నాలుగొందల ఏండ్ల కళ.. నకాషీ. దనాలకోట వెంకయ్య నుంచి ఆయన కుమారుడు వెంకటరమణయ్య.. అటునుంచి కొడుకులు, కోడళ్లు, మనవళ్లు.. ఇలా తరాలు మారినా తరగని హంగులతో మెప్పిస్తూనే ఉన్నది. కాల ప్రవాహంలో కష్ట్టనష్టాలు ఎదురైనా.. నకాషీ కళలో అంతే నాణ్యత, ఆ బొమ్మల్లో అదే జీవం. వెంకటరమణయ్య దగ్గర పాఠాలు నేర్చుకున్న పశుల మల్లేశం తన జీవిత భాగస్వామి మంగకు ఆ మెలకువలు నేర్పాడు. వీహబ్ సాయంతో ఆమె సంప్రదాయ కళకు వ్యాపార హంగులు అద్దింది. ఆర్ట్ప్రెన్యూర్గా పేరు తెచ్చుకున్నది.
‘గత ఏడాది రెండు మరణాలు సంభవించాయి. రోజుల వ్యవధిలోనే మా అమ్మ, అత్తమ్మ చనిపోయారు. చేతిలో చిల్లిగవ్వలేదు. చేద్దామంటే పని లేదు. ఆ సమయంలో వీహబ్ మాకు ఒకేసారి రెండు లక్షల రూపాయల ఆర్డర్ ఇచ్చింది. ఆ సాయంతోనే మా కుటుంబం మళ్లీ నిలదొక్కుకున్నది. మా నుంచి రూపాయి కూడా ఆశించకుండా శిక్షణ ఇచ్చి, మార్కెటింగ్ కల్పించి, కొత్తకొత్త సలహాలు అందించి.. కష్టకాలంలో మాకు అండగా నిలిచింది. వ్యాపార ఆలోచన ఉన్న ప్రతి మహిళా ముందుగా వీహబ్ను సంప్రదించడం ఉత్తమం’ అంటున్నది చేర్యాలకు చెందిన నకాషీ కళాకారిణి మంగ. పురాతన కళపై పట్టుసాధించి, ఆ కళనే జీవనోపాధిగా ఎంచుకున్నది మంగ. ఇప్పుడు, ఓ పది కుటుంబాలకు ఆశాదీపమైంది.
దనాలకోట కుటుంబం నుంచి..
చేర్యాల నకాషీ కళను తరాలుగా బతికిస్తున్నది.. దనాలకోట వెంకయ్య కుటుంబం. ఆయన కొడుకు వెంకట రమణయ్య దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు పశుల మల్లేశం. స్వయంగా బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. ఇరవై ఏండ్ల నుంచీ ఈ కళనే బతుకు దెరువుగా మార్చుకున్నాడు. భర్త పనిలో తానూ ప్రావీణ్యం సాధించింది మంగ. రామాయణ, మహాభారత ఘట్టాలకు, కులపురాణ దృశ్యాలకు బొమ్మల రూపం ఇచ్చేవారు ఇద్దరూ. కథకులు సన్నివేశాలను వివరిస్తుంటే ఏకాగ్రతతో చిత్రాలుగా ప్రాణంపోసేవారు. అయితే, వాటి వల్ల ఆదాయం తక్కువే. దీంతో కొత్త మార్గాన్ని అన్వేషించారు మంగ దంపతులు.
కళాత్మక ప్రయోగాలు
చేర్యాల నకాషీ కళతో కొత్తగా గణపతి, రాజారాణి, అర్ధనారీశ్వరులు, ఇతర దేవుళ్ల మాస్కులు (బొమ్మలు), కీ చెయిన్స్, పెయింటింగ్స్, పెన్స్టాండ్స్, కాటమరాజు-గంగాదేవి బొమ్మలు, మల్లన్న బొమ్మలు, 52 బొమ్మల సెట్ వంటివి తయారుచేయడం మొదలుపెట్టారు మంగ దంపతులు. ఆ ముచ్చటైన ఆకృతులను చాలామంది షోకేస్లలో అలంకరించుకోవడం మొదలు పెట్టారు. దీంతో గిరాకీ పెరిగింది. కొబ్బరి చిప్పలతో చేసిన ప్రయోగాలూ విజయం సాధించాయి. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి తదితర పండుగల మనోహర దృశ్యాలకు నకాషీ శైలిలో ప్రాణంపోశారు. తమ ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వ అవార్డునూ అందుకున్నారు.
దిశ మార్చిన వీహబ్
గతంలో మంగ కుటుంబం తాము చేసిన బొమ్మలను లేపాక్షి ఎంపోరియానికి ఇచ్చేది. అంతకుమించి వాళ్లకు మార్కెటింగ్ చేసుకోవడం తెలియదు. ఆ ప్రాచీన సంప్రదాయాన్ని బతికించాలనే ఉద్దేశంతో.. సిద్దిపేట డీఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించే ఎగ్జిబిషన్లలో చేర్యాల నకాషీ బొమ్మల ప్రదర్శనకు స్టాల్ ఇచ్చేవారు. క్రమంగా ఈ కళ గురించి ప్రజలకు తెలిసింది. వీహబ్ను సంప్రదిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చని ఎవరో సలహా ఇచ్చారు. దీంతో మంగ హైదరాబాద్ వచ్చి డెమో ఇచ్చింది. వీహబ్ ప్రతినిధులు ఆమె నైపుణ్యాన్ని కొనియాడారు. ఆర్థిక తోడ్పాటు అందించడంతోపాటు తరాలనాటి కళకు కొత్త హంగులు అద్దేలా కొన్ని సూచనలు చేశారు. ఆ మార్కెటింగ్ పరిజ్ఞానంతో చేర్యాల కళను సరికొత్తగా ఆవిష్కరించారా దంపతులు. ఒకప్పుడు నెలకు పదివేలు సంపాదించడమే గగనం. ఇప్పుడు సునాయాసంగా యాభైవేలు కళ్లజూస్తున్నారు.
పదిమందికి ఉపాధి
చేర్యాల నకాషీ ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో మంగ దంపతులకు పని ఒత్తిడి కూడా పెరిగింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల నుంచి భారీ ఆర్డర్లు వస్తుండటంతో ఓ పదిమందిని నియమించుకున్నారు. కొందరు మహిళలకు శిక్షణ ఇచ్చి బొమ్మలు చేయడం నేర్పించారు. కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆర్డర్లు ఇప్పించి ఉపాధి కల్పించారు. ఒక నకాషీ బొమ్మను చేయాలంటే ముడి సరుకును వివిధ దశల్లో ఏడుసార్లు ఆరబెట్టాలి. తయారీలో ఎలాంటి రసాయనాలూ ఉపయోగించరు. సహజసిద్ధంగా దొరికే రంగురాళ్ల రంగులు, తిరుమని చెట్ల బంక, కిరోసిన్ దీపం మసి, శంఖం పొడి, కూరగాయల నుంచి తీసిన వర్ణాలతో తయారు చేస్తారు. అందుకే నకాషీ చిత్రాలు, బొమ్మలు నాలుగైదు దశాబ్దాల తర్వాత కూడా కొత్తగా ఉంటాయి.
– రవికుమార్ తోటపల్లి