ఒక్క ఏడాదిలోనే.. లెక్కలేనన్ని ఘనతలు. అనేకానేక రికార్డుల కంచు ఢక్క లు పగలగొట్టింది. సింహం బరిలోకి దిగేవరకూ వేటగాడు చెప్పిందే చరిత్ర . మహిళ రంగంలో దూకేవరకూ పురుషుడి విజయాలే శాసనాలూ, శిలాఫలకాలు. ఇప్పుడు.. చరిత్ర రాసేది ఆమె.. తిరగరాసేదీ ఆమే. రాబోయే సంవత్సరమూ తనదే.. ఏడాది ఏమిటి.. దశాబ్దం, శతాబ్దం.. భవిష్యత్తు మొత్తం ఆమెదే. నిజమే, అవరోధాలు ఉండవచ్చు. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళ పరిస్థితి ఏమంత మెరుగుపడలేదు. కార్పొరేట్ కారిడార్లలో పదిమంది పురుషులలో ఒకరిద్దరే స్త్రీలు కావచ్చు. లైంగిక వేధింపులు, గృహహింస తగ్గిన దాఖలాలు కనిపించకపోవచ్చు. రాజకీయాల్లో భర్తచాటు నేతలుగానే మిగిలిపోవచ్చు. యుగాల వివక్షను గెలిచిన వారికి.. ఇదో చిన్నపాటి కుదుపే. తప్పక అధిగ మిస్తారు.‘వియ్ షల్ ఓవర్ కమ్ .. వియ్ షల్ ఓవర్ కమ్.. వియ్ షల్ ఓవర్ కమ్ సమ్ డే’ .. ఆ రోజూ కనుచూపు మేరలోనే. .. ఆ మార్పు చేతికందేంత చేరువలోనే. ఈ విజయ గాథలే అందుకు సాక్ష్యాలు..
భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లలో సంతాలుల పోరాటం ముఖ్యమైనది. అయితే, చరిత్రలో మూలన పడిపోయిన ఆ ఆదివాసీలు చాలావరకు అధికారానికి దూరంగా ఉండిపోయారు. అలాంటి సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఈ ఏడాది దేశ అత్యున్నత పీఠానికి చేరుకున్నారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో మారుమూల గ్రామం.. ఉపర్బేడాలో జన్మించారామె. నిరుపేద కుటుంబం. ఆ గ్రామం నుంచి బీయే డిగ్రీ పొందిన మొదటి మహిళ తనే. డిగ్రీ తర్వాత కొంతకాలం క్లర్కుగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఉపాధ్యాయురాలిగానూ సేవలందించారు. రాజకీయ జీవితం మొదలుపెట్టిన తర్వాత.. జార్ఖండ్ రాష్ర్టానికి మొదటి మహిళా గవర్నర్గా పనిచేశారు. అతి చిన్న వయసులో ఎన్నికైన రాష్ట్రపతిగా, ఆ పదవిని చేపట్టిన తొలి ఆదివాసిగా చరిత్ర సృష్టించారు. ‘రాష్ట్రపతిగా నా ఎన్నిక దేశంలోని పేదలు తమ కలలు నిజం చేసుకోగలరనే దానికి ఉదాహరణ’ అంటారు ద్రౌపది ముర్ము.
ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో ఎంబీయే పూర్తిచేసిన మాధవి పురి బుచ్ భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తొలి మహిళా చైర్పర్సన్గా నియమితులయ్యారు. అంతేకాదు, ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్లే ఆ హోదాలో ఉన్నారు. అలా కాకుండా.. ప్రైవేటు రంగం నుంచి ఎంపికైన నాన్-ఐఏఎస్గా కూడా వార్తల్లో నిలిచారు. అంతర్జాతీయంగా, జాతీయంగా మార్కెట్లు ఒడుదొడుకులు చవిచూస్తున్న సమయంలో.. ప్రపంచంలోనే ఐదో అతిపెద్దదైన భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ అధినేత్రిగా మాధవి ముంగిట ఎన్నో సవాళ్లు ఉన్నాయి.
