కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం చేతకాని కేంద్రం.. ఉపన్యాసాలతో పబ్బం గడుపుతున్నది మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయాలూ ప్రారంభం కొత్తగూడెం, మహబూబాబాద్లకు ముఖ్యమంత్రి వరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి అవతల ఉన్న ఒక మారుమూల గ్రామంలో త్రీఫేజ్ కరెంట్ లేదని అక్కడ కూడా కావాలని ఒక మిత్రుడు చెప్పాడు. ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదని, వెంటనే పనులు ప్రారంభించాలని అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ను ఆదేశించాను. ఇలా.. మారుమూల పల్లెల్లోనూ త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నాం.
మీ పల్లెల్లో, తండాల్లో, మున్సిపాలిటీల్లో ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో మీకే తెలుసు. ప్రజలు అడగకుండా, డిమాండ్లు లేకుండా, ఎవరూ ధర్నా చేయకుండానే అనేక కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టాం. అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. కులాలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా సమాజమే దేవాలయంగా భావించి అన్ని వర్గాల సంక్షేమాన్ని, సర్వజనుల హితాన్ని కాంక్షించి కార్యక్రమాలు తీసుకొచ్చాం.
ఎనిమిదేండ్ల కిందట తెలంగాణలో ప్రజల బతుకులెట్ల ఉండే.. ఇప్పుడు ఎట్ల ఉన్నయి. అప్పట్లో తెలంగాణలో పల్లెలెట్ల ఉండే. ఇప్పుడెట్ల ఉన్నవి. ఎనిమిదేండ్ల కిందటి తెలంగాణతో పోలిస్తే.. అసలు పోలిక, పొంతనే లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం మన తలసరి ఆదాయం 2.75 లక్షలు. జీఎస్డీపీ రూ.13 లక్షల కోట్లు. భారత దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ స్టేట్ తెలంగాణ.
దేశ అభివృద్ధి కోసం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. భవిష్యత్తు రాజకీయాల్లో దేశానికే ఓ వెలుగు మార్గం చూపించే అద్భుతమైన చైతన్య వీచిక మన తెలంగాణ నుంచే వీయాలని ఆకాంక్షించారు. కేంద్రంలోనూ పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దేశ అభివృద్ధిలో మన అభివృద్ధి ఇమిడి ఉంటుందని స్పష్టం చేశారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ భవనం, కొత్తగూడెంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం వేర్వేరుగా ఏర్పాటుచేసిన సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు రూ.40 కోట్లు, ముణుగూరు, ఇల్లెందుకు రూ.25 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. 37 టీఎంసీల నిల్వతో సీతారామ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నదని, అది పూర్తయితే ఖమ్మం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొడితే దేశం మరో అఫ్ఘాన్లా తయారవుతుందని, సమాజంలో అశాంతి రేగితే కర్యూలు వస్తాయని హెచ్చరించారు. దేశంలో చేతకాని నీటిపారుదల పాలసీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కరెంటు ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు.. కానీ ఉపన్యాసాలు మాత్రం ఇస్తారని విమర్శించారు. కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు.