‘ఓం విశ్వరక్షాకృతే నమః’
‘ఓం జగదాధారాయ నమః’
వినాయకుడి అష్టోత్తర శతనామాల్లో వినిపిస్తాయివి. విశ్వాన్ని రక్షించే ఆకృతి కలవాడు అని, జగత్తుకు ఆధారమని అర్థం. ఈ మంత్రాలను సరిగ్గా అర్థం చేసుకుంటే.. ప్రకృతి పురుషుడైన విఘ్నేశ్వరుడి ఉత్సవం పర్యావరణ హితం అవుతుంది. విత్తన గణపతిని కొలిచి ఆరాధిస్తే రాష్ట్రం, దేశం హరిత భరితం అవుతుంది.
సనాతన సంప్రదాయంలో ప్రతి పండుగా ప్రకృతి నుంచి పుట్టి ప్రకృతిలో కలిసిపోయేదే. పర్యావరణానికి మేలు చేసేదే. ఊరూరా, వాడవాడలా వేడుకగా జరిగే వినాయక చవితి ఉద్దేశమూ ఇదే! గరిక ప్రియుడు, చెరకు గడల చెలికాడు అయిన వినాయకుడి ఆరాధనలో ప్రకృతి ఉత్పత్తులదే సింహభాగం. కానీ, విఘ్నరేడుకు మారేడు సమర్పించాలంటే దొరకదు. కరివీరుడికి ‘కరవీర పత్రం సమర్పయామీ’ అందామంటే ఆ ఆకు కనిపించదు. చుట్టుపక్కల మొక్కలేవి? ఊరి చివరన చెట్లేవి? ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజలు పూనుకున్నప్పుడే ప్రకృతి పరవశిస్తుంది. పచ్చదనం పురుడుపోసుకుంటుంది. ఈ బృహత్కార్యానికి విఘ్నాలు లేకుండా వినాయకుడి నుంచే శ్రీకారం చుట్టారు కొందరు ప్రకృతి ప్రేమికులు. విత్తన గణపతి ప్రతిమలను విరివిగా పంచుతూ స్వామికార్యంతో లోక కల్యాణానికి శ్రీకారం చుట్టారు.
పర్యావరణానికి కొత్త శక్తినిచ్చే శక్తితనయుని ఉత్సవం వినాయకచవితి. కానీ, చవితి సంబురాల్లో ప్రకృతి పాత్ర నానాటికీ తగ్గిపోతున్నది. అంతేకాదు మట్టి గణపతిని ప్రతిష్ఠించడాన్ని నామోషీగా భావిస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారైన విగ్రహాలను, రసాయన రంగులతో ముస్తాబైన మూర్తులను తెచ్చి మంటపంలో ఉంచుతున్నాం. అయితే, పూజాదికాల్లో లోటుపాట్ల దోషం తొలగిపోవడానికి ‘మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం..’ అంటూ క్షమాప్రార్థన చదివే వెసులుబాటు కల్పించారు. కానీ, పండుగ లక్ష్యాన్ని మరచి చేస్తున్న ఈ వేడుకల కారణంగా ముందు తరాలు మనల్ని క్షమించవు. ఆ దోషం పట్టి పీడించకుండా ఉండాలంటే.. మట్టి వినాయకుడే మహా వినాయకుడన్న స్పృహ అందరిలో రావాలి. విత్తన గణపతి విశేష గణపతి అనే నిశ్చయానికి రావాలి. అప్పుడు తొమ్మిది రోజులు పూజలందుకున్న వినాయకుడు మరో పదిరోజుల్లో మొక్కగా మొలుస్తాడు. చెట్టుగా పెరుగుతాడు. వృక్షమై శతాబ్దాలు నిలిచి ఉంటాడు. చల్లనిగాలితో నిత్యం ఆశీర్వదిస్తుంటాడు. భావితరాలకు తియ్యని పండ్లను ప్రసాదంగా అనుగ్రహిస్తాడు.
విత్తన వినాయకుడి ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎందరో ప్రజాప్రతినిధులు ప్రచారం నిర్వహిస్తున్నారు. లక్షల్లో విత్తన వినాయకుడి విగ్రహాలు తయారు చేయించి, ఉచితంగా సరఫరా చేస్తున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్తో దేశవ్యాప్తంగా పచ్చదనం పెంచే క్రతువు నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ విత్తన వినాయకుడి ప్రతిమలు వేలాదిగా పంపిణీ చేస్తున్నారు. ఈ వినాయక చవితికి విత్తన గణపతిని ప్రతిష్ఠించుకుందాం. నవరాత్రులు పూర్తయ్యాక దానిని ఇంటి పెరట్లో పాదుచేసి సంరక్షిద్దాం. చెట్టుగా ఎదిగిన గణపతిని ప్రతిరోజూ దర్శించుకుందాం. ఆయన చల్లని నీడలో కాసేపు సేదదీరుదాం. ఇప్పుడు కావాల్సింది ఎత్తయిన విగ్రహం కాదు.. విత్తయిన విగ్రహమని లోకానికి చాటి చెబుదాం.