ప్రశ్నల సంఖ్య గణనీయంగా పెంపు
గతంలో రెండు సెక్షన్లల్లోనే.. ఇప్పుడు
అన్ని సెక్షన్లలో వదిలేసుకొనే ప్రశ్నలు
వెబ్సైట్లో మాదిరి ప్రశ్నపత్రాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 : ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల చాయిస్ను అధికారులు రెట్టింపుచేశారు. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచి, చాయిస్గా వదిలేసుకొనే అవకాశం కల్పించారు. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్బోర్డు అధికారులు వెబ్సైట్లోపెట్టారు. గతేడాది మూడు సెక్షన్లకుగాను రెండింటిలో మాత్రమే 50 శాతం చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా.. ఇప్పుడు మూడు సెక్షన్లలో చాయిస్ ప్రశ్నలిచ్చారు. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఎస్సెస్సీలో పరీక్షలు రాయకుండానే పాసయ్యారు. పైగా గతేడాది నిర్వహించిన పరీక్షల్లో అత్యధికులు ఫెయిల్ కావడంతో చాయిస్ ప్రశ్నలు పెంచి మోడల్ ప్రశ్నపత్రాలను సిద్ధంచేశారు.