పట్నం.. సరికొత్త హంగులతో కళకళలాడుతున్నది. పట్టణ ప్రగతి యజ్ఞంలా సాగడంతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోగా రూపురేఖలు మారిపోయాయి. స్వరాష్ట్రంలో నిధుల వరద పారుతుండడంతో అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్నది. రహదారుల నిర్మాణం, మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, కూడళ్ల వద్ద హైమాస్టు లైట్లతో ధగధగ లాడుతున్నాయి. చిల్డ్రన్స్ పార్కులు, మినీ ట్యాంక్బండ్లు, బృహత్ పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. జంక్షన్స్ను సుందరీకరించడంతో నగరాలను తలపిస్తున్నాయి. సువిశాల క్రీడా మైదానాలు ఆటలకు వేదికలయ్యాయి. వైకుంఠధామాలతో చివరి మజిలీకి చింత తీరింది. ట్రాక్టర్లు, ట్రాలీలు, మినీ ఆటోలు రావడంతో స్వచ్ఛత పెరిగింది. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటుతో కూరగాయల గోస తీరింది. తడి-పొడి చెత్త వేరు చేయడానికి డీఆర్సీసీలు.. సెప్టిక్ ట్యాంక్ నుంచి వ్యర్థాలను ఎరువుగా మార్చడానికి ఎఫ్ఎస్టీపీల ఏర్పాటుతో మున్సిపాలిటీల సంపద పెరిగింది. దారిద్య్రాన్ని వదిలించుకొని ప్రతి పట్టణం ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తున్నది. సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన పట్టణ ప్రగతితో పట్టణాలు ప్రగతి పథాన దూసుకెళ్తున్నాయి.
– ఆదిలాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ) ః ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్.. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, మం దమర్రి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, క్యాతనపల్లి, నస్పూర్, చెన్నూర్.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభు త్వం అందించే నిధులతో పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. ప్రతి బల్దియాలో అధికారులు అవసరమైన పనులు గుర్తించి అధికారులు నివేదికలు అందజేస్తున్నారు. వీటికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది.
మంచిర్యాల జిల్లాలో..
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో రూ.10.17 కోట్లతో ఓపెన్ జిమ్లు, చిల్డ్రన్ పార్కులు, 14, మినీ హైమాస్టు లైట్లు 80, సోలార్ హైమాస్టు లైట్లు 5, సోలార్ వీధిదీపాలు 25, పాలచెట్టు నుంచి షిర్కే వరకు సింగిల్ ఆర్మ్లైట్లు 80, పాత బస్టాండ్ నుంచి రామన్కాలనీ వరకు, పోస్టాఫీసు నుంచి హనుమాన్ ఆలయం వరకు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. మూడు మినీ ట్యాంకుబండ్లు, వైకుంఠధామాలు, రెండు ట్రాక్టర్లు, ట్యాంకర్, పలు కాలనీల్లో వీధిలైట్లు, నర్సరీలు, మోడల్ స్కూల్, ఓపెన్ జిమ్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో రూ.6.75 కోట్లతో పార్కు లు, నర్సరీల నిర్వహణ, వైకుంఠధామాలు, వీధిదీపాలు, క్రీడామైదానాలు, జంక్షన్ల ఏర్పాటు, వాహనాల మరమ్మతు చేపట్టారు. చెన్నూర్ మున్సిపాలిటీలో రూ.6.54 కోట్లతో రెండు ఓపెన్ జిమ్లు, శానిటేషన్ మెటీరియల్, రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. నర్సరీలు, ప్రకృతి వనాలు, హరితహారం, క్రీడాప్రాంగణం, వైకుంఠధామాలు, డంపింగ్యార్డు లు, విద్యుత్ చార్జీలు, వీధి దీపాలను ఏర్పాటు చేశారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్లతో క్రీడా ప్రాంగణాలు, పార్కులు, ఓపెన్ జిమ్లు, ఆట స్థలాలు, హరితహా రం, శానిటేషన్, మంచినీటి సరఫరా, రోడ్లు, కల్వర్టులు, కొవిడ్ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. క్యాతనపల్లి పరిధిలో రూ.10.42 కోట్లతో సమీకృత మార్కెట్, నర్సరీ, ఓపెన్ జిమ్ లు, క్రీడాప్రాంగణాలు, వైకుంఠరథం, వైకుంఠధామం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పబ్లిక్ టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీకి రూ.22.72 కోట్లు మంజూరయ్యాయి. రెండు వైకుంఠధామాలు, రూ.7.20 కోట్లతో వెజ్, నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తున్నారు. రూ.4 కోట్లతో నాలుగు కూడళ్లను సుందరీకరించడంతోపాటు వీధుల్లో 11,521 వీధి దీపాలు ఏర్పాటు చేశారు. 5,293 మంది వీధివ్యాపారులకు రూ.7.15 కోట్లతో రుణాలు ఇప్పించడంతోపాటు సముదాయాలను నిర్మించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో రూ.6.11 కోట్లతో పనులు చేపట్టారు. రూ.70 లక్షలతో నర్సరీలు, 12 పట్టణ ప్రకృతి వనాలు, 4.5 కిలోమీటర్లు ఎవెన్యూ మిడియన్, ఎమ్ఎల్ఏపీ ప్లాంటేషన్ పార్కులు నిర్మించారు. రూ.5 లక్షలతో మరుగుదొడ్లు, మలవ్యర్థాలను శుద్ధి చేయడానికి రూ.2 కోట్లతో ఎఫ్ఎస్టీపీ నిర్మాణం చేపట్టారు. రూ.కోటితో వైకుంఠధామం నిర్మించారు.
