ఎదులాపురం, మార్చి 20: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే రామన్న మాట్లాడారు. నిత్యావసర సరకుల ధరలు, పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెటోల్ ధర రూ.70 ఉండగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.110 పెంచిదని మండిపడ్డారు. గ్యాస్ ధరను రూ.400 నుంచి రూ.1250 పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టాలని సీఎం కేసీఆర్కు ప్రధాని మోదీ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో బీజేపీ వైఫల్యాలపై ఇంటింటికీ వెళ్లి ప్రజలు వివరిస్తామని చెప్పారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, సంపదను ఆదాని, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బీఎల్ సంతోష్ విచారణపై స్పందించని కేంద్రం, ఎమ్మెల్సీ కవిత విచారణలో ఒత్తిడి పెంచుతుందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో ఎంపీపీ గండ్రత్ రమేశ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, నాయకులు సాజిదోద్దీన్, గంగారెడ్డి జగదీశ్, రాజు, భాస్కర్, మల్లేశ్, భీంరావు ఉన్నారు.
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి సహకారం
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తమ వంతుగా సహకారం అందిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీవాసవిమాత కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో ఆర్యవైశ్య ఆఫీషియల్, ప్రొఫెషనల్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్య సమాజ్ భనవ నిర్మాణానికి గతంలో రూ.70 లక్షలు కేటాయించామని, మరో రూ.30లక్షలు సైతం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ,జిల్లా ప్రతినిధులను సత్కరించారు. అంతకుముందుగా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఆర్థిక కార్యదర్శి శ్రీనివాస్, అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుండయ్య, బాధ్యులు సంపత్ కుమార్, రాజేశ్వర్, సంజయ్ కుమార్ పాల్గొన్నారు.