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేసిన ఫల్గుణి ఆ తర్వాత ఆంత్రప్రెన్యూర్ అవతారం ఎత్తారు. భారతదేశం నుంచి సొంతంగా ఎదిగిన వందకోట్ల డాలర్ల శ్రీమంతురాళ్ల జాబితాలో చేరారు. నైకా బ్రాండ్ పేరుతో ఆన్లైన్లో బ్యూటీ, ఫ్యాషన్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు ఫల్గుణి. అంతేకాదు, సెల్ఫ్ మేడ్ భారతీయ బిలియనీర్ మహిళల జాబితాలో చాలా ఏండ్లుగా తొలి స్థానంలో ఉన్న ఫార్మా దిగ్గజం కిరణ్ మజుందార్ షా స్థానాన్ని ఆక్రమించారు. అయితే ఇది నాణేనికి ఒక వైపే. ఈ ఏడాది నైకాను స్టాక్ ఎక్సేంజిలో లిస్ట్ చేసిన తర్వాత నాయర్ కంపెనీ విలువ కరిగిపోయింది. దీంతో ఫల్గుణి సంపద 6.5 బిలియన్ డాలర్ల నుంచి 2.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ ఆమె వందకోట్ల డాలర్ల శ్రీమంతుల స్థాయిని కోల్పోలేదు.
బ్రిటిష్ భారతీయ వ్యాపార ఎగ్జిక్యూటివ్ అయిన లీనా నాయర్ ఫ్రాన్స్కు చెందిన విలాస వస్తువుల సంస్థ
చానెల్కు మొదటి మహిళా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో). దీనికి ముందు ఆమె యూనిలీవర్లో ముఖ్య మానవ వనరుల అధికారిగా సేవలందించారు. ఈ పదవికి రాజీనామా చేసి, 2022 జనవరిలో చానెల్
సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జన్మించిన లీనా ఎన్నో కట్టుబాట్ల మధ్య పెరిగారు. వాటిని అధిగమించి లక్ష్యాలను చేరుకోగలిగారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో ఇంజి
నీరింగ్, హ్యూమన్ రీసోర్సెస్లో ఎంబీయే చేసిన లీనా హిందుస్థాన్ యూనిలీవర్లో ట్రెయినీగా కెరీర్ ఆరంభించారు. అదే సంస్థలో ఉన్నత స్థానాలకు ఎగబాకారు. అంతేకాదు, హెచ్యూఎల్లో 25 ఏండ్ల కెరీర్లో ఆ సంస్థలో అతి విలువైన ఉద్యోగిగా నిలిచారు. హెచ్యూఎల్ నాయకత్వ స్థానాల్లో 50 శాతం మంది మహిళలు ఉన్నారంటే.. అందుకు కారణం ఆమె చొరవే. ‘ఫార్చ్యూన్ ఇండియా’ అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు.
మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ.. భారత్ తరఫున బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్ సాధించిన మహిళలు. 2022 మే 20న టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్స్ గెలిచి, స్వర్ణ పతకం సాధించిన 5వ భారతీయ మహిళగా నిలిచింది నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్. తండ్రి మహ్మద్ జమీల్ అహ్మద్తో చిన్నప్పుడెప్పుడో స్టేడియానికి వెళ్లింది. అక్కడ తోటి బాలికలు అన్ని ఆటలూ ఆడుతున్నారు. ఒక్క బాక్సింగ్ తప్ప! ఆ ఆట అబ్బాయిలకేనా? అని ప్రశ్నించుకుంది నిఖత్ జరీన్. ఆ ప్రశ్నకుజవాబు కూడా తానే ఇచ్చింది.. ఈ ఏడాది భారత్ తరఫున వివిధ వేదికలపై అందుకున్న పతకాల రూపంలో. ఇటీవల భోపాల్ వేదికగా జరిగిన జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లోనూ బంగారు పతకం సాధించి ఏడాదిని విజయవంతంగా ముగించింది.
ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారతదేశానికి రెండేండ్ల అవకాశం నేటితో ముగిసిపోతుంది. ఈ సందర్భంలో డిసెంబర్ నెలకు గాను భారత్ అధ్యక్ష స్థానంలో కొనసాగింది. ఈ నేపథ్యంలో భారత్లో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘ప్రజాస్వామ్యం గురించి మాకెవ్వరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు…’ అంటూ మనదేశానికి ప్రజాస్వామ్యం చాలా పాతదే అని ప్రపంచ దేశాలకు గుర్తుచేసి, అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు ఐరాసలో భారత శాశ్వత దౌత్యవేత్త రుచిరా కాంబోజ్.
