సృష్టిలో ప్రతి జీవీ ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే! కానీ, మట్టికి కూడా మట్టికొట్టుకుపోవాల్సిన దుస్థితి వస్తే? ఆ ప్రశ్నే.. ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్ను కలవరపరిచింది. ‘గమనిస్తున్నారా? మనమంతా ఆడుకున్న మట్టి, గూడు కట్టుకున్న మట్టి, పంట పండించిన మట్టి, మన ఒంటికి పేరుకుపోయిన మట్టి.. నిర్జీవమైపోతున్నది. ఇప్పటికైనా నిర్లిప్తత వీడకపోతే విలువైన మృత్తికలన్నీ.. మృత్యు దిబ్బలుగా మారుతాయి. వద్దు. ఆ పరిస్థితి రావొద్దు!’ అంటూ హెచ్చరికతో కూడిన సందేశాన్ని చేరవేయడానికి మోటర్ సైకిలు మీద విశ్వయాత్ర ప్రారంభించారు జగ్గీ.
వంద రోజులు. ముప్పైవేల కిలోమీటర్లు. ఇరవై ఏడు దేశాలు. ఒంటరి ప్రయాణం.. ఒకటే లక్ష్యం.. మట్టిని కాపాడుకోవాలి. మానవజాతిని నిలబెట్టుకోవాలి. అవును. మానవజాతి మనుగడ మొత్తం మట్టితోనే ముడిపడి ఉంది. మట్టిలోని పోషకాలు మట్టికొట్టుకుపోయిన నాడు.. మనిషి మృత్యువుకు దగ్గరైనట్టే. నిస్సారమైన మట్టి నిర్జీవమైన ఆహారాన్ని ఇస్తుంది. విటమిన్లు, ఖనిజాలు.. మచ్చుకైనా ఉండవు. ఆ తిండి తినడం, ప్లాస్టిక్ను నమలడం.. రెండూ ఒకటే. క్రమంగా శరీరం శుష్కిస్తుంది, మెదడు మొరాయిస్తుంది, ఆలోచన మందగిస్తుంది. చావు సమీపిస్తుంది. అంతానికి అదే ఆరంభం. ఇదేం, కట్టుకథ కాదు. సాధికారిక హెచ్చరిక. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ ప్రకారం, 2050 నాటికి భూమి మీదున్న నేలలో 90% పైగా నిస్సారం కావచ్చు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆహారం, నీటి కొరత ఏర్పడుతుంది. కరువు కాటకాలు మొదలవుతాయి. ప్రతికూల వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సామూహిక వలసలు అధికమవుతాయి. ఎన్నో విపత్తులు, సంక్షోభాలు చుట్టుముడతాయి. కుత్తుక మీదికి వస్తున్న ఆ పెనువిపత్తును అధిగమించాలంటే ఒకటే దారి.. మట్టిని రక్షించుకోవాలి. ‘సేవ్ సాయిల్’.. అని నినదించాలి. ఆ ప్రళయ సంకేతాన్ని సద్గురు అందరికంటే ముందుగానే గుర్తించారు. తొలి హెచ్చరికా ఆయనదే. పరిష్కారం దిశగా తొలి అడుగూ ఆయనదే. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మంది ప్రజలను.. అంటే ప్రపంచ ఓటర్లలో 60% మందిని చేరుకోవడం లక్ష్యంగా.. జగ్గీ వాసుదేవ్ విశ్వయాత్ర మొదలైంది. ఇప్పటికే ఆరు కరీబియన్ దేశాలు తమ నిబద్ధతను వ్యక్తీకరిస్తూ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
మేము సైతం..
నేలలో కనీసం ఆరు శాతమైనా సేంద్రియ గుణం ఉండాలి. ఆ లెక్కలో తేడా వస్తే.. ఆహారంలో పోషక గుణాలు తగ్గిపోతాయి. అదే జరుగుతున్నది ఇప్పుడు. ఒకప్పుడు ఒక యాపిల్ తింటే సరిపోయేది. తగినన్ని పోషకాలు అందేవి. ఇప్పుడు, పది యాపిల్స్ తిన్నా.. అందులో ఆరోగ్య విలువలు అంతంత మాత్రమే. మట్టికి లేని సత్తువ పండుకు మాత్రం ఎక్కడినుంచి వస్తుంది? సారవంతమైన నేలలో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించవచ్చు. దీనివల్ల జల వనరులనూ పొదుపు చేసుకోగలం. బౌద్ధ గురువు దలైలామా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ క్లాస్ స్క్వాబ్ వంటి ప్రపంచ నాయకులు జగ్గీకి మద్దతు ఇస్తున్నారు. మార్క్ బెనియోఫ్ (సేల్స్ఫోర్స్), దీపక్ చోప్రా, టోనీ రాబిన్స్, మాథ్యూ హెడెన్, క్రిస్ గేల్, జూహీ చావ్లా, సంజీవ్ సన్యాల్.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ‘జై జగ్గీ’ అంటున్నారు. పిడికెడు మట్టిని ఒంటికి విభూతిలా పూసుకుని.. మనమూ నేలను కాపాడుకొనే పోరాటంలో పాలుపంచుకుందాం. సేవ్.. సాయిల్!