పంటలకు విలువ.. రైతులకు లాభాలు..
బేల మండలం మంగ్రూడ్లో 250 ఎకరాల్లో పరిశ్రమలు
సాగవుతున్న పత్తి, కంది, సోయాబీన్, శనగ, జొన్న, టమాటా పంటలు
యూనిట్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి
ఆదిలాబాద్ , జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులు పండించిన పంటలకు అదనపు విలువను జతచేసి వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభానికి కసరత్తు మొదలు పెట్టగా, ఇప్పటికే బేల మండలం మంగ్రూడ్లో 250 ఎకరాల స్థలాన్ని యంత్రాంగం సేకరించింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు భూమిని అప్పగించేందుకు రెవెన్యూ శాఖ నిమగ్నమైంది. జిల్లాలో పత్తి, కంది, సోయాబీన్, శనగ, టమాటా పంటలు ఎక్కువగా సాగవుతుండగా, ప్రాసెసింగ్ చేసి ప్రముఖ సంస్థలకు నేరుగా విక్రయించే అవకాశం ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో రైతులు పండించే పంటలను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. రైతులు నష్టపోకుండా వానకాలం, యాసంగిలో సాగుచేస్తున్న పంటలను సర్కారు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నది. రైతులు పండించిన పంటలకు అదనపు విలువను జతచేసి వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ త్వరలో ప్రారంభంకానుంది. జిల్లాలో ఎక్కువగా రైతులు పత్తి, సోయాబీన్, కంది, టమాటా, శనగ పంటలు సాగు చేస్తారు. వీటి ఆధారిత పరిశ్రమల సెజ్ను ఏర్పాటు చేసి రైతులు నేరుగా పంటలను కార్పొరేట్ సంస్థలకు విక్రయించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఏటా 4.5 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుండగా 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. ఈ పంటకు అదనంగా విలువ జోడించడం ద్వారా పత్తిబేళ్లను తయారు చేయడంతో పాటు, పత్తి గింజల నూనె, విత్తనాలు, పశువుల పిండిని తయారు చేయవచ్చు. వీటిని కార్పొరేట్ కంపెనీలకు నేరుగా విక్రయిస్తే రైతులకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి.
జిల్లాలో బేల మండలం మంగ్రూడ్ సమీపంలో 250 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం 250 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు ఇక్కడ పర్యటించి భూములను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికంగా రైతులు పండించే పంటలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పంటలు పండిచవచ్చు? రవాణా సౌకర్యాలు, నీటి వసతి, ఇతర వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో రైతులకు అదనంగా ప్రయోజనాలు చేకూరడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
జిల్లాలో ఏటా 90 వేల ఎకరాల్లో సోయాబీన్ పంటను రైతులు సాగుచేస్తారు. నాలుగు నెలల పంట కాల వ్యవధి కాగా.. 3.75 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. సోయాబీన్ పౌష్టికాహారం కాగా.. నూనెతో పాటు ఇతర ఆహార ఉత్పత్తులు తయారు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా కంది పంటను సైతం రైతులు 72 వేల ఎకరాల్లో సాగు చేస్తారు. ఏటా పంట దిగుబడి 3.50 లక్షల క్వింటాళ్ల వరకు ఉంటుంది. కందులను పప్పుగా తయారు చేసి విక్రయించవచ్చు. శనగ పంట 22 వేల ఎకరాల్లో సాగవుతుండగా.. నాలుగు లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలుంటాయి. శనగ పప్పుతో పాటు పుట్నాలు తయారు చేసే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 1356 ఎకరాల్లో రైతులు టమాటా పంటను సాగు చేస్తారు. 6 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చే అవకాశాలు ఉండగా.. కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా టమాటా సాస్, కిచప్, పచ్చళ్లను తయారు చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర, ఇతర సరుకుల ధరలు బాగా పెరుగుతున్నందున ప్రాసెసింగ్ చేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు రైతులకు మంచి లాభాలు వస్తాయి.