కావలసిన పదార్థాలు
పెసర్లు: ఒక కప్పు, బియ్యపు పిండి: ఒక కప్పు, బెల్లం: ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: చిటికెడు.
తయారీ విధానం
పెసర్లను దోరగా వేయించుకోవాలి. కుకర్లో మూడున్నర కప్పుల నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు వాటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ తీసిన తర్వాత సన్నని మంటపై పెట్టి కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసి పప్పుగుత్తితో మెత్తగా మెదిపి దగ్గరపడ్డాక దించి చల్లార్చాలి. ఒక గిన్నెలో బియ్యపు పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లుపోసి జారుగా కలిపి స్టవ్మీద పెట్టి ముద్ద అయ్యేవరకూ కలుపుతూ ఉడికించాలి. పిండి మిశ్రమాన్ని ముద్దలా బాగా కలిపి కొద్దికొద్దిగా తీసుకుని చిన్నపాటి పూరీల్లా ఒత్తి, మధ్యలో పెసర మిశ్రమం పెట్టి కజ్జికాయల్లా మడవాలి. వాటిని ఆవిరిపాత్రలో పావుగంటపాటు ఉడికించుకుంటే వేడివేడి పెసర బెల్లం కుడుములు సిద్ధం.