క్యాన్సర్ లక్షణాలు అంటేనే.. మరణానికి ఆనవాళ్లు. అప్పటికే తొలిదశలో ఉంటే జీవితం చరమాంకానికి చేరినట్టే. ఇక మలిదశ అంటే.. మరణ ధ్రువపత్రమే! నిజమే, నిన్నమొన్నటి వరకూ క్యాన్సర్ మందులేని మాయరోగమే! అయితే, ప్రస్తుతం అత్యాధునిక థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. చివరిదశలో ఉన్న రోగులకు కూడా నాణ్యమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి.
క్యాన్సర్ -పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేది ఒకప్పుడు. ప్రస్తుతం, పరిస్థితులు మారిపోతున్నాయి. అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్ రోగుల జీవన ప్రమాణాలూ పెరుగుతున్నాయి. ఐదేండ్ల క్రితం ‘హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ’ (హైపెక్) అనే పద్ధతి వైద్య ప్రపంచానికి పరిచయమైంది. కానీ మూడేండ్ల నుంచి మాత్రమే మన దగ్గర.. అదీ అతికొద్ది హాస్పిటల్స్లో ఈ చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఇటీవల మరో కొత్త పద్ధతి కూడా నిపుణుల ఆదరణ పొందుతున్నది. అదే ‘ప్రెషరైజ్డ్ ఇంట్రాపెరిటోనియల్ ఏరోసోల్ కీమో థెరపీ(పైపెక్). హైపెక్, పైపెక్.. ఈ రెండు థెరపీలనూ ఎలాంటి క్యాన్సర్ల చికిత్సలో వాడతారు, ఏ దశలో అయితే ఉత్తమం, అసలు చికిత్సా విధానం ఎలా ఉంటుంది, ఈ థెరపీల వల్ల లాభాలేమిటి? అనేది తెలుసుకుందాం.
పెరిటోనియం క్యాన్సర్లు
పొత్తికడుపులోని అవయవాల పైపొరకు వ్యాపించే క్యాన్సర్లను ‘పెరిటోనియల్ క్యాన్సర్లు’ అంటారు. మన శరీరాన్ని చర్మం సంరక్షించినట్టుగానే, పొత్తికడుపులోని భాగాలను సైతం ఒక ప్రత్యేకమైన పొర కాపాడుతూ ఉంటుంది. ఈ పొర పేరే ‘పెరిటోనియం’. దీనికి క్యాన్సర్ వ్యాపించడం వల్ల రోగి మనుగడ సంక్షోభంలో పడుతుంది. క్యాన్సర్ పెరిటోనియం పొర వరకూ వ్యాపించిందీ అంటే రుగ్మత చివరిదశలో ఉన్నట్టే. ఈ దాడి రెండు దశల్లో జరుగుతుంది.
ప్రైమరీ పెరిటోనియల్ క్యాన్సర్లు
పొత్తికడుపులోని పెరిటోనియం పొరపై నేరుగా ఏర్పడే క్యాన్సర్లన్నీ ప్రైమరీ పెరిటోనియల్ క్యాన్సర్ల కిందికే వస్తాయి. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియవు. పెరిటోనియల్ క్యాన్సర్లలో ఇవి పదిశాతం మాత్రమే.
సెకెండరీ పెరిటోనియల్ క్యాన్సర్లు
పొత్తికడుపులోని ఇతర అవయవాలపై ఏర్పడిన క్యాన్సర్ పెరిటోనియం పొరకు వ్యాపిస్తే అలాంటి క్యాన్సర్లను ‘సెకెండరీ పెరిటోనియల్ క్యాన్సర్స్’ అంటారు. పెరిటోనియం క్యాన్సర్లలో తొంభై శాతం వరకూ ఈ విభాగంలోకి వచ్చేవే. ఉదాహరణకు పొత్తికడుపులోని పెద్దపేగులో ఉన్న కొలరెక్టల్, అపెండిక్స్, ఉదరం, అండాశయాలు, గర్భసంచి తదితర అవయవాలపై ఏర్పడిన క్యాన్సర్లు.. అక్కడితో ఆగకుండా వాటిపైన ఉన్న పెరిటోనియం పొరకూ వ్యాపిస్తాయి. ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే అంత వరకూ వెళ్లకుండా అరికట్టవచ్చు. అవగాహనా లోపం వల్ల, కొన్ని వైద్యపరమైన కారణాల వల్ల క్యాన్సర్లు పెరిటోనియం వరకూ చొచ్చుకువెళ్లి చివరిదశకు చేరుకుంటాయి. గతంలో క్యాన్సర్ వ్యాధి పెరిటోనియం వరకూ వచ్చిందంటే.. ఇక చికిత్స ఆపేసేవారు. ‘పాలియేటివ్ కేర్’ మాత్రమే ఇచ్చేవారు. అంటే, పరోక్షంగా మరణానికి సన్నద్ధం చేసేవారు. కానీ ప్రస్తుతం, ‘హైపర్థర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమోథెరపీ’ (హైపెక్)తో రోగి జీవిత కాలాన్ని పెంచగలుగుతున్నారు.
