంటున్నా యి. రసాయన ఎరువులు వాడిన కూరగాయలతో భోజనం పెట్టడం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే మా బడిలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నాం. మా విద్యార్థులు భాగస్వాములై తోట నిర్వహిస్తున్నారు. రోజుకో రకమైన కూరతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం.
– క్రిష్ణకుమారి, ప్రధానోపాధ్యాయులు,
మా ఉపాధ్యాయులు బడి తోట నిర్వహణ కోసం విద్యార్థులతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మేమంతా కలిసి పాఠశాల సమయానికి అరగంట ముందుగా చేరుకుని తోటకు నీరు పట్టడం, పిచ్చి మొక్కలు తొలగించడం చేస్తాం. బడి తోట నుంచి వచ్చిన తాజా కూరగాయలతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు.
– బోనగిరి హర్షిత, 8వ తరగతి,జడ్పీ ఉన్నత పాఠశాల ఖోడద్