వర్షకాలంలో ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. చిరు జల్లులను ఆస్వాదిస్తూ ఎండకాలపు వేడి పోయిందని సంతోషిస్తాం కానీ, వర్షకాలంలో సీజనల్ జ్వరాల తాకిడి ఎక్కువన్న విషయం మరచిపోతాం. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, జలుబు-దగ్గు.. ఇలా రకరకాల రుగ్మతలు శరీర వ్యవస్థపై దాడి చేస్తాయి. ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోతే రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ఈ సీజన్లో పప్పు ధాన్యాలు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. పల్లీలు (ఉడకబెట్టినవి), నానబెట్టిన పప్పుధాన్యాలు, మొక్కజొన్న తరచూ తినాలి. దోస, గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలు శరీరానికి పోషకాలను అందిస్తాయి. క్యారెట్, బీట్రూట్ వంటి వేరుజాతి రకాలు ఆరోగ్యానికి గొడుగు పడతాయి. ఇదే సమయంలో పరిశుభ్రత చాలా ముఖ్యం. పిల్లల ఆరోగ్యం విషయంలోనూ తగినన్ని జాగ్రత్తలు అవసరం. అసలే చిన్నారులకు రోగ నిరోధక శక్తి తక్కువ.