జార్ఖండ్లోని ఓ గిరిజన తెగలో జన్మించిన సుమిత్రకు చిన్ననాటి నుంచీ ఎన్నో సవాళ్లు. తిండికి, చదువుకు అనేక ఇబ్బందులు. పదిహేడో ఏటనే పెండ్లి చేసుకొని, అత్తారింట అడుగుపెట్టింది. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత, కొడుకే కావాలంటూ సుమిత్రను భర్త, అత్తమామలు పెట్టని హింసలేదు. అయినా తట్టుకొని నిలబడింది. గ్రామీణ ఆరోగ్యంపై పనిచేసే ‘ఎక్జుత్’ అనే ఎన్జీవోలో చేరింది. తన సీనియర్ల ద్వారా భర్త, అత్తమామలకు కౌన్సెలింగ్ ఇప్పించి దారికి తెచ్చింది. ఎంతోమంది గిరిజన మహిళల ఇబ్బందులను కండ్లారా చూసిన సుమిత్ర సింఘ్భూమ్ జిల్లా అంతా పర్యటించింది. మహిళలతో సమావేశాలు నిర్వహించింది. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయించింది. మానసికంగా కుంగిపోతూ, ఆత్మహత్యలవైపు వెళ్లాలనుకునేవారికి ధైర్యం చెప్పింది. అలా 12 ఏండ్లలో దాదాపు 36వేల మంది గిరిజన మహిళల జీవితాలను మార్చింది. 100 మందిని ఆత్మహత్యల నుంచి కాపాడింది. సీఐఐ ఫౌండేషన్ నుంచి ప్రతిష్ఠాత్మక అవార్డునూ అందుకున్నది సుమిత్ర.