ఆదిలాబాద్, మార్చి 10 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బ్యాంకుల్లో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, లావాదేవీల్లో పారదర్శకతలో భాగంగా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అవినీతిపరులైన కొందరు అధికారులు, సిబ్బంది అతి తెలివితో బ్యాంకు సొమ్మును దుర్వినియోగం చేస్తూ దొరికిపోతున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) బేల బ్రాంచ్లో ఇలాంటి బాగోతమే వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో ఇటీవల అధికారులు ఆడిట్ నిర్వహించారు. ఇందులో భాగంగా రూ.2.86 కోట్లకు సంబంధించి హెడ్ ఆఫీస్ అకౌంట్ నుంచి నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆదిలాబాద్ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులకు తెలిపారు. స్పందించిన బ్యాంకు సీఈవో శ్రీధర్రెడ్డి ఓ డీజీఎం, ఇద్దరు ఏజీఎంలు బేల బ్రాంచ్లో పూర్తి విచారణ చేపట్టాలని సూచించారు. బ్యాంకులో విచారణ చేసిన అధికారులు.. స్టాఫ్ అసిస్టెంట్ శ్రీపత్ కుమార్ పాస్వర్డు, ఐడీలు ఉపయోగించి రూ.2.86 కోట్లు తన బంధువులు, వివిధ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది ఖాతాల్లోకి బదలాయించినట్లు గుర్తించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు శ్రీపత్ కుమార్ 18 సార్లు డబ్బులను వివిధ ఖాతాల్లో జమచేశారు.ఆయన ఆథరైజ్ చేసిన డబ్బుల వివరాలను అసిస్టెంట్ మేనేజర్ రాజేశ్వర్, అనిత తమ ఐడీ నుంచి పాస్ చేసినట్లు విచారణలో తేల్చారు. విచారణ చేసిన పూర్తి అధికారులు నివేదికలను సీఈవోకు అందజేశారు.
బేల డీసీసీబీ బ్రాంచ్లో నిధుల దుర్వినియోగంలో ప్రమేయం ఉన్న 11 మంది బ్యాంకు మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. బేల బ్రాంచ్ స్టాఫ్ అసిస్టెంట్ శ్రీపత్ కుమార్తో పాటు అసిస్టెంట్ మేనేజర్ రాజేశ్వర్, క్యాషియర్ రాహుల్, అకౌంటెంట్ వనిత, భీంపూర్ బ్రాంచ్ అటెండర్ రమేశ్, జన్నారం స్టాఫ్ అసిస్టెంట్ బండి రమేశ్, మేనేజర్లు వేణుగోపాల్, ప్రవీణ్, ఆదిలాబాద్ రూరల్ బ్రాంచ్ మేనేజర్ సవిత, హెడ్ ఆఫీస్ మేనేజర్ ప్రవీణ్ను సస్పెండ్ చేశారు. సిబ్బంది, బంధువుల ఖాతాల్లో ఉన్న బ్యాంకు సొమ్ము రూ.60 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు ఆదిలాబాద్ డీసీసీబీ సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. సిబ్బందిపై శాఖాపరమైన, క్రిమినల్ కేసులతో పాటు సీఐడీ ఎంక్వయిరీ వేయనున్నట్లు పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సీఈవో, అధికారులు ఈ వ్యవహారంపై ఆదిలాబాద్ బ్యాంకులో సమావేశమై చర్చించారు. నిధుల దర్వినియోగానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపడుతామని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.