ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
రెండు రోజుల క్రితమే సిరివెన్నెల కిమ్స్లో చేరినట్టు తెలుస్తోంది. ఆయన గత కొన్ని రోజుల నుంచి న్యుమోనియాతో బాధపడుతున్నారు. దీంతో దానికి చికిత్స తీసుకునేందుకే ఆయన కిమ్స్లో చేరినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని ఇంకా కిమ్స్ వైద్యులు వెల్లడించలేదు.
సినీ గేయ రచయితగా సిరివెన్నెల 1986లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సిరివెన్నెల సినిమాతోనే ఆయన ఫేమస్ అవడంతో.. ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. అదే సినిమాకు ఆయనకు ఉత్తమ లిరికిస్ట్గా నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఆయన తెలుగులో వందల సినిమాలకు పాటలు రాశారు.