Nithya menen | సాధన వల్ల కాకుండా సహజసిద్ధంగా అబ్బిన ఏ కళలోనైనా మరింత పరిపూర్ణత, సాధికారత కనిపిస్తుంది. మలయాళీ సోయగం నిత్యామీనన్ అభినయం కూడా అదే కోవకు చెందుతుంది. ఎక్కడా నాటకీయత కనిపించని సహజమైన నటనకు ఆమె పెట్టింది పేరు. దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో నిత్యనూతన అభినయంతో ఈ భామ ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. నిత్యామీనన్ కథానాయికగా నటించిన పీరియాడిక్ చిత్రం ‘స్కైలాబ్’. ఈ సినిమా నిర్మాతల్లో ఆమె ఒకరు కావడం విశేషం. డిసెంబర్ 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘జిందగీ’ నిత్యామీనన్ను పలకరించింది.
నిర్మాతగా మారడానికి ‘స్కైలాబ్’ చిత్రంలో ప్రేరణనిచ్చిన అంశాలేమిటి?
దర్శకుడు విశ్వక్ కథ చెప్పిన విధానం, స్క్రీన్ప్లే ట్రీట్మెంట్ చాలా కొత్తగా అనిపించింది. కథ ఇంటర్వెల్ వరకు వినగానే నటించాలని నిర్ణయించుకున్నా. అయితే నిర్మాతగా ఈ సినిమాలో భాగం కావడానికి కొంచెం సమయం తీసుకున్నా. తెలంగాణలోని ఓ పల్లెటూరు బండలింగంపల్లిలో జరిగే కథ అయినప్పటికీ, సినిమా నేపథ్య సంగీతం వెస్ట్రన్ ఫీల్తో ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ చాలా కొత్తగా అనిపించాయి. ఏదైనా చిత్రాన్ని సాధారణ సూత్రాలకు భిన్నంగా తీర్చిదిద్దడం నాకు బాగా నచ్చుతుంది. అందుకే ఈ సినిమా ద్వారా నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా.
ఒకవైపు నటిస్తూనే నిర్మాతగా కూడా బాధ్యతలు స్వీకరించడం వల్ల ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా?
షూటింగ్ సమయంలో కేవలం నటనపైనే దృష్టి పెట్టా. అప్పుడు సెట్లో వ్యవహారాలు మరో నిర్మాత పృథ్వీ చూసుకునేవాడు. చిత్రీకరణ పూర్తయిన తర్వాతే నిర్మాత బాధ్యతలేమిటో తెలిసొచ్చాయి. సినిమా నిర్మాణంలోని ఒత్తిళ్లు, సమస్యలు అనుభవంలోకి వచ్చాయి. వాటిని అధిగమించడం ఎలాగో క్రమంగా అర్థం చేసుకున్నా.
1979 నాటి స్కైలాబ్ ఉదంతాన్ని ఈ సినిమాలో ఏమైనా ప్రస్తావించారా?
అలాంటిదేం లేదు. నాటి సంఘటన స్ఫూర్తితో దర్శకుడు విశ్వక్ రాసుకున్న సొంత కథ ఇది. ఈ సినిమా కథా చర్చల్లోనే నేను తొలిసారి స్కైలాబ్ ఉదంతం గురించి విన్నా. ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నలను స్కైలాబ్ గురించి అడిగాను. వాళ్లు ఎన్నో కథలు చెప్పారు. వింటుంటే నాకు ఆశ్చర్యమేసింది. ‘ఇన్ని రోజులు ఇలాంటి ఆసక్తికర సంఘటన గురించి నాకెందుకు చెప్పలేదు? నా దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదు ఎందుకు?’ అని ప్రశ్నించా. నేటి తరానికి స్కైలాబ్ గురించి అస్సలు తెలియదు. పాతతరం వారికి ఆ సంఘటనతో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అందుకే, ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే భావన కలిగింది.
ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పినట్టున్నారు. ఎలా ఫీలయ్యారు?
షూటింగ్ లొకేషన్లోనే లైవ్ సింక్సౌండ్ సాంకేతికతతో సంభాషణల్ని రికార్డ్ చేశాం. డైలాగ్ డెలివరీలో ఏమైనా మార్పులుచేర్పులు ఉంటే డబ్బింగ్కు వెళదామని అడిగా. ‘మీరు చెప్పిన సంభాషణల్లో ఒక్క డైలాగ్కు కూడా డబ్బింగ్ అవసరం లేదు. అంత పర్ఫెక్ట్గా చెప్పారు’ అని మా టెక్నీషియన్స్ మెచ్చుకున్నారు. ఈ సినిమా కోసం తెలంగాణ యాసను నేర్చుకున్నా. లొకేషన్స్లో ప్రతి ఒక్కరితో తెలంగాణ యాసలో మాట్లాడటం వల్ల త్వరగా నేర్చుకోగలిగా. తెలంగాణ యాస అంటే నాకు చాలా ఇష్టం. ఐ రియల్లీ లవ్ దట్ స్లాంగ్. ఇట్ సౌండ్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు కూడా అదే యాసలో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా.
సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమైనా హోమ్వర్క్ చేశారా?
అలాంటిదేమీ లేదు. ఎలాంటి పాత్రనైనా నేను ఇట్టే ఆకళింపు చేసుకుంటా. కెమెరా ముందుకు రాగానే నా క్యారెక్టర్లోకి వెళ్లిపోతా. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కొంత భాగం సినిమా చిత్రీకరణ జరిపాం. తెలంగాణ పల్లెలు చాలా అందంగా కనిపించాయి. రియల్ లొకేషన్స్లో షూటింగ్ చేయడం వల్ల పాత్రపరంగా మరింత సహజత్వాన్ని ప్రదర్శించేందుకు అవకాశం కలిగింది.
