చాలామంది ఉదయం లేవగానే.. కాఫీలు, టీలు లాగించేస్తారు. అయితే, ఉదయపు ఆహారం మాత్రం.. ఆరోగ్యానికి ఎంతోకొంత ఉపయోగపడేలా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటి పండు, ఖర్జూరం ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయని చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినగలిగే పండ్లలో ఖర్జూరాలు ముందు వరుసలో ఉంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఖర్జూరాల్లోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు.. శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.
ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు.. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఐరన్ అధికంగా లభించడం వల్ల.. రక్తహీనతను తరిమేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, పిల్లలకు వీటిని రెగ్యులర్గా అందివ్వాలి. అయితే, రాత్రిపూట నీళ్లు లేదా పాలలో 2-3 ఎండు ఖర్జూరాలను నానబెట్టి.. ఉదయాన్నే పరగడుపున తింటే రెట్టింపు ప్రయోజనం చేకూరుతుంది. పొటాషియం, మెగ్నీషియం, సహజ చక్కెరలతో నిండి ఉండే అరటిపండ్లు.. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
వీటిలోని పొటాషియం.. గుండె పనితీరుకు ప్రయోజనం కలిగిస్తుంది. అరటి పండ్లలో ‘ట్రిప్టోఫాన్’ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోకి చేరిన తర్వాత సెరోటోనిన్గా మారుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే, ఉదయాన్నే అరటిపండు తినడం వల్ల.. ఆ రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. అరటిపండ్లలో ఉండే పీచు పదార్థం.. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థ సజావుగా సాగేలా చేస్తుంది. అంతేకాకుండా.. క్రమం తప్పకుండా అరటి పండ్లను తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది.