Mahesh Bigala | తాము బాగుండాలని అందరూ కోరుకుంటారు. అందరూ బాగుండాలనీ, అందులో తామూ ఉండాలని కొందరు మాత్రమే కోరుకుంటారు. అలాంటి అరుదైన మనిషి.. బిగాల మహేశ్ గుప్తా. ఆ పేరు గుర్తొస్తే తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐల పోరాటం గుర్తుకొస్తది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయన నిర్వహిస్తున్న విద్యాసంస్థలు గుర్తుకొస్తయి. మాక్లూర్ బడి కూడా రేపు అట్లనే ఉండాలన్నది మహేశ్ సంకల్పం. ‘మన ఊరు-మన బడి’ కోసం తానిచ్చిన కోటి రూపాయల విరాళంతో బడిని బాగు చేసే అక్షర యజ్ఞానికి ఆయన శ్రీకారం చుట్టిండు. ఇదే స్ఫూర్తితో ఎన్ఆర్ఐలు కదిలి రావాలె. ఊరు బాగు కోరి.. బడిని బాగు చేయాలె.
ప్రవాసులు.. ప్రపంచ పౌరులు. సాంస్కృతిక రాయబారులు. మనవైన విలువలకు ప్రతినిధులు. సొంతగడ్డ అభివృద్ధిలో ఆ ముద్దుబిడ్డల పాత్ర ఉండితీరుతుంది. ప్రవాస భారతీయుడు బిగాల మహేశ్గుప్తాకు కూడా తన సొంతూరు.. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ అంటే ప్రాణం. అందులోనూ, అక్షరాలు దిద్దించిన బడిని గుడిలా భావిస్తారు. కాబట్టే, విశ్వశ్రేణి విద్యాలయాన్ని, విశ్వ విద్యాలయాన్ని నిర్వహిస్తున్న అనుభవాన్ని రంగరించి.. ఆ సర్కారు పాఠశాలకు అంతర్జాతీయ ప్రమాణాలు జోడించాలని నిశ్చయించారు. ఆ లక్ష్యానికి తండ్రి బిగాల కృష్ణమూర్తి సంకల్పమూ తోడైంది. విద్యకు జీవితాన్ని మార్చే శక్తి ఉందని నమ్మేవారు దివంగత కృష్ణమూర్తి. మాక్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. ప్రతి తరగతిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చేవారు. ఆ ఆవరణ ఎంతోమందిని ఉన్నత విద్యావంతులను చేసింది. కానీ ఆ చదువుల గుడి ఇప్పుడు శిథిల స్థితిలో ఉంది. పది ఊళ్ల పేదింటి బిడ్డలకు అక్షరభిక్ష పెట్టాల్సిన విద్యాలయమే బిక్కుబిక్కుమనే పరిస్థితిలో ఉంటే.. పిల్లల భవిష్యత్తుకు మాత్రం భరోసా ఉంటుందా? బాధ్యత కలిగిన ప్రవాసుడిగా మహేశ్ గుప్తా వెంటనే స్పందించారు.
కృష్ణమూర్తి, సువర్ణ దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు గణేశ్ గుప్తా నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. రెండో కొడుకు మహేశ్ గుప్తా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ సమన్వయకర్తగా ఉన్నారు. ఆ అన్నదమ్ములతో పాటు తోబుట్టువులు రాణి, వాణి కూడా ఈ ఆవరణలోనే చదివారు. బడి బాగు కోసం స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్తో చాలాసార్లు భేటీ అయ్యారు మహేశ్. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు- మన బడి’ పిలుపునకు స్పందించి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న ‘మన ఊరు – మన బడి’ కింద పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆ కోటి రూపాయల విరాళానికితోడు, ప్రభుత్వం మంజూరు చేసిన 4.7 కోట్ల రూపాయల నిధులతో మాక్లూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. ఈ పథకం ద్వారా తగినన్ని తరగతి గదులతోపాటు, లైబ్రరీ, రీడింగ్ హాల్, ల్యాబ్, టాయ్లెట్లు నిర్మిస్తారు. వేసవి సెలవుల తర్వాత బడులు తెరిచే నాటికి సకల హంగులతో సిద్ధం అవుతుంది.. బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.
తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ఆర్ఐ సెల్ సమన్వయకర్తగా మహేశ్ బిగాల చొరవ అనేక మంది ప్రవాసులకు స్ఫూర్తినిచ్చింది. సొంతూళ్లలోని బడులపై దృష్టి సారించేలా చేసింది. మహేశ్ బాటలో ప్రతి ప్రవాసుడూ నడిస్తే .. సర్కారీ బడుల రూపురేఖలే మారిపోతాయి. ‘పెద్దోళ్ల పిల్లలు ఎట్లాంటి బడిలో చదువుకుంటున్నరో పేదోళ్ల పిల్లలు కూడా అట్లాంటి బడిలో చదవాల’న్నది కేసీఆర్ కల. ఆ స్వప్నాన్ని సాకారం చేసే పథకమే ‘మనఊరు మన బడి’. నిజానికి మహేశ్ బాధ్యత ఇంతటితో తీరిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులందర్నీ కూడగట్టి, ఈ మహత్కార్యంలో భాగం చేయాల్సిన కర్తవ్యాన్ని మంత్రి కేటీఆర్ ఆయనకు అప్పగించారు. ఓ అక్షరాభిమానికి, విద్యారంగ నిపుణుడికి అంతకు మించిన ఆనందం ఏం ఉంటుంది? ఆ లక్ష్యసాధన కోసం సిద్ధం అవుతున్నారు మహేశ్ బిగాల.
నేను ఆస్ట్రేలియాలో విద్యా సంస్థలు నడుపుతున్నాను. హైదరాబాద్లో రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్వహిస్తున్నాను. నా విద్యా సంస్థల్లో ఏ మౌలిక వసతులు ఉన్నాయో మా ఊరి స్కూల్లోనూ అవన్నీ ఏర్పాటు చేస్తాను. సంపన్నుల పిల్లలు ఎలాంటి స్కూల్లో చదువుకుంటున్నారో మా ఊరి పిల్లలు చదివే బడిని కూడా అట్లనే మారుస్తాను. నాకు ఎంతో ఇచ్చిన ఊరికి, నేను కొంత ఇస్తున్నాను. ఇలాగే తెలంగాణ ఎన్ఆర్ఐలు అందరూ ముందుకు రావాలి. మన ఊరి బాగు కోసం మన బడిని బాగు చేసుకుందాం. ‘మన ఊరు – మన బడి’ పథకం ద్వారా కన్న ఊరు, దారి చూపిన బడి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎన్ఆర్ఐలు తమ ఊరి బాగు కోసం కదలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చిండు. ఆ పిలుపుతోనే మా ఊరి బడి బాగు కోసం నేను ముందుకొచ్చిన. ‘మన ఊరు – మన బడి’ స్ఫూర్తితో బంగారు తెలంగాణ కోసం పాటు పడదాం.
– బిగాల మహేశ్ గుప్తా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ సమన్వయకర్త
నిజామాబాద్ జిల్లా మాక్లూర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. మాక్లూర్ ప్రాథమిక పాఠశాలను 1960లో స్థాపించారు. 1969లో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేశారు. మాక్లూర్ వాసులైన బిగాల కృష్ణమూర్తి ఈ పాఠశాల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో 240 మంది, ఉన్నత పాఠశాలలో 335 మంది విద్యార్థులు చదువుతున్నారు. మాక్లూర్తోపాటు చుట్టుపక్కల ఉన్న కృష్ణానగర్, ముల్లంగి, శాంతినగర్, మాదాపూర్, గంగరమంద, వేణుకిసాన్ నగర్, దుర్గానగర్, కింది తండా, సింగంపల్లి నుంచి కూడా విద్యార్థులు ఈ బడికి వస్తున్నారు.
– జూపల్లి రమేశ్రావు
“Mahesh bigala | చదివిన బడిని మరువని ప్రవాసీ.. కోటి రూపాయలు పెట్టి మరీ అభివృద్ధి”