1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన రుచిర, ఐరాసలో తొలి భారతీయ శాశ్వత మహిళా దౌత్యవేత్త కావడం గమనార్హం. ఇంతకుముందు ఆమె దక్షిణాఫ్రికా, భూటాన్ దేశాల్లో భారత రాయబారిగా సేవలందించారు. యునెస్కో సంస్థకు భారత శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తించారు. వివిధ దేశాల్లో భారత్ తరఫున దౌత్య కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ప్రపంచాన్ని యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో భారత్ గొంతును ఒక మహిళ వినిపిస్తుండటం గర్వకారణం. దేశ మహిళలకు స్ఫూర్తిదాయకం.
భారతీయ ఆదివాసుల కష్టనష్టాలను కళ్లకుకడుతూ కవితలు రాయడంలో జసింటా కెర్కెట్టాను మించినవారు లేరు. జార్ఖండ్లో పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో.. ఓరాన్ ఆదివాసీ తెగలో జన్మించిన జసింటా స్వతంత్ర జర్నలిస్ట్. జార్ఖండ్ రాజధాని రాంచీలో సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ చేశారామె. ఆ తర్వాత జార్ఖండ్, ఒడిశా రాష్ర్టాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల ఆదివాసులు మనుగడ కోసం చేస్తున్న పోరాటం గురించి నిరంతరం పత్రికలకు వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. వాటిలో చాలా వరకూ జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ‘ఆదివాసులు తమ ప్రాంతాల్లో నీటిని, భూమిని, అడవిని కాపాడుకునేందుకు పోరాడాల్సి వస్తున్నది, మన దేశంలో వలస పాలన మనస్తత్వం ఇప్పటికీ పోలేదు’ అంటారామె.
ప్రముఖ ఫార్మా సంస్థ ‘బయోలాజికల్ ఇ. లిమిటెడ్’ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచిపోయారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ -2022 ప్రకారం ఆమె సంపద విలువ 8,700 కోట్ల రూపాయలు. 45 ఏండ్ల మహిమ లండన్లోని వెబ్స్టర్ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. 2001 నుంచి బయోలాజికల్.ఇలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తండ్రి మరణం తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. తాను సంస్థలో చేరినప్పటినుంచీ వ్యాక్సిన్ల తయారీపట్ల శ్రద్ధ చూపుతూ వచ్చారు. కొవిడ్ 19 ప్రొటీన్ సబ్ యూనిట్తో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సిన్ అయిన కోర్బెవ్యాక్స్ బయోలాజికల్.ఇ ఆవిష్కరణే.
భారత వాయుసేనలో కంబాట్ ఏవియేటర్గా చేరిన తొలి మహిళగా వార్తల్లో నిలిచారు 26 ఏండ్ల అభిలాషా బరాక్. హిమాచల్ప్రదేశ్ సనావర్లోని లారెన్స్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన అభిలాష తండ్రి కల్నల్ ఓం సింగ్. అలా నాన్న దగ్గరే సైన్యానికి సంబంధించిన ఓనమాలు దిద్దుకున్నారు. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి 2016లో ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజినీరింగ్ పట్టా తీసుకున్న అభిలాష 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ దళంలో చేరారు. ఒక్క అభిలాష మాత్రమే కాదు… మాయా సూదన్ (ఇండియన్ ఎయిర్ఫోర్స్లో తొలి మహిళా ఫైటర్ పైలట్), హీనా జైస్వాల్ (తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీర్) లాంటి ఎంతోమంది యువతులు ఈ రంగంలో చరిత్ర సృష్టిస్తున్నారు.
పరుగుల రాణిగా పేరుగాంచిన పీటీ ఉష 1980లలో ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అథ్లెటిక్స్ శిక్షణలోనూ విజయవంతంగా రాణించిన ఉష 2022లో భారత ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ)కు తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి చరిత్రకెక్కారు.
హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తనయ రోష్నీ నాడార్ మల్హోత్రా. వ్యాపారమే కాకుండా రోష్నికి వన్యప్రాణులన్నా ఇష్టం. అందుకే 2018లో ‘ద హేబిటేట్స్ ట్రస్ట్’ స్థాపించారు. స్థానిక జీవ జాతులను కాపాడటం, పర్యావరణ పరిరక్షణ ఈ సంస్థ లక్ష్యాలు.
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ‘కేబ్యూటీ’ సంస్థతో.. వేగన్ సౌందర్య సాధనాల వ్యాపారంలో తనదైన ముద్ర వేశారు. అందులో చర్మానికి హానిచేసే పారాబెన్స్, టాక్సిన్లు ఉండవు. మూడేండ్లలో రూ.100 కోట్ల టర్నోవర్ సాధించి ఫోర్బ్స్ జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు కత్రినా.