ఆదిలాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. ఈ మేరకు వైద్యశాఖ 93 కేంద్రాలు ఏర్పాటు చేసి, అర్హులందరికీ టీకా ఇస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని అవగాహన కల్పిస్తున్నది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉండగా, మంచిర్యాలలో కేసుల సంఖ్య పెరుగుతున్నది. అర్హులందరూ తమ వివరాలను కొవిన్ యాప్లో నమోదు చేసుకొని, టీకా తీసుకోవాలని సూచిస్తున్నది. కాగా, ఇప్పటి వరకు 6,82,778 మందికి టీకా ఇచ్చినట్లు వైద్యశాఖ వెల్లడించింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖ అధికారులు 93 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు ఇస్తున్నారు. జిల్లా దవాఖానలతో పాటు కమ్యూనిటీ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ హెల్త్ సెంటర్లలో టీకా వేస్తున్నారు. కొవాగ్జిన్ మొదటి డోస్ తీసుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో డోస్.., కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న వారికి 98 రోజుల తర్వాత రెండో డోస ఇస్తున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. అర్హులైన వారు కొవిన్ యాప్లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉండగా, సూచించిన తేదీ, సమయం ప్రకారం తమ సమీపంలోని దవాఖానలకు వెళ్లి టీకా తీసుకుంటున్నారు. నేరుగా కేంద్రాలకు వచ్చిన వారి వివరాలను ఫోన్లో పరిశీలించిన సిబ్బంది, ఆన్లైన్లో నమోదు చేసుకొని వ్యాక్సిన్ వేస్తున్నారు. అర్హులందరూ టీకా తప్పనిసరిగా తీసుకోవాలని, వైరస్ బారినపడ్డా టీకా రక్షణగా ఉంటుందని అధికారులు తెలిపారు.
6,82,778 మందికి వ్యాక్సిన్..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 93 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 6,82,778 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఇందులో 4,98,921 మందికి మొదటి డోస్, 1,83,857 మందికి రెండో డోస్ వేసినట్లు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని 21 కేంద్రాల్లో 2,30,973 మందికి టీకా వేశారు. ఇందులో 1,55,804 మందికి మొదటి డోస్ వేయగా, 75,169 మందికి రెండో డోస్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని 29 కేంద్రాల్లో 1,29,689 టీకా ఇచ్చాడు. ఇందులో 96,793 మందికి మొదటి డోస్, 32,896 మందికి రెండో డోస్ వేశారు. మంచిర్యాల జిల్లాలోని 25 కేంద్రాల్లో 2,31,838 మందికి టీకా వేశారు. ఇందులో 1,77,684 మందికి మొదటి డోస్, 54,154 మందికి రెండో డోస్ వేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 18 కేంద్రాల్లో 90,275 మందికి టీకా ఇచ్చారు. ఇందులో మొదటి డోస్ తీసుకున్న వారు 68,637 మంది, రెండో డోస్ తీసుకున్న వారు 21,638 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 5 వేల నుంచి 6 వేల మందికి టీకా ఇస్తున్నామని అధికారులు వెల్లడించారు.
వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా వైరస్ సోకినా అంతంగా ప్రభావం చూపదు. అర్హులైన వారందరూ తప్పకుండా టీకా తీసుకోవాలి. కొవిన్ యాప్లో తమ వివరాలను నమోదు చేసుకొని ప్రభుత్వ దవాఖానలకు రావాలి. నేరుగా కేంద్రానికి వచ్చినా సిబ్బంది ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకొని టీకా వేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని 25 కేంద్రాల్లో రోజుకు 1200 నుంచి 1500 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నాం. గ్రామాల్లో టీకాపై వైద్యసిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. – నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి(ఆదిలాబాద్)