సారంగాపూర్, ఆగస్టు 1 : ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నప్పటికీ ప్రతి సభ్యురాలికీ బీమా సౌకర్యం ఉండేది కాదు. వ్యాపార నిర్వహణ, వాహనాల కొనుగోలు, వైద్యం, విద్య, వ్యవసాయం వంటి తదితర అవసరాల కోసం స్త్రీ నిధి పథకం ద్వారా రుణాలు పొందిన మహిళలకు మాత్రమే సురక్షా బీమా పథకం వర్తించేంది. కానీ.. ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం రుణాలతో సం బంధం లేకుండా డ్వాక్రా సంఘంలో సభ్యులుగా కొనసాగుతు న్న ప్రతి మహిళలకూ సురక్షా బీమా సౌకర్యాన్ని కల్పించనున్నా రు. దీనికి విధి విధానాలు రూపొందించిన అధికారులు సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి పథకం ప్రారంభమైందని సెర్ప్ అధికారులు తెలిపారు.
నిబంధనలు..
ఏ,బీ,సీ,డీ గ్రేడ్ డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉండి 18-60 ఏళ్ల వయస్సు గల ప్రతి మహిళా ఈ పథకానికి అర్హురాలు.
సభ్యురాలు వయస్సు తెలియజేసే ఆధార్కార్డు, ఓటరు డ్రైవింగ్ లైసెన్సు, విద్యార్హత ధ్రువపత్రం, పాన్కార్డు, పాస్పోర్ట్ ఇలా ఏదో ఒక గుర్తింపు కార్డుతో దరఖాస్తు చేసి సభ్యత్వం పొందవచ్చు.
సంఘంలోని సభ్యుల తీర్మానం ప్రకారం బీమా పథకంలో చేరాలి.
ఒక సంఘంలో ఉన్న సభ్యులందరు పథకంలో చేరాలని నియమం లేదు. సభ్యురాలికి నచ్చితేనే బీమా పథకం పొందవచ్చు.
సురక్షా బీమా పథకం కాలపరిమితి మూడేండ్లపాటు ఉంటుంది. బీమా పథకంలో చేరిన సభ్యురాలు ఏడాదికి రూ.230 చొప్పున మూడేండ్లు రూ.690 చెల్లించాలి.
బీమా ప్రీమియం చెల్లించడానికి సభ్యురాలి దగ్గర డబ్బులు లేనటైయితే స్త్రీనిధి పథకం ద్వారా ప్రత్యేక రుణాన్ని పొందవచ్చు. సంఘంలో ఉన్న సభ్యులందరికి కలిపి ఏకమొత్తంలో రుణం అందిస్తారు. ఈ రుణాన్ని నెలసరి వాయిదా రూపంలో రూ.30 చొప్పున 24 నెలలు చెల్లిస్తే సరిపోతుంది.
కాలపరిమితి పూర్తయిన తరువాత తిరిగి ప్రీమియం చెల్లించి తమ సభ్యత్వాన్ని కొనసాగించుకోవచ్చు.
సురక్షా బీమా పథకంలో చేరిన సభ్యురాలు మరణిస్తే తక్షణ సాయంగా రూ.5వేలు అందిస్తారు. మిగతా రూ.95వేలను గ్రామ సమాఖ్య ద్వారా ఇస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి..
స్వయం సహాయక సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలు సురక్షా బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రుణం తీసుకున్నా, తీసుకొకున్నా సభ్యురాలు ఏడాది రూ. 230 చొప్పున మూడేండ్లు రూ.690 చెల్లించాలి. సభ్యురాలు ప్రమాదవశాత్తు, సహజ మరణం పొందినా రూ. ఒక లక్ష నామిని పేరిట ప్రభుత్వం చెల్లించి సభ్యురాలికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు 58-59 సంవత్సరాల వారికే బీమా కల్పిస్తున్నారు. కానీ.. సురక్షా బీమా పథకం ద్వారా 60 ఏళ్ల లోపు సభ్యురాలికి కూడా బీమా చేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 56,336 సంఘాలు ఉండగా.. 6,15,105 మంది సభ్యులు ఉన్నారు. – మురళీకృష్ణ, స్త్రీనిధి మేనేజర్, నిర్మల్ జిల్లా