ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘గొర్రెల పంపిణీ పథకం’ గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో కుటుంబానికి 75 శాతం సబ్సిడీపై యూనిట్లు అందిస్తుండగా, వారి భవిష్యత్కు భరోసాదొరుకుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 18,372 మందికి పంపిణీ చేయగా, ప్రతి మందలో సంతతి పెరిగి ఆర్థిక ప్రగతికి దోహద పడింది. ఇక రెండో విడుతలో 18,101 మందికి అందించే ప్రక్రియ కొనసాగుతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. శనివారం ‘నమస్తే తెలంగాణ’ ఫీల్డ్ విజిట్ చేయగా, గొర్రెలిచ్చి.. బతుకుదెరువు చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
– మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ )
నేను ఇంతకుముందు వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందేది. ప్రభుత్వం మొదటి విడుతలో నాకు 21 గొర్రెలను పంపిణీ చేసింది. నా తల్లి పేరిట కూడా ఒక యూనిట్ వచ్చింది. 42 గొర్రెలను ఒకటే మందలో ఉంచుతున్నం. ఇప్పుడు మందలో 62 వరకు గొర్రెలు ఉన్నయ్. అప్పుడప్పుడు గొర్రెలను అమ్మి అవసరాలు తీర్చుకుంటున్నం. ఇప్పటి వరకు రూ.60 వేల విలువ చేసే జీవాలను విక్రయిం చినం. ఎవుసానికి అవసరమైన పెట్టుబడులకు సైతం జీవాల పైసలు ఉపయోగపడుతున్నయ్. మా తాతల కాలం నుంచి గొర్రెలను సాకుతున్నం. ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేయడంతో మా ఉపాధి మరింత మెరుగుపడింది. పంటల సాగులో భాగంగా గొర్రెల పేడను ఎరువుగా వాడుతున్నం. రసాయన ఎరువుల వాడకం కూడా తగ్గించినం. జీవాల పోషణలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నం. ఏమైనా జబ్బులు చేస్తే పశు వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు మందులు ఇస్తున్నం. ఏదేమైనా ఇలాంటి ప్రభుత్వం ఉన్నది కాబట్టే ప్రజలకు మేలు జరుగుతున్నది.
-దేవరి అశోక్, లబ్ధిదారుడు, వడ్డాడి, తాంసి మండలం
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ) : గొల్ల, కుర్మల బతుకులకు భరోసానిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలనిస్తున్నది. ‘తెలంగాణలో లక్షల మంది గొల్లకుర్మలు ఉన్నారు. వీరంతా ఆ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలోనే షీప్ అండ్ గోట్ పాపులేషన్లో తెలంగాణ నంబర్-1గా నిలవాలి’ అనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ 2017, జూన్ 20న గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభిం చారు. పథకం ప్రారంభించిన అనతి కాలంలోనే రాష్ట్రంలో పశుసంపద పదింతలు పెరిగింది. తెలంగాణకు దిగుమతి తగ్గి, ఇతర రాష్ర్టాల వారు మన దగ్గరి నుంచి ఎగుమతి చేసుకునే రోజులు వచ్చాయి. దేశంలో ధనవంతులైన గొల్లకుర్మలు ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణ ఉన్నారని చెప్పుకునేలా వారి జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపింది. నిరుపేద లను సైతం ధనవంతులను చేసింది. గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద తొలి విడుతలో ఇచ్చిన 21 గొర్రెలు.. ఈ రోజు పదింతలు అయినయ్. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం సైతం మొదలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడుతలో 18,372 మందికి గొర్రెలు పంపిణీ చేయగా, రెండో విడుతలో 18,101 మందికి గొర్రె పిల్లలు అందించే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ పథకం కింద లబ్ధి పొందిన గొల్లకురుమలు తమకు జరిగిన మేలును, మారిన ఆర్థిక పరిస్థితిని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
కాగజ్నగర్, సెప్టెంబర్ 9 : నా పేరు వేముల పోశన్న, మాది కాగజ్నగర్. పేద కుటుంబం. మునుపు మా సుట్టపోళ్ల గొర్లు కాసేటోన్ని. ఎండనకా.. వాననకా కష్టపడితే జీతం తక్కువ వచ్చేది. గా పైసలతో భార్యా పిల్లలను పోషించ డానికి అష్టకష్టాలు పడ్డ. ఎట్లరో దేవుడా అని బాధపడు తుంటే సీఎం కేసీఆర్ ఆదుకున్నడు. 2018లో మొదటి విడుతలో నాకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇచ్చిన్రు. ఇగ అప్పటి నుంచి నా గొర్లు నేనే కాసుకుంటున్న. ఇప్పుడు పెద్ద మంద అయ్యింది. మొత్తం 50 గొర్లు ఉన్నయి. 10 పిల్లలు కూడా ఉన్నయి. కొన్ని గొర్లు అమ్మి నా బిడ్డ పెండ్లి చేసిన. ఏం లేనోనికి గొర్లు ఇచ్చి యజమానిని చేసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ను బతికున్నంత కాలం తలుసుకుంట.
– వేముల పోశన్న, కాగజ్నగర్
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 9 : నాకు మొదటి విడుతలో సర్కారోళ్లు 20 గొర్రెలు, ఒక పొట్టేలునిచ్చిన్రు. వాటిని మంచిగ సాదుకుంటున్న. మొత్తం 70 వరకు ఎదిగినయి. రెండో విడుతలో నా కొడుకు కొండ కుమార్కు కూడా యూనిట్ మంజూరు చేసిన్రు. వాడి గొర్రెలు 30 వరకు ఎదిగినయి. మందలో ఎదిగిన పొట్టేళ్లను అమ్ముతున్నం. యేటా రూ. లక్ష దాకా ఆదాయం వస్తుంది. గా డబ్బులతోనే కుటుంబం వెళ్లదీస్తున్నం. వచ్చే ఏడాదికల్లా మా దగ్గర 160 వరకు పెరుగుతయనుకుంటున్నం. వాటి సంరక్షణ మొత్తం నేనే చూసుకుంట. ప్రతి రోజూ ఉదయం గొర్రెలను మేతకు తోలుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొస్త. వాటికి ఏదైనా రోగమొస్తే డాక్టర్లు వచ్చి చూస్తున్నరు. ఇది వరకు ఉపాధి లేక మస్తు తిప్పలపడ్డం. సీఎం కేసీఆర్ గొర్రెలిచ్చి ఆదుకున్నడు. గాయనకు జీవితాంతం రుణపడి ఉంటం.
– కొండ రాజయ్య, లబ్ధిదారుడు, అంకుసాపూర్
ఇచ్చోడ, సెప్టెంబర్ 9: గతంలో నాకున్న కొంత వ్యవసాయ భూమిలో పత్తి, సోయా పంటలు పండించేవాడిని. ఒక్కోసారి కాలం సహకరించక పంటలు చేతికి రాకపోయేది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా ఎల్లక అప్పులు చెయ్యాల్సిన పరిస్థితి ఉండేది. ఇట్ల ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని గత ప్రభుత్వాలు ఏ ఒక్కనాడూ పట్టించుకోలె. సీఎం కేసీఆర్ సారు వచ్చినంకనే మాకు కాలం కలిసిసొస్తున్నది. గొల్ల కుర్మలకు సబ్సిడీ గొర్రెల పథకం వెట్టి మంచి పనిజేసిండు. నాకు మొదటి విడుతలోనే 20 గొర్రెలు, ఒక పొట్టెలు ఇచ్చిన్రు. వాటిని నేనే మేపుకుంటున్న. ఐదేళ్ల నుంచి వాటికి పుట్టిన పిల్లలను అన్నింటిని కాపాడుకుంటున్న. ఏటా 30 నుంచి 35 గొర్రెలను అమ్ముతున్న. రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తున్నది. ఈ డబ్బులతోనే నా ఇద్దరు కూతుళ్లకు పెండ్లి చేసిన. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద కూడా బిడ్డల పెండ్లిళ్లకు చెక్కులు అందించింది. ఇప్పుడు మందలో 80 గొర్రెలు ఉన్నయ్. వీటి విలువ సమారు రూ.8 లక్షల వరకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను అందించడంతోనే మా బతుకులు మారినయ్. నా కొడుకు రాజు, కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు చేసుకుంటున్నరు. నేను గొర్రెలు మేపుకుంటున్న. ప్రభుత్వ సహకారంతోనే ఆర్థికంగా పుంజుకున్నం. పేదల బతుకులు ఇప్పుడిప్పుడు మారుతున్నయ్. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అయితే అందరి జీవితాలు మంచిగుంటయ్.
-గొల్ల మల్లేశ్ యాదవ్, సిరికొండ, ఆదిలాబాద్
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 9 : మా అంకుసాపూర్లో సుమారు 80 వరకు గొల్లకుర్మల కుటుంబాలున్నయి. ఊర్లో దాదాపు అందరికీ గొర్రెల యూనిట్లు మంజూరు చేసిన్రు. ఇది వరకు కూలీ పనులకు పోయేటోళ్లం. ఇప్పుడు ఇంటింటికీ గొర్రెల మందలున్నయి. వాటిమీదే ఆధారపడి బతుకుతున్నం. సూత్తుండటాళ్లకు రెండింతలవుతున్నయి. గొర్రెల పెంపకంతో ఆదాయం మంచిగనే ఉంది. మా ఊరు జీవాలకు పేరుగాంచింది. ఎవ్వరికీ గొర్రెలు కావాలన్నా మా ఊరికే వస్తున్నరు. పొట్టేళ్లను మాత్రమే అమ్ముతం. అదికూడా డబ్బులు అవసరముంటేనే ఇస్తం. ఇప్పుడు నా దగ్గర 100 జీవాలున్నయి. వాటి వాటి సంరక్షణ బాధ్యత స్వయంగా చూసుకుంటున్న. పది గొర్రెలుంటే చాలు లక్ష రూపాలున్నట్లే. ఇప్పుడు ప్రతి ఇంట్లో కనీసం 40 నుంచి 100 గొర్రెల దాకా ఉన్నాయి. సీఎం కేసీఆర్ వల్ల లక్షాధికారులైనం.
– కొమురయ్య, లబ్ధిదారుడు, గ్రామ పెద్ద, ఆసిఫాబాద్
భైంసా, సెప్టెంబర్, 9: మాలాంటోళ్లకు ప్రభుత్వం ఉచితంగా గొర్రెలు పంపిణీ చేయడంతో ఉపాధి లభిస్తున్నది. గొర్రెల పెంపకం తప్ప వేరే పని చేయలేని మాలాంటి వారి కష్టాలు సీఎం కేసీఆర్ సార్ తెలుసుకొని ఉచితంగా గొర్రెలు అందిస్తున్నరు. గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలు ఇవ్వడంతో నాకు తెలిసి దేశంలనే లేదు. ఇది కేసీఆర్ సారుతోనే సాధ్యమైంది. ఎంతో ఆదాయం లభిస్తున్నది. ఇప్పటికే నాకు రెండో విడుతల 21 గొర్రెల ఇచ్చిన్రు. కులవృత్తులను సీఎం కేసీఆర్ ప్రోత్సహించి, ఆ కుటుంబాలకు ఆధారమిస్తున్నడు. సీఎం కేసీఆర్ తోనే మా కుటుంబాలు సల్లంగ బతుకుతున్నయ్. గీ గొర్రెలను మంచిగ సాదుకుంటున్న. వాటి పిల్లలతో ఉత్పత్తి మరింత పెరుగుతున్నది. రాను రాను ఇవే మాకు ఆధారమైతయ్. గింత మంచిగ చూసుకున్న సీఎం ను గతంలో ఎప్పుడూ సూడలె.
-మధు, భైంసా మండలం, ఖత్గాం
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 9 : మాది పేద కుటుంబం. కనీసం గుంట భూమి కూడా లేదు. ఇది వరకు మా సుట్టపోళ్ల గొర్రెలు కాసేటోన్ని. చాలీ చాలని జీతంతో కుటుంబం గడవడం కష్టమయ్యేది. 2017లో సర్కారోళ్లు మొదటి విడుతలో 20 గొర్రెలు, పొట్టేలునిచ్చిన్రు. అప్పటి నుంచి నా గొర్రెలు నేనే మేపుకుంటున్న. యేటా రెండు ఈతలు వస్తున్నయ్. ఇప్పుడు నా దగ్గర 50 గొర్రెలున్నయి. కుటుంబం గడవడం కోసం పొట్టేళ్లను అమ్ముకుంటున్న. ఇది వరకు ఒకరి వద్ద పనిచేసిన. ఇప్పుడు నాకే సొంతంగా గొర్రెలున్నయ్. నేనే యజమానిని అయిన. సర్కారోళ్లు అందించిన గొర్రెలే మా బతుకులకు భరోసా అయినయ్. ఎవ్వరిపై ఆధారపడకుండా బతుకుతున్నం. ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యమే. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం.
– బోయినే రాజయ్య, లబ్ధిదారుడు, అంకుసాపూర్
కడెం, సెప్టెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మలకు రెండో విడుత గొర్రెలను పంపిణీ చేయడం మరింత ఆనందాన్నిచ్చింది. తమ వృత్తిలో సాధికారత సాధించాలనే లక్ష్యంతో గొల్లకుర్మల ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపర్చేలా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయడం హర్షనీ యం. మా నాన్నకు మొదటి విడుతలో 21 సనుగు గొర్రెలు వచ్చాయి. వాటి ద్వారా ఏడాది కాలంలో 60కి పైగా పిల్లలు పుట్టడంతో పాటు, ఆ ఫలితం ఆధారంగానే రెండో విడుతలో నేను కూడా గొర్ల మంద తీసుకున్న. వ్యవసాయంతో పాటు, ఈ గొర్రెల పెంపకంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తున్నం. దేశంలో రాజస్థాన్ మాదిరిగా రాష్ట్రంలో గొల్లకుర్మల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గొర్లను పంపిణీ చేయడం హర్షణీయం. గొల్ల కుర్మల కుటుంబాలు బాగుండాలని సీఎం కేసీఆర్ ఈ పథకానికి సంకల్పించిన్రు. మా జీవితాల్లో వెలుగులు నింపిన్రు.
-మల్యాల రాకేశ్, లబ్ధిదారుడు, కడెం
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 9: పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నరు. ఆయనపై రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకమున్నది. ఏ రాష్ట్రంలో లేని పథకాలను మన దగ్గర అమలు చేస్తున్నడు. నాకైతే తెలంగాణలో పట్టినందుకు గర్వంగా ఉంది. మూడేళ్ల క్రితం మా వూర్లో 56 మందికి మొదటి విడత కింద గొర్లను పంపిణీ చేసిన్రు. నాకు గొర్లు రాలే. అయినా బాధ పడలే. మళ్లోసారి ఇచ్చినప్పుడు వస్తదనుకున్న. అనుకున్నట్టే రెండో విడుతలో మాకు గొర్లను మంజూరు చేసిన్రు. రూ.43,750 డీడీ తీసిన. రూ.1,75,000 విలువైన 20 గొర్రెలు, ఒక పొట్టెలను ఇచ్చిన్రు. వీటిపై సర్కారుకు ఎలాంటి పైసలు కట్టాల్సిన అసవరం లేదు. నాకైతే చాలా సంతోషమనిపించింది. నేను ఇదివరకు కాపరి గా ఉన్న. అప్పట్లో అందరి గొర్లెను మేపేవాన్ని. ఇప్పుడు సర్కారు ఇచ్చిన గొర్లతో యజమా నినయ్యా. నా ఉపాధి నేనే చూసుకుంటున్న. ఇదంతా సీఎం కేసీఆర్ దయతోనే జరిగింది. జీవితంలో గిసోంటి పథకం వస్తదని అనుకోలే. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ పథకాలపై రాద్ధాం తం చేస్తున్నయ్. మొదటి విడుతలో అందిన వాళ్లకే ఇవన్నీ వస్తయ్. మిగిలినోళ్లకు రావన్నరు. రెండో విడుతల నాతో పాటు మా వూర్లో 28 మందికి వచ్చినయ్. సీఎం కేసీఆర్ సారు మాలాంటోళ్ల భవిష్యత్కు కాపలా కాస్తున్నడు. ఆయన సల్లంగుండాలె. -బూర్ల పోతన్న జామ్, సారంగపూర్.
కడెం, సెప్టెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇటీవలే రెండో విడుతలో గొర్రెలు పంపిణీ చేసింది. మొదటి విడుతలో నా కొడుకు పేరిట వచ్చిన సనుగుతో 85 గొర్రె పిల్లలైనయ్. వాటిని మంచి చూసుకున్న. గతంలో ఇచ్చిన గొర్రెల పిల్లలతో మంచి లాభాలు వచ్చినయ్. ఇప్పుడు రెండో విడుత సనుగుతో కూడా మంచి లాభాలు వస్తాయనే నమ్మకమున్నది. గతంలో ఏ ప్రభుత్వం కూడా మా గొల్లకుర్మలను ఆదుకున్నది లేదు. సీఎం కేసీఆర్ వచ్చినంకనే మాకు మంచి రోజులొచ్చినయ్. ఇయ్యాల వాటిని సాదుకుంట బతుకుతున్నం. గతంలో గిట్ల పేదోళ్లకు మంచిజేస్తమని ఒక్కరన్న ఆలోచించలె. సబ్సిడీ ద్వారా గొర్రెలను పంపిణీ చేసి, మాకు తిండి మందం సంపాదించుకునేలా చేసిండు.
-గన్నె కొమురయ్య, లబ్ధిదారుడు, కడెం