న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కో-వర్కింగ్ సంస్థ వుయ్వర్క్ గ్లోబల్.. భారత్కు గుడ్బై చెప్పాలని చూస్తున్నది. వుయ్వర్క్ ఇండియాలో తమకున్న మొత్తం 27 శాతం వాటాను సెకండరీ లావాదేవీ ద్వారా అమ్ముకునేందుకు సిద్ధమైన వుయ్వర్క్ గ్లోబల్.. కొనేందుకు అవకాశాలున్న వాటాదారులు, ఇన్వెస్టర్లతో చర్చలు జరిపినట్టు చెప్తున్నారు. వుయ్వర్క్ ఇండియాలో బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్నకు 73 శాతం వాటా ఉంటే, వుయ్వర్క్ గ్లోబల్కు 27 శాతం వాటా ఉన్నది. కాగా, వుయ్వర్క్ గ్లోబల్ దివాలా తీసిన విషయం తెలిసిందే. అమెరికాలో గత ఏడాది నవంబర్లో దివాలా పిటీషన్నూ వేసింది. ఈ క్రమంలోనే సంస్థ పునర్వ్యవస్థీకరణపై దృష్టిపెట్టింది. రుణ భారాన్ని దించుకుని, బ్యాలెన్స్ షీట్ను బలోపేతం చేసుకోవాలని చూస్తున్నది.
ఇందులో భాగంగానే వుయ్వర్క్ ఇండియాలో తమకున్న వాటాను అమ్ముకుని నిధులను సమీకరించాలని ఆ సంస్థ నిర్ణయించుకున్నది. మరోవైపు ఎంబసీ గ్రూప్ కూడా వుయ్వర్క్ ఇండియాలో 13 శాతం వాటాను తగ్గించుకోవాలని చూస్తున్నదంటున్నారు. ఈనమ్ గ్రూప్, ఏ91 పార్ట్నర్స్, క్యారెట్లేన్ వ్యవస్థాపకులు మిథున్ సాచేటి, మరికొందరు కలిసి వాటాలు కొనాలని చూస్తున్నట్టు సమాచారం. కాగా, హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, గురుగ్రామ్, నొయిడా, పుణెల్లోని 58చోట్ల 80 లక్షలకుపైగా చదరపు అడుగుల ఆస్తులు సంస్థకున్నాయి. వుయ్వర్క్ ఇండియా నుంచి వుయ్వర్క్ గ్లోబల్ వెళ్లిపోయినా.. ‘వుయ్వర్క్’ బ్రాండ్తోనే వుయ్వర్క్ ఇండియా కార్యకలాపాలు సాగుతాయంటున్నారు. అయితే ఈ బ్రాండ్ను వాడుకున్నందుకుగాను వుయ్వర్క్ ఇండియా కొంత ఫీజును చెల్లించే వీలున్నది.