ఉద్యమం ఊపు మీదున్నది. వలిగొండ రహదారి దిగ్బంధనం అయ్యింది. ‘జై తెలంగాణ’ నినాదాలు హోరెత్తుతున్నయి. ఇంతలో, ‘ఆడుదాం డప్పుల్లా దరువెయ్రా’ అని ఒకమ్మాయి పాటను అందుకుంది. అంతే, నినాదాలు జోరందుకున్నయి. ఒక పాటతో మొదలైన ఆమె పాటల ప్రవాహం గంటలకొద్దీ సాగింది. తెలంగాణకు మరో జానపద ఆణిముత్యం దొరికింది. బోనగిరి ఖిల్లాపైనుంచి తెలంగాణ ప్రేమను గుండెలనిండా వినిపించిన గాయని యాట సంధ్య ముచ్చట్లు.
మాది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ. చిన్నప్పుడు సీడీలలో జానపద పాటలు వింటూ అనుకరించేదాన్ని. స్కూల్లో ఎప్పుడు, ఏ కార్యక్రమం జరిగినా టీచర్లు నాకు పాడే అవకాశం ఇచ్చేవాళ్లు. ప్రతీ ఈవెంట్లో నేను సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచేదాన్ని. ‘సంధ్య ఏదో కొత్త పాట పాడుతది. కార్యక్రమానికి ఊపొస్తది’ అనుకునేవాళ్లు. పాట నాకు అమ్మద్వారా అబ్బింది. అమ్మకూడా జానపదాలు, బతుకమ్మ పాటలు పాడేది. ‘తల్లి లెక్కనే బాగ పాడుతున్నవ్ బిడ్డా..’ అని అందరూ మెచ్చుకునేవాళ్లు. మా అమ్మ పేరు అనసూయ, నాన్న సత్తయ్య.
ఉద్యమపాటల ఆకర్షణ
అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా. నాకు ఆటలంటే ఇష్టం. ఖోఖో, పరుగుపందెంలో చాలా బహుమతులు సంపాదించిన. ఏదో సరదాకోసం పాటలు పాడుతున్న తప్పితే, నా ఫైనల్ గోల్ మాత్రం ఆటలే. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే తెలంగాణ ఉద్యమం విస్తరిస్తున్నది. తెలంగాణ పాటలు వింటుంటే రోమాలు నిక్కబొడిచేవి. ‘నేనుకూడా ఇలా పాడాలి’ అనిపించేది. ఆ పాటలే నన్ను ‘తెలంగాణ ఏంది? ఉద్యమమేంది?’ అని తెలుసుకునేలా చేశాయి. ఒకవైపు ఆటలు, పాటలు, మరోవైపు పరీక్షలు. మొత్తానికి టెన్త్ అయిపోయింది. ఎక్కడ తెలంగాణ ఉద్యమ వేదిక తారస పడితే అక్కడికి వెళ్లేదాన్ని. పెద్దల ఉపన్యాసాలు, కళాకారుల పాటలు వినేదాన్ని.
అవసరమా అనేవాళ్లు..
అది 2009. వరంగల్ రోడ్డు దిగ్బంధనం జరుగుతున్నది. అందరూ నినాదాలు చేస్తున్నారు. ఇంకా ఊపు రావడానికి పాటలు పాడుతుండ్రు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న నాకు ఆ ఊపులో పూనకం వచ్చినంత పనైంది. ‘అన్నా.. నేను కూడా పాడతా’ అన్నాను. అవకాశం రాగానే విమలక్క పాట ‘ఆడుదాం డప్పుల్లా దరువెయ్రా’ పాడిన. అందరూ మెచ్చుకున్నారు. ‘చిన్న దానివే అయినా మస్తు పాడుతున్నవ్రా.. ఉద్యమానికి నీలాంటి గొంతు అవసరం’ అన్నారు. ‘అమ్మాయివి ఈ ఉద్యమాలు, పాటలు నీకెందుకు?’ అని మొఖం మీదే అన్నవాళ్లూ ఉన్నారు. అవేవీ లెక్క చేయకుండా పాటతోనే ప్రయాణించిన.
రచ్చబండపై పాట తూటా
వలిగొండలోనే ఇంటర్లో చేరిన. చదువుకుంటనే ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. అప్పుడే కొన్ని గ్యాంగుల నుంచి బెదిరింపులు వచ్చినయి. నేను చిన్నపిల్లను. నేను పాట పాడితే వాళ్లకు సమస్యేందో అర్థం కాలేదు. 2011లో ఒకసారి వలిగొండలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు వచ్చిండ్రు. ‘ఒక దిక్కు తెలంగాణ కోసం కొట్లాడుతుంటే మరో దిక్కు మీ రచ్చబండలేంది’ అని జనాలు ఎవ్వర్నీ ఊర్లల్లకు రానిస్త లేరు. ఆరోజు నేనూ వెళ్లిన. ‘మీరిచ్చే బిచ్చం మాకొద్దు. మా తెలంగాణ మాగ్గావాలె’ అని పాట పాడిన. లొల్లి పుట్టిందిగ. వలిగొండ రచ్చబండ రభస తర్వాత నాపై నిఘా మొదలైంది. ‘ఎవరీ అమ్మాయి? కుటుంబ నేపథ్యం ఏంటి?’ అని పోలీసులు ఆరా తీసిండ్రు. ఒక్కోసారైతే ‘పాట పాడటమైనా బంద్ చేయాలె. లేకపోతే మాకు సరెండరైనా కావాలె’ అనే షరతులు పెట్టిండ్రు. దీంతో మా అమ్మానాయిన భయపడ్డరు. ‘కాయకష్టం చేసుకొని బతికెటోళ్లం. మనకెందుకు బిడ్డా ఇవన్నీ? ఉండెతాన ఉండక లోకం మీద పంచాయితీ మన ఇంట్లకెందుకు తెస్తున్నవ్’ అన్నరు. తల్లిదండ్రులు అన్న దాంట్లో న్యాయం కనిపించింది. కానీ, 60 యేండ్ల సంది ‘నాకెందుకు? నీకెందుకు?’ అనుకుంటనే ఉన్నం. ఆగమైనం. ‘ఈసారి అట్లా కావొద్దు’ అనేది నా ఆలోచన. తెలంగాణ సమాజం తెలివికొచ్చింది. ఉద్యమిస్తున్నది. ఆ ఉద్యమంలో భాగస్వామ్యం కాకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని చెప్పేదాన్ని.
