లగ్జరీ కార్ల ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఆటోమొబైల్ వీరాభిమానులకు ఎన్ని ఫీచర్లున్నా చాలవు. ఇంకొన్ని, మరికొన్ని కావాలనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే వివిధ కంపెనీలు కొత్తకొత్త మోడల్స్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఆ రకంగా ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నది.. రోల్స్రాయ్స్ బోట్ టెయిల్ కారు. దీని ధర అక్షరాలా రూ.200 కోట్లు. ప్రస్తుతం ఉన్న ఖరీదైన కార్లలో ఇదే నంబర్ వన్ అని చెప్పొచ్చు. ఇదో నాలుగు చక్రాల లగ్జరీ కారు. 19 అడుగుల పొడవుతో కార్ల ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. గతంలో విడుదలైన స్వీప్టెయిల్ మోడల్ వంటి ఖరీదైన కార్ల స్ఫూర్తితో డిజైన్ చేసింది రోల్స్రాయ్స్ కంపెనీ. దీన్ని తయారు చేయడానికి ఆ కంపెనీ ఉద్యోగులు నాలుగేండ్ల సమయం తీసుకున్నారు. 2021లో బోట్ టెయిల్ మోడల్ కార్లు మూడు మాత్రమే విడుదలయ్యాయి. కానీ, కొనడానికి మాత్రం కనీసం మూడువేల మంది విశ్వకుబేరులు వరుసలు కట్టారు. అవసరమైతే బ్లాక్లో అయినా, సొంతం చేసుకోవాలని తహతహలాడారు. కానీ, ఆ అదృష్టం ముగ్గురికే దక్కింది.