నిర్మల్ జిల్లాలో…
నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.7 కోట్లతో మంచిర్యాల చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ఫుట్పాత్ నిర్మించారు. రూ.50 లక్షలతో నర్సరీలు, రూ.50 లక్షలతో మరుగుదొడ్లు, రూ.2 కోట్లతో చైన్గేట్ నుంచి హెడ్ పోస్టాఫీసు వరకు బీటీ రోడ్డు నిర్మాణం, ధర్మసాగర్ ట్యాంక్ వద్ద రూ.1.40 కోట్లతో లెక్వ్యూ అభివృద్ధి రూ.3 కోట్లతో సెప్టిక్ ట్యాంక్ నుంచి వ్యర్థాలను ఎరువుగా మార్చడానికి ఎఫ్ఎస్టీ పీ నిర్మాణం చేపట్టారు. రూ.కోటితో సుందరీకరణ పనులు చేశారు. రూ.90 లక్షలతో స్వాగత తోరణాలు, రూ.1.98 కోట్లతో మంచిర్యాల చౌరస్తా వరకు సెంట్రల్ లైటింగ్, రూ.2 కోట్లతో అంబేద్కర్ చౌక్ నుంచి బైల్బజార్ వరకు ఫుట్పాత్ నిర్మాణం, రూ.50 లక్షలతో క్లాక్ టవర్, రూ.3 కోట్లతో హిందూ శ్మశాన వాటిక వాల్ క్లాడింగ్, గ్రానైట్, శివుడి విగ్రహం, ల్యాండ్ స్కేప్ గ్రీనరీ, గ్యాస్ బర్నింగ్, గార్డెన్ పోస్ట్లైట్ పనులు చేపట్టారు. భైంసా మున్సిపాలిటీలో రూ.3 కోట్లతో ట్రాక్టర్లు, ఆటోలు, టిప్పర్లు, బ్లెడ్ ట్రాక్టర్, స్వీపింగ్ మిషన్, స్ట్రీట్లైట్ లాడర్, జేసీబీలు కొనుగోలు చేశారు. రూ.30 లక్షలతో ఆరు నర్సరీలు ఏర్పాటు చేశారు. పట్టణంలో రూ.5.17 కోట్లతో సెంట్రల్ లైటింగ్, హైమాస్టు పోల్స్, రూ. 60 లక్షలతో ప్రధాన రహదారికి ఇరువైపులా సీసీ డ్రైయిన్ నిర్మించారు. రూ.1.65 కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ, సీసీ కాలిబాట, ఫుట్పాత్ పనులు చేపట్టారు. రూ.2 కోట్లతో మిడియన్ గ్రీనరీని బెంగళూర్ టైల్స్తో నిర్మించారు. రూ.66 లక్షలతో మూడు కూడళ్లలో పౌంటేయిన్లు, రూ.15 లక్షలతో 26 వార్డుల్లో 26 ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఖానాపూర్ మున్సిపాలిటీకి పట్టణ ప్రగతిలో భాగంగా రూ.5.19 కోట్లు మంజూరయ్యాయి. రూ.4.60 కోట్లతో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో తడి-పొడి చెత్తను సేకరించడానికి ట్రాక్టర్లు, మినీ ఆటోలు, బ్లెడ్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో…
ఆదిలాబాద్ బల్దియాకు రూ.40.29 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. రూ.5.20 కోట్లతో ఎనిమిది నర్సరీలు, 53 పట్టణ ప్రకృతి వనాలు, ఏడు పార్కులు నిర్మించారు. 30 పారిశుధ్య వాహనాలను కొనుగోలు చేయడంతోపాటు బంగారిగూడలో 36.5 ఎకరాల్లో కంపోస్టు షెడ్డు, తడి-పొడి చెత్త వేరు చేయడానికి డీఆర్సీసీ ఏర్పాటు చేశారు. రూ.1.29 కోట్లతో 29 మరుగుదొడ్లు, రూ.2 కోట్లతో ఎఫ్ఎస్టీపీ నిర్మించారు. రెండు వైకుంఠధామాలు ఏర్పాటు చేయడంతోపాటు వాటిలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. రూ.7.20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ యార్డును నిర్మిస్తున్నారు. వీటితోపాటు రూ.1.84 కోట్లతో18 వార్డుల్లో ఓపెన్ జిమ్లు, ఐదు వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.9 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డంపింగ్ యార్డులు, వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా మైదానాల అభివృద్ధి పనులు చేశారు.