నిర్మల్ టౌన్, అక్టోబర్ 26 : తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ను స్థాపించి తొలిసారిగా నిర్మల్ సభకు వచ్చిన జ్ఞాపకాలను ఇక్కడి నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి టీఆర్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ 2001లో నిర్మల్కు మొదటి సారిగా వచ్చారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బహిరంగసభ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపే ప్రసంగం చేశారు. కేసీఆర్ యాస, భాష, ఉద్యమ స్ఫూర్తికి ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్లో చేరారు. అప్పటి టీఆర్ఎస్ నేతలు తోట పాపేశ్, లక్కాకుల తుకారాం, చోట కలీం, అఫ్సర్, అబీర్, వడ్డే రాజేందర్రెడ్డి, పూదరి రంజిత్, కమలాధర్గుప్తా, తదితరులకు బహిరంగసభలో ప్రాతినిథ్యం లభించింది. నిర్మల్ మండలం భాగ్యనగర్, పోచంపాడ్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు.