ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్.. బతుకుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. కీమో థెరపీలు ఒంటిని కాల్చేస్తుంటే.. ప్రత్యక్ష నరకాన్ని అనుభవించింది. తన వార్డులో ఉన్నవారంతా ఒక్కొక్కరుగా
కన్నుమూస్తుంటే.. తనుకూడా రోజులు లెక్కించేది జైపూర్కు చెందిన విభా అగర్వాల్( Vibha Agarwal ). అంతలోనే ఓ శుభవార్త చెప్పాడు డాక్టర్. క్యాన్సర్ గండాన్ని ఆమె గట్టెక్కింది.
అప్పటిదాకా ఒక జన్మ. క్యాన్సర్ నుంచి బయటపడ్డాక ఇంకొక జన్మ. ‘ఈ సమాజంలో నా అవసరం ఎవరికి ఉంది?’ అన్న ప్రశ్నతో దవాఖానలోంచి అడుగు బయటపెట్టింది విభ. నేరుగా హరిద్వార్లోని శాంతికుంజ్లో ఉన్న స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఆ కుటుంబం అణగారిన వర్గాల హక్కుల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలైంది. శాంతికుంజ్ ఆశ్రమంలో వివిధ జీవన నైపుణ్య కార్యక్రమాల్లో శిక్షణ తీసుకుంది. జైపూర్కు తిరిగి వచ్చి 40 మంది మహిళలు, బాలికలను ఓ చోట చేర్చి టైలరింగ్లో శిక్షణ ఇచ్చింది. ‘చేత్నా గ్రామ సంతన్’ అనే ఎన్జీఓను ఏర్పాటు చేసి, 11 మంది సభ్యులతో చిన్న సహకార సంఘాన్ని స్థాపించింది. టైలరింగ్ శిక్షణ పూర్తయిన మహిళలకు క్లాత్ సరఫరా చేసి.. స్కూల్ డ్రెస్లు, జ్యూట్ బ్యాగ్లు, కుర్తాలు తదితర ఉత్పత్తులు తయారు చేయించింది. ‘ఊర్జా దీపక్’ అనే ఎకోఫ్రెండ్లీ దీపాలను చేయించి ఆన్లైన్లో విక్రయిస్తున్నది. ప్రస్తుతం జైపూర్ సమీపంలోని అరవైకి పైగా గ్రామాల్లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 8వేల మంది మహిళలకు ఆర్థికంగా అండగా నిలబడింది. ఓ మంచి మనిషికి బతికే అవకాశం ఇచ్చిన క్యాన్సర్కు కృతజ్ఞతలు.
“అనుమానాలను పటాపంచలు చేసి గిరిజనులకు అండగా మారిన డాక్టర్.. ఇంతకీ ఆయన ఏం చేశాడు?”
“ఇవి గెలిచినోళ్ల సక్సెస్ స్టోరీస్ కాదు.. ఒక్క తప్పుతో బొక్కబోర్లా పడ్డ వ్యాపారుల కథలు!!”