ఆదిలాబాద్ రూరల్, జూన్16: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు రూ.224కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణంలోని 45,49 వార్డు ల్లో రూ.58 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలోని 49 వార్డుల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పట్టణ ప్రగతి కింద రూ.1.30 కోట్లు మంజూరు చేస్తున్నదని చెప్పారు. వీటితో పట్టణంలో మురుగు నీటి కాలువలు, సీసీ రోడ్ల పనులు వేగంగా నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలో రోడ్ల వెడల్పు, డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. పట్టణంలో భారీగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్లు బండారి సతీశ్, వెనగంటి ప్రకాశ్, నాయకులు యూనిస్ అక్బానీ పాల్గొన్నారు.