ఆట పదునెక్కింది
‘తెలంగాణ వస్తే నేనొక్కదాన్నే కాదు, భవిష్యత్ తరాలూ బాగు పడతయి. ఇప్పుడు కాకపోతే మల్లెప్పుడూ ఇంతలా ఉద్యమించలేం’ అనిపించింది. తెలంగాణ ధూమ్ధామ్లకు వెళ్లేదాన్ని. పెద్ద కళాకారులతో పరిచయమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వందల కార్యక్రమాలు నిర్వహించాం. ఇంకోసారీ ఇంట్లోవాళ్లు ‘వద్దు’ అన్నారు. ‘మీరు నన్ను నిర్బంధించినా నేనైతే పాల్గొంటా. నా పాటతో నా వంతుగా ఉద్యమానికి ఊపిరి పోస్తా’ అని చెప్పేసిన. వినేటట్లు లేదని మా మామయ్యను పిలిపించి, నన్ను హైదరాబాద్ పంపించేసిండ్రు. కోఠి ఉమెన్స్ కాలేజీలో చేరిన. అక్కడ నాకు పాటకు తోడు, ఆటకు పదును పెట్టే అవకాశం లభించింది. అథ్లెటిక్స్లో నేషనల్ లెవల్ వరకు వెళ్లగలిగిన.
రగిలేటి అగ్గిమంటల్లో..
కోఠి ఉమెన్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తది. క్యాంపస్లో ఏ కార్యక్రమమైనా మేమంతా పాల్గొనేవాళ్లం. నేను పాటనే అస్త్రంగా మలుచుకున్నా. ‘త్యాగాల తెలంగాణ జెండా లెత్తకున్నమో విద్యార్థి వీరులారా.. జగడమాడుతున్నమో విద్యార్థి వీరులారా’, ‘పొడిసేటి పొద్దు పొడుపుల్లా పొడిసిండు శ్రీకాంతచారి.. రగిలేటి అగ్గిమంటల్లో దూకిండు చూపించి దారి’, ‘రగులుతున్నది తెలంగాణమూ రాయేశుడా రారా.. కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేశుడా లేరా’.. వంటి ఎన్నో పాటలు పాడినా. తిండీ తిప్పలు మాని ఉద్యమం చేసినా. మిలియన్ మార్చ్లో నా కాలికి రబ్బరు బుల్లెట్ తాకింది. ఆ మరక ఇప్పటికీ అలాగే ఉంది. దాన్ని చూసినప్పుడల్లా ఉద్యమం నాటి జ్ఞాపకాలు, సోపతులు గుర్తుకొస్తయి.
నా పాట బతికింది
తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడమే కెరీర్ అనుకొని ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. పాటలు ఎన్ని రోజులు పాడాలె? అయినా, ఇంకేం పాడుతం తెలంగాణ వచ్చినంక? అనిపించింది. 2014లో నా పెండ్లి జరిగింది. మా ఆయన శేఖర్రెడ్డి. నా ఉద్యమ సహచరుడు. ప్రేమించి పెండ్లి చేసుకున్నం. పెండ్లి అయ్యేనాటికి మా చేతిలో ఒక్క రూపాయికూడా లేదు. కష్టాన్నే నమ్ముకొని ముందుకెళ్లినం. అదే మమ్మల్ని నిలబెట్టింది. నా పాటను బతికించింది. మా ఆయన సపోర్ట్ చేయకపోతే నాకు ఈ గుర్తింపు, స్థాయి దక్కేవి కాదు.
మలుపు తిప్పిన పాట
2015లో ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’లో ఉద్యోగం వచ్చింది. అప్పటినుంచి యాదాద్రి భువనగిరి జిల్లా డీపీఆర్వోకు అనుబంధంగా పనిచేస్తున్నా. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేను పాడిన పాట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఎన్నికల పాటంటే నా పాటే!
‘తెలంగాణ గడ్డమీద గులాబీ జెండా’ పాటను నేను, నెల్లుట్ల సుమన్ కలిసి రాసినం. ఈ ఒక్క ట్రాక్పైనే నేనొక్కదాన్నే వెయ్యి పాటలు పాడిన. బతుకమ్మ, బోనాలకు రెగ్యులర్గా సాంగ్స్ చేస్తున్నా. పాటతో పాటు ఆటనూ కంటిన్యూ చేయాలన్నదే నా ఆలోచన.
‘తెలంగాణ గడ్డమీద’ పాట జనాల్లోకి వెళ్లింది.
దాన్ని మేం యూట్యూబ్లో పెట్టలేదు. దీంతో ఎలాంటి కాపీరైట్ వర్తించలేదు. ఇప్పడు పంచాయతీ ఎన్నికలనుంచి పార్లమెంట్ ఎన్నికలవరకు ఆ పాటనే పేర్లు మార్చేసి వాడుకుంటున్నరు. నా పాట ఇలా విస్తరించినందుకు సంతోషంగానే ఉంది.
-దాయి శ్రీశైలం