ఇప్పటివరకు మీ కెరీర్లో చాలెంజింగ్గా అనిపించిన పాత్రలు ఏమైనా ఉన్నాయా?
నేను నటనను పరిపూర్ణంగా ఆస్వాదిస్తా. ఎంజాయ్ చేస్తూ చేసే ఏ పనిలోనైనా చాలెంజెస్ ఉండవని నా అభిప్రాయం. ఏ క్యారెక్టర్ చేసినా అందులోకి ప్రవేశించడానికి నేను ఎక్కువ సమయం తీసుకోను. కథ వింటున్నప్పుడే పాత్ర స్వభావాన్ని, తీరుతెన్నులను అవగతం చేసుకుంటా. నా పాత్రను అర్థం చేసుకోవడానికి ఒకటి రెండు రోజుల సమయం తీసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు.
నిర్మాతగా మారారు కాబట్టి ఖర్చు విషయంలో పరిమితులు తెలుసుకున్నారా?
సాధారణంగా ఆర్టిస్టులకు సినిమాపరమైన ఆర్థిక విషయాలపై పెద్దగా అవగాహన ఉండదు. వాటి గురించి పెద్దగా పట్టించుకోరు కూడా. నిర్మాతగా మారిన తర్వాత ఖర్చులు ఎలా నియంత్రించాలో తెలుసుకున్నా. డబ్బు కోసం నేను నిర్మాతగా మారలేదు. కథ బాగా నచ్చింది కాబట్టి ఆ బాధ్యతను తీసుకున్నా. సీనియర్ నిర్మాతలు రమేష్ప్రసాద్, సీవీ రెడ్డిగార్లను నేను బాగా అభిమానిస్తా. షూటింగ్కు ముందు ఇద్దరినీ కలిసి నేను నిర్మాతగా మారుతున్నానని చెప్పాను. వారు చాలా సంతోషించారు.
ఈ సినిమా విజయంపై మీరు ఎలాంటి ధీమాతో ఉన్నారు?
కథ విన్నప్పుడే ఈ సినిమా విజయం తథ్యమనే భావన కలిగింది. షూటింగ్ పూర్తయిన తర్వాత సక్సెస్పై మరింత నమ్మకం పెరిగింది. ఓటీటీ ఆఫర్లొచ్చినా వద్దనుకున్నాం. సినిమాకు సంబంధించిన బిజినెస్ విషయంలో మా టీమ్ అంతా కలిసి నిర్ణయాలు తీసుకున్నాం. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లోనే ఎక్కువగా ఆస్వాదిస్తారని అనుకుంటున్నా. భవిష్యత్తులో కూడా మంచి కాన్సెప్ట్స్తో ఎవరైనా వస్తే నిర్మాతగా చిన్న బడ్జెట్ సినిమాలు చేయాలనుకుంటున్నా.
ఇంతకూ పెండ్లి ఎప్పుడు?
ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు. అయినా పెండ్లి ఎందుకండీ? జీవితానికి అనవసరమైన టెన్షన్స్ను యాడ్ చేసుకోవాలా? (నవ్వుతూ).
దర్శకుడు త్రివిక్రమ్గారు ఫోన్ చేసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్లో నటించాలని అడిగారు. ఆయన నా గురించి పవన్ కల్యాణ్ దగ్గర ‘లేడీ పవన్ కల్యాణ్ వస్తున్నది.. మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్గా సెట్టవుతుంది’ అని చెప్పారట. షూటింగ్ సెట్లో త్రివిక్రమ్గారు పవన్ కల్యాణ్ ముందే నన్ను ‘లేడీ పవన్ కల్యాణ్’ అంటూ సరదాగా పిలిచారు. పవన్ కల్యాణ్తో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనెప్పుడూ ప్రశాంతంగా, నవ్వుతూ కనిపిస్తారు. నేను నిర్మాతగా సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు ఆయన హ్యాపీగా ఫీలయ్యారు.
ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నా. వచ్చే ఏడాదిలోగా అవన్నీ రిలీజ్ కానున్నాయి. తెలుగులో గమనం, స్కైలాబ్, భీమ్లానాయక్ చిత్రాల్లో నటిస్తున్నా. అమెజాన్ప్రైమ్ ఒరిజినల్ కోసం ‘కుమారి శ్రీమతి’ అనే సిరీస్లో నటిస్తున్నా. ఇందులో నేను రాజమండ్రి అమ్మాయిగా కనిపిస్తా. కథలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. హిందీలో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి.
ఈ సినిమా కథ తెలంగాణలోని బండలింగంపల్లిలో జరిగినప్పటికీ తెరపై పూర్తి సహజమైన గ్రామీణ వాతావరణం కనిపించదు. ఛాయాగ్రహణం, సంగీతం పరంగా ఓ కొత్త ఫీల్తో ఉంటుంది. సినిమా అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సౌండ్ట్రాక్ మొత్తం వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్తో సాగుతుంది. ఇలా పూర్తి భిన్నమైన కథ, సాంకేతికాంశాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది.
…? కళాధర్ రావు జూలపల్లి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nithya Menen | పవన్కల్యాణ్తో పనిచేయడం చాలా ఈజీ : నిత్యమీనన్
Nithya Menen | చీరలో అదరగొట్టిన నిత్యా మీనన్
గత సీజన్ లో మోనల్ గజ్జర్.. ఈ సీజన్లో ప్రియాంక సింగ్
Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ఒకప్పుడు టాలీవుడ్లో చక్రం తిప్పిన ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా..?