గంటలకొద్దీ కూర్చునే ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. దీంతో సాధారణ ఆహారం తీసుకున్నా .. కొలెస్ట్రాల్ పేరుకుపోతున్నది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఆహారం ఉత్తమం?
-ఓ పాఠకురాలు
స్మార్ట్ఫోన్ వాడకం పెరిగిపోయాక.. కూరగాయలు కొనడానికి, సరుకులు తెచ్చుకోవడానికి కూడా బయటికి వెళ్లడం లేదు మనం. దీనికి తోడు, రోజంతా కూర్చుని చేసే ఉద్యోగాలు శరీరాన్ని కదలకుండా చేస్తున్నాయి. దీంతో మాంసాహారులు, శాకాహారులు అన్న తేడా లేకుండా కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతున్నది. జంక్ఫుడ్, డీప్ ఫ్రై పదార్థాల ద్వారా శరీరంలో సంతృప్త కొవ్వులు అధికం అవుతాయి. ఇవి చాలా ప్రమాదకరం. వాటి స్థానంలో అధిక పీచు, ప్రొటీన్ ఉన్న పదార్థాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. వీటివల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే అన్నంలాంటివి తక్కువగా తింటాం.
కాబట్టి పండ్లతో పాటు, మొలకలు, కూరగాయల ముక్కలు, రాగులు, సజ్జలు, జొన్నల్లాంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని సలాడ్లు, జావ రూపంలో భోజనానికి ముందుగాని, భోజనానికి భోజనానికి మధ్యకానీ తీసుకోవచ్చు. బజ్జీలు, సమోసాల్లాంటి వాటి స్థానంలో పండ్లు, గుగ్గిళ్లు మొదలైనవి తినాలి. ఉదయం తొమ్మిదికంతా అల్పాహారం, మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం, రాత్రి ఎనిమిదిలోపు డిన్నర్ పూర్తి చేయాలి. పదింటికంతా నిద్రపోయి ఉదయాన్నే లేచి పనులు చేసుకునేలా ఏర్పాటు చేసుకుంటే మేలు. వీటితో పాటు ఆఫీసులో ప్రతి గంటకూ కుర్చీలోంచి లేచి కాస్త నడవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది.
-మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@ gmail.com