తెలంగాణ యువ గాయని, నెట్టింటి సంచలనం.. మెదక్ మట్టిలోని మాణిక్యం శర్వాణి మరోమెట్టు ఎక్కింది. తమిళ ‘రాక్స్టార్’ కార్యక్రమానికి రాకెట్లా దూసుకెళ్లింది. ‘కన్నా నీ తూంగడా.. ఎన్ కన్నా నీ తూంగడా’ అంటూ తంబీలను తన స్వరంతో ఓలలాడిస్తున్నది.
మిరుమిట్లు గొలిపే లైటింగ్, ఫాగ్ సెట్టింగ్, చుట్టూ కెమెరాలు, ఎదురుగా న్యాయ నిర్ణేతలు. వెన్నంటే.. తను ఎంతో ఇష్టపడే సంగీత దర్శకుడు దేవిశ్రీ. ఇక భయమెందుకు? ‘వన్.. టు.. త్రీ.. స్టార్ట్’ అనగానే తన మధురమైన గొంతుతో ‘రంగమ్మా.. మంగమ్మా.. ఏ రంగమ్మా మంగమ్మా.. ఏం పిల్లడూ..’ అంటూ పాట అందుకుందో లేదో, ఎవరో పెద్ద సింగర్ పాడుతున్నట్లు కరతాళ ధ్వనులు! మరింత ఉత్సాహంతో ‘కన్నా.. నీ తూంగడా’ అంటూ తమిళ పాట ఎత్తుకోవడంతో విజిల్స్, చప్పట్లతో ఆ వేదికంతా కోలాహలం! పల్లెపాటలు పాడుకొనే టీనేజర్కు ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది? ‘అదొక మరచిపోలేని అనుభూతి’ అంటున్నది శర్వాణి. ఇప్పటివరకూ ‘రేలారే.. రేలారే.. పల్లె మట్టివాసనలే.. స్వచ్ఛమైన మనుషులే.. బంగారుభూమి జగములో.. నా తెలంగాణ’ అంటూ గొంతెత్తిన శర్వాణి.. హఠాత్తుగా తమిళనాట సెలబ్రెటీ అయింది.
అనుకోకుండా ఒకరోజు..
శర్వాణి కుటుంబాన్ని పరామర్శించి వెళ్దామని వచ్చిన దూరపు బంధువు సురేంద్ర తిప్పరాజు సరదాగా శర్వాణితో ఒక పాట పాడించారు. ఆమెకు తెలియకుండా ఫోన్లో రికార్డ్ చేసి, ట్విటర్లో కేటీఆర్కు ట్యాగ్ చేశారు. ఆ పాట నచ్చడంతో మంత్రి ట్విటర్లో తమన్, దేవిశ్రీలకు ట్యాగ్ చేసి, ఇటువంటివాళ్లను ప్రోత్సహించాలని సూచించిన విషయం తెలిసిందే. శర్వాణి ప్రతిభను మెచ్చిన తమన్.. రాబోయే సినిమాల్లో అవకాశం ఇస్తానని మాటిచ్చారు. దేవిశ్రీ ఆమెను చెన్నై తీసుకెళ్లి జీ తమిళ్ ‘రాక్స్టార్’లో పాడే అవకాశం కల్పించారు. ‘కేటీఆర్ సార్! మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా. శర్వాణిని ఆదివారం 7.30కి జీ తమిళ్ టీవీలో చూడండి’ అంటూ ట్వీట్ చేశారు డీఎస్పీ.
పాటలంటే ప్రాణం..
మెదక్జిల్లా నార్సింగికి చెందిన యువగాయని శర్వాణికి బాల్యం నుంచీ పాటలంటే ప్రాణం. ఆ స్వరాన్ని కొందరు ఎగతాళి చేసేవారు. ఆ కసితో కఠోర సాధన చేసింది, సంగీతంపై మరింత పట్టు పెంచుకుంది. నార్సింగి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకూ పాటల పోటీల్లో బహుమతులన్నీ ఆమెకే. కూతురి ప్రతిభను గుర్తించారు తండ్రి లక్ష్మణచారి. శర్వాణికి రామాచారి సంగీత అకాడెమీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న శర్వాణి భవిష్యత్లో గొప్ప సింగర్ కావాలనుకుంటున్నది. ‘శర్వాణి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయ్.. నీకు తప్పకుండా అవకాశం ఇస్తా’ అని దేవిశ్రీ ఆమెకు అభయమిచ్చారు. ‘నన్ను సంగీత ప్రపంచానికి పరిచయం చేసిన మంత్రి కేటీఆర్గారికి, మా సురేంద్ర అంకుల్కి.. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దేవిశ్రీగారికి, తమన్ గారికి కృతజ్ఞతలు’ అంటూ ఆనందాన్ని ‘జిందగీ’తో పంచుకున్నది శర్వాణి.
…డప్పు రవి