mahesh bigala | బడిలో.. నాలుగు గోడలు.. నలుదిక్కులు. బ్లాక్ బోర్డు.. ఓ విజ్ఞాన సర్వస్వం. గణగణ గంటలు.. కాలం విలువకు ప్రతీకలు. ఆట మైదానం.. విజయాల స్ఫూర్తి కేంద్రం. బెత్తం దెబ్బలు.. చిత్తానికి క్రమశిక్షణ పాఠాలు. మొత్తంగా పాఠశాల.. ఓ వ్యక్తిత్వ వికాస శిక్షణశాల. కాబట్టే ఓనమాలు దిద్దించి, ఒకటి రెండ్లు నేర్పించి, శతకాలు చెప్పించి, ప్రతిజ్ఞ చేయించి, జనగణమన పాడించి.. విశ్వ పౌరుడిగా తీర్చిదిద్దిన బడిని, కోటి రూపాయల నిధులతో తీర్చిదిద్దుతున్నారు ప్రవాస భారతీయుడు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ సారథి మహేశ్ బిగాల.
తన ఒడిలో పెరిగిన బిడ్డ.. ప్రయోజకుడై, ప్రవాసుడై తనను పలకరించడానికి వస్తున్నప్పుడు కన్నతల్లి పొందే ఆనందాన్నే.. చదువుల తల్లీ అనుభవిస్తున్నది. నలుగురితో పంచుకోవడం, ప్రేమాభిమానాలు పెంచుకోవడం.. బడి ఆవరణే నేర్పిందంటారు మహేశ్ బిగాల. బాల్యంలో బడి గోడమీద చదివిన ‘పెద్దలను గౌరవించవలెను’, ‘తోటివారికి సాయపడవలెను’ తదితర నీతి వాక్యాలు తన గుండెల్లో పదిలంగా ఉన్నాయని చెబుతారు. అక్షరాలు నేర్పిన బడికి ఆధునిక హంగులు సమకూర్చే అవకాశం తనకూ, తన కుటుంబానికీ దక్కినందుకు మురిసిపోతారు. ఆ ఆవరణలోని ప్రతిమూలా ఆయనకు ఎరుకే. ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి.. ప్రతి తరగతీ తన జీవనగతిని మార్చిందని సగర్వంగా ప్రకటిస్తారు. నేడు, తనకు రాత నేర్పిన బడికి దాత హోదాలో వెళ్తున్నారు ఆయన. ఆ విద్యా సంస్థల అధినేత ఒకానొక విద్యార్థిలా ఆవరణంతా కలియతిరుగనున్నారు. ‘చిన్నప్పుడు, నన్ను అందుకోవడానికి మునివేళ్ల మీద నిలబడిన పిల్లగాడు.. ఈ స్థాయికొచ్చిండా?’ అంటూ నల్లబల్ల తెల్లబోతూ ఎదురు చూస్తున్నది.
మహేశ్ బిగాల, ఆయన సోదరుడు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా.. ఇద్దరూ ప్రాథమిక విద్యను మాక్లూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే పూర్తి చేశారు. గణేశ్ గుప్తా రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. మహేశ్ బిగాల అంతర్జాతీయ వ్యాపార దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ సారథిగా ఉద్యమ సమయం నుంచి నేటి వరకూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లో రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ను స్థాపించి ప్రపంచ ప్రమాణాలతో పాఠశాల విద్యను అందిస్తున్నారు. అమెరికాలో ఐటీ కంపెనీని, ఆస్ట్రేలియాలో విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు. ‘ఎంతెత్తుకు ఎదిగినా మన మూలాలను మరచిపోకూడదు. మన బడిని విస్మరించకూడదు. నా ఆలోచన చెప్పగానే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత నిండు మనసుతో ప్రోత్సహించారు. పాఠశాలను సమూలంగా మార్చేందుకు, జిల్లా పరిషత్ పాఠశాలకు నాన్న బిగాల కృష్ణమూర్తి పేరు, ప్రాథమిక పాఠశాలకు తాతయ్య గంగారామ్ పేరు పెట్టేందుకు అనుమతించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడిగా.. నేను ఆ మహానేత వందేండ్ల పండుగ నిర్వహణలో పాలుపంచుకున్నాను. అదే స్ఫూర్తితో నాన్న పేరు మీద రెండు ఎకరాల్లో స్మృతి వనాన్ని నిర్మిస్తున్నాం’ అంటున్నప్పుడు ఆ విద్యావేత్తలో ఓ పాఠశాల విద్యార్థిలోని అణకువ. ఒకేసారి ఇలా జీవితాన్నిచ్చిన తండ్రి రుణమూ, వ్యక్తిత్వాన్నిచ్చిన బడి రుణమూ తీర్చుకునే అవకాశం ఎంతమందికి దక్కుతుందీ?
