సద్గురు జగ్గీ వాసుదేవ్.. మట్టిని రక్షించుకునేందుకు గట్టి ఉద్యమం చేపట్టారు. ‘సేవ్ సాయిల్’ నినాదానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు స్పందించాయి. సద్గురుతో ఏకీభవిస్తూ సంతకాలు చేశాయి. ఆ ప్రయాణంలో మజిలీగా, మట్టి ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ వచ్చారు. సేద్యానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కారును మెచ్చుకున్నారు. నేలను ప్రేమించే మన సంప్రదాయాన్ని కొనియాడారు. జగ్గీతో ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..
మట్టిని రక్షించడం గురించి నేను 30 ఏండ్లుగా మాట్లాడుతున్నా. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాధినేతలను, శాస్త్ర వేత్తలను కలిశాను. వారంతా మా ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. కానీ ఏ ఒక్కరూ ఆచరణలోకి తీసుకురాలేదు. అందుకే, ప్రజలవైపు నుంచే ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నాను. నేను దేశాధిపతిని కాదు. నాకు అధికారం లేదు. నాకు ఉన్నదల్లా ప్రజాదరణ, ప్రేమ. దాన్ని ఉపయోగించి ప్రజలకు ఏదైనా చేయాలని అనుకున్నాను. ‘సేవ్ సాయిల్’ (మట్టిని రక్షించు) పేరుతో వంద రోజుల బైక్ యాత్ర చేపట్టాను. మొత్తం 27 దేశాల మీదుగా 30వేల కిలోమీటర్లు ప్రయాణించాలన్నది లక్ష్యం. ఈ క్రమంలో కనీసం 360 కోట్ల మందికి అవగాహన కల్పించాలని తీర్మానించాను. ఇప్పటివరకు 26 వేల కిలోమీటర్లకు పైగా తిరిగాను. కనీసం, ప్రపంచంలోని 60 శాతం మందికి అవగాహన కల్పించాలని, తద్వారా భూ గ్రహాన్ని భద్రంగా భవిష్యత్తు తరాల చేతిలో పెట్టాలన్నది మా సంకల్పం.
74 దేశాలు ముందుకు..
మట్టికి పునర్జీవం పోసేందుకు.. మేము ప్రత్యేకంగా ‘సాయిల్ రీవైటలైజేషన్ హ్యాండ్ బుక్’ తయారుచేశాం. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలకు పాలసీ డాక్యుమెంట్స్ రూపొందించాం. ఆయా దేశాల భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, ఆర్థిక స్థితి, వ్యవసాయ విధానాలు వంటివాటిని శాస్త్రీయంగా విశ్లేషించి ఈ పుస్తకాన్ని రూపొందించాం. ఇప్పటివరకూ 74 దేశాలు మా ప్రతిపాదనకు అంగీకరించాయి. మరిన్ని దేశాలు ముందుకొస్తున్నాయి. ఆఫ్రికన్ యూనియన్ కూడా ఆసక్తి చూపిస్తున్నది. మన దేశంలో అనేక రాష్ర్టాలు అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తాజాగా, తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ పూర్తయింది. ఆర్థిక భారం మోయలేని చిన్నచిన్న దేశాలకు సాయం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం.
ఉద్యమాన్ని కొనసాగిస్తాం
వంద రోజుల యాత్రతో సేవ్ సాయిల్ ఉద్యమం ఆగిపోదు. ఇకపై, ప్రభుత్వాలు మా ప్రతిపాదనలను ఆచరణలో పెట్టేలా లేదా సొంతంగా పాలసీలు రూపొందించేలా ఒత్తిడి తెస్తాం. వచ్చే ఏడాది మన దేశంలో జీ-20 సదస్సు జరుగనున్నది. అక్కడ మా స్వరం వినిపిస్తాం. సేంద్రియ పదార్థాలు నేలలో చేరేందుకు రెండు ప్రధాన మార్గాలు.. చెట్లు, పాడి పశువులు. ఈ రెండూ లేకుండా ఆర్గానిక్ లైఫ్ లేదు. నేల రాత్రికి రాత్రే నిర్జీవం కాలేదు. ఆ దురదృష్టకర పరిణామం.. దశల వారీగా సంభవించింది. నేల జీవం కోల్పోతున్న కొద్దీ జీవజాతులు నశిస్తాయి. అమెరికా ఇప్పుడు సంపన్న దేశం కావచ్చు.. కానీ భూమి నిస్సారమైతే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రాబోయే 25-40 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తీవ్రం అవుతుంది.
మార్కెటింగ్ ఎత్తుగడ
ఆర్గానిక్.. అనే పదం ఇప్పుడు ఒక మార్కెటింగ్ ఎత్తుగడగా మారిపోయింది. నిజానికి, ఎంత సారం ఉన్న భూమిలో పంట పండిందనేది ప్రచారంలోకి రావాలి. ఎంత సేంద్రియ శాతం పెరిగితే.. ఆ ఉత్పత్తుల్లో అంతమేర పోషకాలు పెరుగుతాయి. తద్వారా ఆరోగ్యాలు బాగుపడతాయి. ఉత్పాదకత పెరుగుతుంది. ప్రభుత్వాలకు వందల కోట్లు మిగులుతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 1 శాతం సారం ఉన్న భూమిలో పండిన 6 పండ్లను తింటే వచ్చే పోషకాలను.. 6 శాతం సారం ఉన్న భూమిలో పండే ఒక్క పండుతో పొందవచ్చు. దీనివల్ల మన తిండి ఖర్చు తగ్గుతుంది. ఎక్కువగా తినే అవసరమూ తప్పుతుంది. పోషకాల కోసం పళ్లాలకు పళ్లాలు తినడం వల్ల శరీర వ్యవస్థలపై అదనపు భారం పడుతున్నది. కాబట్టి, మట్టిని బాగుచేసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. దవాఖానలకు వెళ్లే ఖర్చు తప్పుతుంది. ప్రభుత్వంపై ఒత్తిడీ తగ్గుతుంది. వందల కోట్ల నిధులు మిగులుతాయి. ఈ కోణంలో ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉన్నది.
సద్గురుకు జ్ఞాపికను బహూకరిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్
తెలంగాణలో గొప్ప వనరులు..
తెలంగాణలో పుష్కలమైన జల వనరులు, సారవంతమైన భూములు ఉన్నాయి. వ్యవసాయ సంప్రదాయం విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్రానికైనా, దేశానికైనా వ్యవసాయ సంప్రదాయమే విలువైన సంపద. దేశంలో 60 శాతం మంది రైతులు ఉన్నారు. అందులో 2 శాతం మంది కూడా తమ పిల్లల్ని రైతులను చేయడానికి ఇష్టపడటం లేదు. ఆ ధోరణిని మార్చాలి. లేకపోతే 30-40 ఏండ్ల తర్వాత రైతులే ఉండరు. వ్యవసాయ సంప్రదాయాన్ని రాత్రికి రాత్రే సృష్టించలేం. ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలి.
నా యాత్ర
నా ప్రయాణంలో అనేక అవాంతరాలను ఎదుర్కొన్నాను. ప్రమాదాల అంచులకూ వెళ్లాను. ప్రతిచోటా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. యూరప్లో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు.. సేవ్ సాయిల్ కార్డులతో నాకు స్వాగతం పలికారు. జర్మనీ విద్యాశాఖ అధికారికంగా అన్ని పాఠశాలల విద్యార్థులనూ సేవ్ సాయిల్లో భాగస్వాములు కావాలని కోరింది.
– కాసాని మహేందర్ రెడ్డి