హైపెక్ థెరపీ
సాధారణంగా కీమోను రక్తనాళాల ద్వారా ఇస్తారు. కానీ, ‘హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ’ (హైపెక్) విధానంలో మాత్రం కీమోను నేరుగా పొత్తికడుపులోని క్యాన్సర్ ప్రభావిత భాగానికే ఇస్తారు. ముందుగా క్యాన్సర్ బారినపడిన పెరిటోనియం పొరను శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. ఆ వెంటనే క్యాన్సర్ ప్రభావిత భాగానికి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కీమోను యంత్ర పరికరం ద్వారా వేడిచేసి ఇస్తారు. ఈ ప్రక్రియలో కీమో యంత్రంలోనే వేడెక్కి రోగి శరీరంలోని క్యాన్సర్ ప్రభావిత అవయవానికి చేరుకుంటుంది. అక్కడ చల్లబడిన తర్వాత, తిరిగి యంత్రానికి చేరుకుని.. మళ్లీ 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడెక్కి తిరిగి ప్రభావిత భాగానికి చేరుకుంటుంది. ఇలా 90 నిమిషాలపాటు హైపెక్ థెరపీ జరుపుతారు. ఈ ప్రక్రియ ద్వారా చివరిదశకు చేరుకున్న క్యాన్సర్ కణాలను సైతం నశింపచేసి, రోగి జీవితకాలాన్ని పెంచగలుగుతారు. ఈ పద్ధతి మనదేశంలో ఐదేండ్ల క్రితం అందుబాటులోకి వచ్చినా, గడిచిన మూడేండ్ల నుంచి మాత్రమే విరివిగా వినియోగిస్తున్నారు. ఈ థెరపీని శస్త్రచికిత్స తరువాత ఒక్కసారి మాత్రమే చేస్తారు.
పైపెక్ థెరపీ
శస్త్రచికిత్స అసాధ్యమైన సంక్లిష్ట పరిస్థితుల్లో ‘ప్రెషరైజ్డ్ ఇంట్రా పెరిటోనియల్ ఏరోసోల్ కీమో థెరపీ (పైపెక్)ను క్యాన్సర్ రోగులకు అందిస్తారు. ఈ థెరపీని 4 నుంచి 6 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. ల్యాపరోస్కోపీ పద్ధతిలో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ముందుగా ల్యాపరోస్కోపీ విధానంలో పొత్తికడుపులోకి ‘పోర్ట్స్’ వేసి.. వ్యాధి తీవ్రతను తెలుసుకుంటారు. దీంతోపాటు చికిత్సకు వ్యాధి ఎలా స్పందిస్తున్నదో కూడా బేరీజు వేస్తారు. ఇందుకోసం ప్రతిసారీ వ్యాధి ప్రభావిత భాగానికి బయాప్సీ చేస్తారు. ఈ చికిత్సా విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తొలుత, ద్రవరూపంలో ఉన్న కీమోను ఏరోసోల్(ఆవిరి) రూపంలోకి మారుస్తారు. ఈ క్రమంలో 0.2 మైక్రాన్స్ డయామీటర్ పరిమాణంలోని కీమో ఏరోసోల్స్ వ్యాధి ప్రభావిత ప్రదేశంపై దాడిచేస్తాయి. ఆ దెబ్బకు క్యాన్సర్ కారకాలు నశిస్తాయి. ఇలా మూడువారాలకు ఒకసారి చొప్పున మొత్తం ఆరుసార్లు ఏరోసోల్ రూపంలో కీమో ఇస్తారు. దీనివల్ల వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి రోగి జీవితకాలం పెరగడంతోపాటు, నాణ్యమైన జీవనం లభిస్తుంది. గతంలో శస్త్రచికిత్స చేసే వీలులేని రోగులకు కేవలం సపోర్టింగ్ కేర్ మాత్రమే ఇచ్చేవారు. దీంతో జీవితకాలం హారతి కర్పూరంలా కరిగిపోయేది. కానీ ప్రస్తుతం, పైపెక్ థెరపీతో క్యాన్సర్ చివరిదశలో ఉన్న రోగి జీవితకాలాన్ని సైతం పెంచవచ్చు.
ఇతర క్యాన్సర్లకు
పెరిటోనియల్ క్యాన్సర్లతోపాటు మెసోథిలియోమా క్యాన్సర్కు సైతం పై రెండు పద్ధతుల్లో చికిత్స అందించవచ్చు. మెసోథిలియోమా అంటే ఛాతీభాగంలో ఉండే ఊపిరితిత్తులు, ఛాతీగొట్టాలు, అన్నవాహిక తదితర భాగాలు. ఈ భాగాలు కూడా పొత్తికడుపులోని అవయవాల మాదిరిగానే ‘ప్లూరా’ పొరతో కప్పబడి ఉంటాయి. వ్యాధి ఈ ప్లూరా పొరకు చేరినప్పుడు, శస్త్రచికిత్స తర్వాత హైటాక్ (హైపర్థర్మిక్ ఇంట్రాథొరాసిక్ కీమోథెరపీ)తో చికిత్స అందిస్తారు. శస్త్రచికిత్స చేయడానికి వీలులేని రోగులకు పైటాక్ (ప్రెషరైజ్డ్ ఇంట్రాథొరాసిక్ ఏరోసోల్ కీమోథెరపీ)తో వైద్యాన్ని కొనసాగిస్తారు.
– డాక్టర్ అజయ్ చాణక్య వల్లభనేని
కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్
కిమ్స్ హాస్పిటల్,
హైదరాబాద్
– మహేశ్వర్రావు బండారి