తాను, తన సోదరుడు, తోబుట్టువులు.. రాణి, శ్రీవాణి ఒకటో తరగతి నుంచీ చదివిన బడిని అన్నివిధాలా ఒకటో స్థానంలో నిలపాలన్నది మహేశ్ సంకల్పం.
బిగాల సోదరుల తండ్రి దివంగత కృష్ణమూర్తి కూడా పాఠశాల పూర్వ విద్యార్థే. కాబట్టే, ఆ కుటుంబం సర్కారీ విద్యాలయాన్ని ఓ దేవాలయంలా చూస్తుంది. మాక్లూర్ బడి.. ఒకప్పుడు, చుట్టుపక్కల ఇరవై గ్రామాలకు విద్యా ప్రదాత. ఇప్పటికీ పది పల్లెల పిల్లలు చదువుల కోసం ఆ బడి ఒడిలోనే వాలతారు. బిగాల సోదరుల స్వస్థలమైన మాక్లూర్ సాంకేతికంగా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఆశన్నగారి జీవన్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. స్థానిక శాసన సభ్యుడి సహకారంతో స్వగ్రామంలోని సర్కారు బడిని అభివృద్ధి చేయాలన్నది గణేశ్ గుప్తా ఆకాంక్ష. ప్రభుత్వం తరఫున రూ.4.50 కోట్లు మంజూరు అయ్యేలా ఇరువురు ఎమ్మెల్యేలూ చొరవ తీసుకున్నారు. దీనికి బిగాల కృష్ణమూర్తి ఫౌండేషన్ చిత్తశుద్ధి కూడా తోడైంది.
విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాల, ఖరీదైన ఫర్నిచర్.. ఇలా వసతులు కల్పించడంతోనే తమ బాధ్యత తీరిపోతుందని బిగాల సోదరులు భావించడం లేదు. అమెరికాలోని అత్యుత్తమ పాఠశాలలతో సమానంగా, హైదరాబాద్లోని ఖరీదైన విద్యాలయాలకు దీటుగా మాక్లూర్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకూ నాణ్యమైన విద్యను అందించాలన్న అక్షర యజ్ఞంలో ఇది తొలి భాగం మాత్రమే.
నేను కూడా పల్లెటూరు నుంచి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తినే. పదో తరగతి వరకు నా విద్యాభ్యాసం అంతా సర్కారు బడిలోనే సాగింది. ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు విద్యాబుద్ధులు నేర్పిన మాక్లూర్ ఉన్నత పాఠశాలనే కారణం. ముఖ్యమంత్రి కేసీఆర్గారి స్ఫూర్తితో ఉద్యమాల్లో పనిచేశాను. రెండు పర్యాయాలూ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. నా ద్వారా ప్రజలకు మేలు జరగాలన్నది నా ఆశయం. ఇందులో భాగంగా, నేను చదువుకున్న బడిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాను. మా తండ్రి కృష్ణమూర్తి జ్ఞాపకార్థం, బిగాల కుటుంబం ఆధ్వర్యంలో.. పాఠశాలను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దాలని తీర్మానించాం.
– బిగాల గణేశ్ గుప్తా , ఎమ్మెల్యే, నిజామాబాద్ అర్బన్
మా తండ్రి బిగాల కృష్ణమూర్తికి చదువంటే ప్రాణం. మా నలుగురినీ బాగా చదివించారు. చాలా మంది పేద విద్యార్థులకు అండగా నిలిచారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వ్యవస్థాపక చైర్మన్గా చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కాలేజీలో చేరేలా ప్రోత్సహించారు. తనే ఫీజులు కట్టారు. పరీక్షల సమయంలో మధ్యాహ్న భోజనం పెట్టించారు. పట్టుబట్టి, నాటి ప్రభుత్వాన్ని ఒప్పించి శాశ్వత భవనాలు మంజూరు చేయించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా మాక్లూర్ పాఠశాలలో మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఆ మహావ్యక్తి బిడ్డలుగా, నాన్న ఆశయాలను కొనసాగిస్తాం.
– మహేశ్ బిగాల, వ్యాపారవేత్త
… ✍ జూపల్లి రమేశ్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
pneumonia | పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
హైదరాబాదీలు ఇష్టంగా లాగించేస్తున్న ఈ కొత్తరకం స్వీట్ గురించి తెలుసా?
హద్దులు చెరిపి.. సరిహద్దుల వరకూ!