33 నర్సరీల్లో మొక్కల పెంపకం
అందుబాటులో 3.40 లక్షల మొక్కలు
బోథ్, జూన్ 1: రాష్ట్ర ప్రభుత్వం ఏడో విడుత హరితహారంలో మొక్కలు నాటేందుకు ఊరూరా నర్సరీలు ఏర్పాటు చేసింది. బోథ్ మండలంలో 33 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద నర్సరీలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో 11 వేల చొప్పున మొక్కలు పెంచుతున్నారు. బోథ్ నర్సరీలో 22 వేల మొక్కలు పెంచుతున్నారు. నిమ్మ, జామ, వేప, చింత, మునగ, ఉసిరి, సీతాఫలం, బొప్పాయి, కరివేపాకు, పలు రకాల పూల మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం మొక్కల పెంపకానికి వాతావరణం అనువుగా ఉండడంతో పాటు ఆశించిన స్థాయిలో పెరిగాయి. వానకాలం మొదలై సమృద్ధిగా వర్షాలు కురిశాక జూలై మొదటి వారంలో హరితహారం కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు మొక్కలు మరింత ఏపుగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రామాల వారీగా మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించేందుకు ఉపాధి హామీ సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నర్సరీలను ఎంపీడీవో సీహెచ్ రాధ, ఇన్చార్జి ఏపీవో భీంరావు, టెక్నికల్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు నర్సరీలను సందర్శిస్తూ నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు.
త్వరలోనే గుంతల తవ్వకం పనులు
హరితహారం కింద మొక్కలు నాటేందుకు గ్రామాల వారీగా త్వరలో గుంతల తవ్వకం పనులు ప్రారంభిస్తాం. 33 గ్రామ పంచాయతీల్లో 3.30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరో పది వేల మొక్కలు అదనంగా పెంచుతున్నాం. నాటిన తర్వాత మొక్కల సంరక్షణ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. -జాదవ్ భీంరావు, ఏపీవో, బోథ్