వయసు సెంచరీ కొట్టాలంటే.. ఏజ్ యాభైదాటాక కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అలవాటైన ఆహార నియమాలే కొనసాగిస్తానంటే.. అరవైలోనే ఆస్పత్రిపాలు కావాల్సి వస్తుంది. డెబ్బయ్ దాటకుండానే రనౌట్ అయ్యే ప్రమాదమూ ఉంది. యాభై ఏండ్లు దాటాక జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. శరీర పోషక అవసరాలూ మారుతుంటాయి. మలివయసులో ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం ఎంతైనా మంచిది. అవేంటంటే..
వేపుళ్లు వద్దు: వయసులో హాఫ్ సెంచరీ కొట్టాక.. రోజువారీ ఆహారంలో వేపుళ్ల కోసం వేయించుకు తినడం మానేయాల్సిందే! పండుగకో పబ్బానికో రుచి చూడొచ్చు కానీ, ప్రతిరోజూ కరకరలాడే వేపుళ్లు తింటే ప్రమాదమే! వాటిలో ఉండే నూనె శరీరానికి మంచిది కాదు. పైగా పొట్టలో కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోతుంది. అంతగా తినాలి అనుకుంటే.. ఎయిర్ ఫ్రయిర్లో గానీ, ఓవెన్లో గానీ తయారుచేసుకుంటే కాస్త మంచిది!
చక్కెరకు చెక్: జ్యూస్, గ్రీన్ టీ, బలవర్ధకం.. లాంటి లేబుల్స్ చూసి అవి ఆరోగ్యవంతమైనవి అనుకొని మోసపోతుంటాం. నిజానికి చూడాల్సింది అందులోని చక్కెర శాతం. అవి నడివయసుకు మంచివి కావు. చక్కెరకు చెక్ పెడితే గానీ, కొలెస్ట్రాల్కు కామా పడదు!
చాపల్యం చాలు: యాభై ఏండ్లు వచ్చే వరకు ఆస్వాదించిన రుచులు చాలు. జిహ్వ చాపల్యాన్ని ఎంత వదులుకుంటే అంత ఆరోగ్యం. రుచుల కోసం ప్యాకేజ్డ్ ఫుడ్కు అలవాటుపడితే చేటు తప్పదు. వీటిలో కనిపించకుండా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని హిడెన్ షుగర్ అంటారు. వీటి బదులు తాజా పండ్లు తినడం మంచిది.
మందుకు నో: వయసు పెరుగుతున్న కొద్దీ.. మద్యం వల్ల కలిగే దుష్ఫలితాలూ పెరుగుతాయి. మద్యంతో కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది. యాభయ్యో పుట్టినరోజు నాడు డ్రింకింగ్ హ్యాబిట్కు స్వస్తి పలకండి.
ఉప్పు ముప్పు: రోజువారీ ఆహారంలో 2300 మిల్లీగ్రాములకు మించి ఉప్పు ఉండకూడదన్నది నిపుణుల మాట. కానీ, మనం అంతకు ఎన్నో రెట్లు లాగించేస్తుంటాం. నడివయసులో వచ్చే అధిక రక్తపోటు లాంటి సమస్యలను ఉప్పు తీవ్రతరం చేస్తుంది. వీలైనంత వరకు ఉప్పు తగ్గించడం అత్యవసరం అని గుర్తించండి.