అన్నాచెల్లెండ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతీక అయిన రక్షాబంధన్ సందర్భంగా గో రక్షణ ప్రాధాన్యం తెలియజేస్తున్నారు ఇద్దరు అతివలు. గోమయంతో రాఖీలు తయారు చేసి సమాజాన్ని ఆనందమయం చేస్తున్నారు. ఆ ఇద్దరూ.. అక్కాచెల్లెండ్లు కాదు. అంతకు మించిన అనుబంధం వారిని ఒక్కటి చేసింది. ఇద్దరూ దివ్యాంగులే! లోపానికి కుంగిపోకుండా దివ్యంగా ముందుకు వెళ్తున్నారు. ‘దివ్య హస్త’ పేరుతో సొసైటీని ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు కామారెడ్డికి చెందిన పోశవ్వ, ఆఫీసా బేగం.
పోశవ్వ, ఆఫీసా అందరిలా పరుగెత్తలేకపోవచ్చు. కానీ, వారి ఆలోచనలది మెరుపువేగం. మతాలు వేరైనా ఇద్దరి అభిమతాలూ కలిశాయి. తమలోని సృజనాత్మకతే పెట్టుబడిగా కళాత్మక వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు. పోశవ్వది కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం. పోలియో కారణంగా ఆమె నడువలేదు. 2018లో కలెక్టర్ సత్యనారాయణ ప్రోత్సాహంతో తన స్నేహితురాలు ఆఫీసాతో కలిసి ‘దివ్య హస్త’ సొసైటీని ప్రారంభించారామె. ఈ క్రమంలో రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. రకరకాల ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఫినాయిల్, సర్ఫ్, ఫ్లోర్ క్లీనర్ తయారు చేస్తుంటారు. హోటళ్లు, దవాఖానలు, వసతి గృహాల నుంచి భారీ ఆర్డర్లే వస్తుంటాయి. ప్రతి పండుగకూ విలక్షణ ఉత్పత్తులు రూపొందించి విక్రయిస్తుంటారు.
రాఖీల (గో)మయం
వినాయకచవితికి మట్టి వినాయకులు తయారు చేస్తారు. దీపావళి వస్తుందంటే మట్టి ప్రమిదల ఉత్పత్తి ప్రారంభిస్తారు. వీటికి కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. సమాజహితాన్ని కోరుతూ మట్టి వినాయకులను తయారు చేయడం ప్రారంభించామని చెబుతారు పోశవ్వ. వీరి మనసెరిగిన కొనుగోలుదారులు, దారి వెతుక్కొని వచ్చి మరీ గణపతి ప్రతిమలను తీసుకుంటారు. ఈసారి మరింత వినూత్నంగా ఆలోచించారు వీళ్లు. ఏటా రాఖీలు తయారు చేస్తున్నా.. ఈ పండుగకు రక్షాబంధన్తో పర్యావరణ రక్షణ సందేశాన్ని అందివ్వాలని భావించారు. గోమయంతో రాఖీలు చేయాలని సంకల్పించారు. ఆ ప్రయత్నంలో ఆవు పేడను సేకరించారు. పర్యావరణానికి హాని కలిగించని రంగులు కొనుగోలు చేశారు. 48 విభిన్న డిజైన్లలో రాఖీలు రూపొందించేలా సాంచాలు (నమూనాలు) రూపొందించారు. వీటి హంగును పెంచేలా రంగులు అద్దారు. సోదరుడి చేతిలో మెరిసిపోయేలా చెమ్కీలతో ముస్తాబు చేశారు.
సోషల్ ప్రచారం
సమాజహితం కోరుతూ ప్రజలను ఆకర్షించాలనే ఆలోచనతో గోమయం రాఖీలు తయారు చేశామంటారు పోశవ్వ. ఆవుపేడ, రెడీమిక్స్ మిశ్రమంతో వీటిని డిజైన్ చేశారు. ఒక్కో రాఖీ ధర పది రూపాయలుగా నిర్ణయించారు. ఇద్దరూ కలిసి వేల రాఖీలు తయారు చేశారు. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లు వేదికగా ప్రచారం కల్పించారు. ‘మా ప్రయోగం విజయవంతం అయింది. 20 రోజుల్లో 6,000 రాఖీలకుపైగా అమ్ముడయ్యాయి ’ అని చెప్పుకొచ్చారు పోశవ్వ. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల రూపకల్పనకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఒక్కో విగ్రహాన్ని రూ.150కి విక్రయించనున్నట్టు చెబుతున్నారు. ఈ ఇద్దరు దివ్యాంగుల స్ఫూర్తిని, పర్యావరణం పట్ల వారికి ఉన్న శ్రద్ధనూ అందరూ మెచ్చుకుంటున్నారు.
… జూపల్లి రమేశ్రావు, నిజామాబాద్