సర్కారు బడుల్లో చదివే పిల్లలు గుమస్తా కొలువు సాధించడమే గొప్ప అనుకుంటుంది సమాజం. కానీ, నిరుపేద బాలికల కలలకు రెక్కలు కట్టి అంతరిక్షానికి ఎగిరేంత శక్తినిచ్చారు శ్రీమతి కేశన్. చెన్నైలోని ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ నేతృత్వంలో ‘ఆజాదీశాట్’ను ప్రారంభించారు కేశన్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కమ్యూనికేషన్ శాటిలైట్ను చేరువ చేయడం దీని ఉద్దేశం.
దేశంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులను ఎంచుకొని.. ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు అవసరమైన కోడ్ రాయడంలో ట్రైనింగ్ ఇస్తున్నారామె. ఇప్పటికే, ఆజాదీశాట్ విద్యార్థులు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎనిమిది కిలోల బరువైన క్యూబ్ శాట్ను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.
ఇప్పటివరకు 3500 మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు స్పేస్ సైన్స్లో శిక్షణ ఇచ్చారు. వీరిలో దాదాపు వంద మంది అంతరిక్ష స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుకునే రోజుల్లో కేశన్ ఎన్సీసీ క్యాడెట్. పారాట్రూపర్ కూడా. ఓసారి, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఫ్లోరిడాలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనే అవకాశం వచ్చింది కేశన్కు. అక్కడే తనమనసులోని మాట బయటపెట్టారు. నాసాకు ఆ ఐడియా నచ్చింది. అదే ఏడాది 108 మంది విద్యార్థులను యూఎస్ తీసుకెళ్లి అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని చూపించింది. ఇప్పటి వరకు 3500 మంది విద్యార్థులకు ఈ వర్క్షాప్లో పాల్గొనే అవకాశం కల్పించారు కేశన్. మరో రికార్డు కూడా సృష్టించారామె. ఆస్ట్రోనాట్ చార్లీ డ్యూక్తో కలిసి జీరో గ్రావిటీలో ప్రయాణించారు. అలా, సున్నా గురుత్వాకర్షణను అనుభవించిన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచిపోయారు.